23, నవంబర్ 2017, గురువారం

హాస్యం సృష్టించడం అంత హాస్యం కాదని కీ.శే భమిడిపాటి వారు ఏనాడో సెలవిచ్చారు. పేరుకు నరసింహాలైనా తమ రచనాస్రవంతులతో ఆంధ్రదేశానికి హాస్యామృతాన్ని పంచి హాస్య రచయతల త్రయంగా పేరుగాంచారు ముగ్గురు మహానీయులు. వారు: 1. పానుగంటి లక్ష్మీనరసింహాం (సాక్షి వ్యాసాలు) 2. చిలకమర్తి లక్ష్మీనరసింహం (గణపతి నవల) 3. మొక్కపాటి నరసింహం (బారిస్టరు పార్వతీశం- ఈ పాత్ర ఆంధ్రా బీన్‌గా ప్రసిద్ధి పొందింది నేడు. టెలివిజన్‌లో మిస్టర్‌ బీన్‌ సృష్టించే హాస్యం చూసి కడుపుబ్బ నవ్వకుండా ఉండలేం. బీన్‌ నటనా చిత్రాలేగాక, యానిమేషన్‌ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి.)
సాహితీ రూపకాల్లో హాస్యాన్ని సృష్టించడం వేరు. ప్రదర్శనా కళారూపాల్లో హాస్యాన్ని సృష్టించడం వేరు. గురజాడవారి 'కన్యాశుల్కం' నాటకం తొలుత సాహితీ రూపకమే! అనంతరంగా ప్రదర్శనాయోగ్యంగా మారి, వారి వారి పాత్రోచిత అభినయ పద్ధతుల్లో హాస్యాన్ని రంగరించి గుమ్మరించడంతో ప్రేక్షకులకు అది- అటు పండితులకు, ఇటు పామరులకు రసరమ్యమైన ఆధునిక దృశ్యకావ్యంగా ఆవిష్క ృతమైంది. 'ఇందుకు గురజాడ సాధించిన నాటకశైలి అద్భుతం, అద్వితీయం.' అని పరిశోధకులు పేర్కొన్నారు.
కందుకూరి వీరేశలింగం పంతులు ప్రప్రథమంగా వ్యవహార భాషలో ప్రదర్శించిన తొలి తెలుగు నాటకం 'వ్యవహార ధర్మబోధిని'లో కూడా (ప్లీడర్‌ నాటకం) నాటక ఛాయలు కన్నా ప్రహసన ఛాయలే ఎక్కువ. అంతకుముందు ధార్వాడ వారు ప్రదర్శించిన నాటక లక్షణాలు గమనించిన పంతులు గారి శిష్యులు, వారి సహజ నటనా కౌశలాన్ని జోడించి, నాటక ప్రదర్శనను రక్తికట్టించారు. ఆ విధంగా హాస్యరసాన్ని కేవలం రచనతోనేగాక, నటనతో కూడా పండించారు.
సాహిత్యానికైనా, కళలకైనా జీవితమే ప్రమాణం. జీవితం నవరసభరితం. కళలూ నవరసభరితం, నాటకం సర్వకళల సమాహారం. నవరసాల్లో హాస్యరసం విలక్షణమైనది. ఆరోగ్యకరమైనది. 'నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని హాస్యబ్రహ్మ జంధ్యాల చెప్పినా, 'నవ్వుతూ బతకాలిరా, తమ్ముడూ! నవ్వుతూ చావాలిరా! చచ్చినాకా నవ్వలేవురా! ఎందరేడ్చినా తిరిగిరావురా' అని ఆరుద్ర తెలిపినా ఈ కోవలేనిదే. 'సంతోషమే సగం బలం' అన్నారు పెద్దలు. ప్రస్తుతం ఉన్న యాంత్రిక వ్యాపార ప్రపంచంలో నానాటికి ఎక్కువ అవుతున్న మానసిక వత్తిడిని తగ్గించుకునేందుకు, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు నవ్వుల సంఘాలు (లాఫింగ్‌ క్లబ్‌లు) ఏర్పడుతున్నాయి. ఆనందపు ఆదివారాలు (హ్యాపీ సండేస్‌) వస్తున్నాయి. తత్సంబంధిత కాలక్షేప కదంబ కార్యక్రమాలు కొందరు కళాకారులు నిర్వహిస్తున్నారు.
పూర్వం రాజాస్థానాల్లో హాస్యం కోసమే విదూషకుడి పాత్ర ఉండేది. ఇటీవల ఒక పాఠశాలలో బాలలు ప్రదర్శించిన అక్బర్‌- బీర్బల్‌ నాటిక చూశాను. ప్రపంచంలోకెల్లా కష్టమైన పని ఏమిటి? అని అక్బర్‌ బీర్బల్‌ను ప్రశ్నిస్తాడు. 'ఇతరుల సంగతేమోగాని, నాకు మాత్రం నా పిల్లవాడిని సముదాయించడం' అని వినమ్రంగా చెప్తాడు బీర్బల్‌.
'అంతకష్టమా? ఏది నీ పిల్లవాడిని రప్పించు.' అని అక్బర్‌ ఆజ్ఞాపిస్తాడు. పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తూ వస్తాడు. అప్పుడు అటుగా పిల్లి వెళ్తుంది. 'నాకు ఆ పిల్లి కావాలి' అంటూ మారాం చేస్తాడు. సరే అని భటులను పంపి, ఆ పిల్లిని పట్టుకు రమ్మని పిల్లాడికి ఇస్తాడు అక్బరు. అప్పుడే ఒక సైనికుడు గుర్రంపై సభకు వస్తాడు. 'నాకు ఆ గుర్రం కావాలి' అని అడుగుతాడు పిల్లాడు.
సరే! అని ఆ గుర్రం ఇప్పిస్తాడు అక్బర్‌. కొంతసేపటికి ఓ సామంతరాజు ఏనుగుపై వస్తాడు. ఆ ఏనుగు కావాలి అంటే, అదీ ఇప్పిస్తాడు. మరికొంతసేపటికి ఓ పురోహితుడు ఓ బంగారు చెంబుతో ప్రవేశిస్తాడు. ఆ చెంబు కావాలి' అంటే అదీ ఇప్పిస్తాడు అక్బర్‌. ఇక చివరికి ఆ పిల్లవాడు ఆ పిల్లిని, గుర్రాన్ని, ఏనుగునీ ఈ చెంబులో పెట్టండి' అంటూ మారాం చేస్తాడు. అప్పుడు అక్బర్‌ చూసిన చూపుల్లో, బీర్బల్‌ భాషలో, సభికుల చూపుల్లో నుంచి నవ్వులు విరబూస్తాయి. ఎంత హాస్య! ఎంత చమత్కారం! పిల్లల ఊహకు, మారానికి తర్కం ఉండదనే అంశం హాస్యస్పోరకంగా బోధపడుతుంది. జీవితంలో సంభవించే ఇలాంటి ఘటనలకు తెనాలి రామకృష్ణకథలు, పరమానందయ్య శిష్యుల కథలు పెట్టింది పేరు.
ఏ సాహిత్యం చదివినా, ఏ కళారూపం తిలకించినా అది ఆరోగ్యకరంగా ఉంటూ మనిషిని వికాసం వైపు, విజ్ఞానం వైపు, సంస్కారం వైపు నడిపించాలి. అంతేతప్ప జీవితాన్ని హేళన చేసేలా, అగౌరవపరిచేలా ఉండకూడదు. అందునా ఇతరులకు హక్కులను భంగం పరిచేలా, కించపరిచేలా అస్సలు ఉండకూడదు. వీటినే మనం కళావిలువలు అంటాం. సామాజిక రుగ్మతలను ఎండగట్టడం వేరు. వ్యక్తుల వైకల్యాలను హేళన చేయడం వేరు. సామాజిక స్థితిని, శరీరాకృతిని చూసి హేళన చేయడం వేరు. ఇది అసఖ్యత తప్ప సఖ్యత కాదు.
కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్‌ ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌కు కొంచెం నత్తి ఉంది. ఓసారి తమిళనాడులో ఓ మిమిక్రి కళాకారుడు దానిని ప్రదర్శించి అగౌరవపరిచేలా వ్యాఖ్యానించాడు. ఓ జర్నలిస్టు ఈ విషయాన్ని నంబూద్రిపాద్‌ దృష్టికి తేగా- 'దిసీజ్‌ మై ఫిజికల్‌ వీక్‌నెస్‌.. దటీజ్‌ హిజ్‌ మెంటల్‌ వీక్‌నెస్‌' అని బదులిచ్చారు.
కళాకారులకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఇది గుర్తెరగకపోతే మానసిక బలహీనతకు లోనవుతారు. 'సృజనాత్మకత' అంటూ ఎన్ని వెకిలిచేష్టలు చేయడానికైనా సిద్ధమవుతారు. అదే గొప్ప అనుకునే భ్రమల్లో ఉంటారు.
అశ్లీల చిత్రాలు ఎందుకు తీస్తున్నారు? ద్వంద్వార్థాల మాటలు ఎందుకు చొప్పిస్తున్నారు? అసభ్యతకు ఎందుకంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తే- 'ప్రేక్షకులు చూస్తున్నారు కనుక మేం తీస్తున్నాం' అని చాలా తేలికగా బదులిస్తున్నారు. ఇంకొందరైతే అదే తమ సృజనాత్మకత అని భ్రమపడుతున్నారు. తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారానికి పోతుంటారు. కానీ, సమాజం వారికి కళ్లెం వేస్తూనే ఉంటుంది. నిజం చెప్పుకోవాలంటే సమాజానికి ఆ సంస్కారం నేర్పేది కూడా సత్కళాకృతులే!
కొసమెరుపు ఏమంటే... ఇటీవల ఓ టీవీ షో కళాకారుడు 'మేం మంచి ఆలోచనతోనే కళారూపాలు సృష్టిస్తున్నాం. చెడ్డగా ఆలోచించే ప్రేక్షకులకే అది చెడుగా కన్పిస్తుంది' అని బుకాయిస్తున్నాడు. ప్రేక్షకులు అంత తెలివితక్కువ స్థాయిలో ఉన్నారా? తమరు శుద్ధం - తడికకు బెజ్జం అంటే ఇదే కదా!

- శైలి
99597 45723

22, నవంబర్ 2017, బుధవారం

సృజనాత్మకతపై చిందులా?

 మన కళలు ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్నీ పంచుతాయి. చరిత్రను తెలియజేస్తూ చైతన్యాన్ని కలిగిస్తాయి. అందులో సినిమా ఒక బలమైన, ప్రభావవంతమైన ప్రక్రియ. దానిని ప్రజలకు వినోదం ఇవ్వడంతోపాటు కొంత విజ్ఞత, వివేచన, ఆలోచన ఇచ్చే సాధనంగా మార్చగలిగితే సమాజానికి మేలు. కానీ, సినిమా ద్వారా అలాంటి ప్రయత్నం జరగటమే తక్కువ. అక్కడక్కడ అప్పుడప్పుడు ఎవరో ఒకరు అలాంటి ప్రయత్నం చేసినా- అభ్యంతరాలూ, ఆటంకాలూ నిత్యకృత్యమవుతున్నాయి. దేశంలో నేడు భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఉన్మాదశక్తులు పెట్రేగిపోతున్నాయి. గతంలో సఫ్దర్‌ హష్మీని బలితీసుకుంది ఈ ఉన్మాదులే. మొన్న 'మెర్సెల్‌'.. నేడు 'పద్మావతి' పై రచ్చకెక్కిందీ ఆ మూకలే! నటుల తలలపై కోట్ల రూపాయల నజరానాలు ప్రకటించటం వారి ఉన్మాద ఉన్మత్త స్థాయి ఏ శిఖరాగ్రానికి చేరిందో చెప్పటానికి ఒక సూచిక.
ఒకప్పుడు సినిమాలు ప్రజల సమస్యలను.. వాటికి పరిష్కారాలను ప్రతిబింబించేవి. 'మా భూమి'; 'మనుషులు మారాలి'; 'దేవుడు చేసిన మనుషులు' ఇలా జనచైతన్యం కలిగించిన సినిమాలు చాలానే వచ్చాయి. 'పండింటి కాపురం'; 'ఉమ్మడి కుటుంబం'; 'గుండమ్మ కథ'; 'ఇల్లరికం'; వంటి కుటుంబ సంబంధ చిత్రాలూ వచ్చాయి. దురాచారాలను దునుమాడే చిత్రాలూ అనేకం వచ్చాయి. 'వెలుగునీడలు' వంటి సినిమాలు సమాజ మార్పు కావాలనే సందేశాన్నీ ఇచ్చాయి. తరువాత కళ కళ కోసమే, కేవలం వినోదం కోసమే అన్న ధోరణి పెరిగింది. ఇప్పుడు సినిమా కేవలం వ్యాపారం కోసమే అన్న ఒరవడి సాగుతోంది. ఎవరైనా సినిమాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించే అది తమకు వ్యతిరేకమని అధికార పక్షాలు శివాలెత్తడం, కొన్ని వర్గాలను రెచ్చగొట్టటం ఇటీవల పెరిగింది. 'మెర్సెల్‌' సినిమాపై జరిగిన రాద్ధాంతం ఈ వరుసలోదే! ఇప్పుడు ఈ కోవలోకే పద్మావతి చేరింది.
వ్యవస్థలను లెక్క చేయని మౌఢ్యం
మన సినిమాలూ, డాక్యుమెంటరీలూ ఆమోదయోగ్యమా? కాదా? అని తేల్చడానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఉంది. దాని కత్తిరింపులపైనా అనేక విమర్శలు ఉన్న సంగతి వేరే విమర్శ. కానీ, అసలు సృజనకే ఎసరు పెట్టే శక్తులు ఇప్పుడు అలాంటి వ్యవస్థలను కూడా లెక్క చేయకుండా తామే సెన్సారింగ్‌కు పూనుకుంటున్నాయి. సినిమాలో కథ ఎలా ఉండాలో.. సంభాషణలు ఎలా సాగాలో.. పాటల్లో ఏం పదాలుండాలో.. ఆఖరుకు సినిమా రివ్యూలు ఎవరు రాయాలో.. అన్నీ ఈ మూకలే నిర్దేశిస్తున్నాయి. పైగా అలా చేయకపోతే, చంపుతామంటూ తెగబడుతున్నాయి. ప్రస్తుతం 'పద్మావతి' చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారినే పడింది. అలాగే గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైన న్యూడ్‌ (మరాఠీ), ఎస్‌.దుర్గ (మలయాళం) సినిమాల ప్రదర్శనను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిలిపివేసింది. ఎందుకో కనీసం ఏకవాక్య వివరణనైనా ఇవ్వలేదు. ఈ రెండు సినిమాలు సెన్సార్‌ సర్టిఫికేట్లతో విడుదలైనవే. చూడబోతే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సెన్సార్‌ సర్టిఫికెట్లన్నా, తామే ఏర్పాటు చేసిన జ్యూరీ ఎంపిక అన్నా లెక్క లేనట్టుంది.
దాడులు గర్హనీయం
సినిమాపై వ్యతిరేక అభిప్రాయాలు రాయడం, చెప్పడం, ప్రజావ్యతిరేకంగా ఉంటే వద్దని నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో సమ్మతమే. కానీ, ఆ సినిమా సెన్సార్‌కు వెళ్లి, బయటకు వచ్చేలోపే విధ్వంసం చేయడం దారుణం. అంతకన్నా సహించలేనిది భౌతికదాడులకు పాల్పడతాననడం. వారి తలలపై కోట్ల రూపాయల్లో నజరానాలు ప్రకటించడం.. ఇవన్నీ ఉన్మాద చర్యలే. సృజనాత్మక దర్శకుడిగా పేరొందిన సంజరులీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి' సినిమా. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన ఈ సినిమా సెట్‌లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ఈ ఉన్మాద మూకలే ధ్వంసం చేశాయి. దర్శకుడి పైనా దౌర్జన్యానికి తెగబడ్డాయి. షూటింగ్‌ను మహారాష్ట్ర్టలోని కొల్హాపూర్‌కు మార్చినా అక్కడా సెట్‌కు నిప్పు పెట్టాయి.
వివరణ ఇచ్చినా..
షూటింగ్‌ ప్రారంభించడానికి చాలాముందే గత భన్సాలీ తన సినిమా ఇతివృత్తంపై వచ్చిన కథనాల తర్వాత ఏర్పడ్డ అపోహల్ని తొలగించే ప్రయత్నం చేశారు. 'పద్మావతి పాత్రను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ముఖ్యంగా అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రకూ, ఆ పాత్రకూ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ ఉండబోవు' అని వివరించాడు. చిత్రం పేరు సైతం ముందనుకున్నట్టు 'రాణి పద్మిని' అని కాక 'పద్మావతి' అని మార్చారు. కానీ, బెదిరింపులూ, హెచ్చరికలూ ఆగలేదు. కథానాయిక దీపికా పదుకొనే ముక్కు కోస్తామని ఒకరు... భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే రూ. 5 కోట్ల అని ఒకరు.. రూ.10 కోట్లు అని మరొకరు ప్రకటిస్తున్నారు. ఇలాంటి సినిమా ప్రదర్శించే థియేటర్లను స్వచ్ఛభారత్‌లో భాగంగా తగులబెడతామని ఇంకొందరు అంటున్నారు. వచ్చేనెల 1న చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
కథ అంటే కాల్పనికతే!
కథ అంటే కాల్పనికత తప్పనిసరి. చరిత్రలో ఒక ఉదంతాన్ని తీసుకుని సినిమాగా రూపొందే క్రమంలో ఫిక్షన్‌ ఎంతోకొంత జోడవుతుంది. దాని మీద అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. కానీ, ముందే నానా రభసా చేయడం అప్రజాస్వామికం.కథలోకి వెళితే.. బంగాలోని బీర్‌భూం జిల్లాలో 1250లో పుట్టి, 1316లో మరణించాడు ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ. ఆమర రాజస్థాన్‌లోని చిత్తోర్‌ రాజ్యంపై దండెత్తడం, దాని పాలకుడు రాణా రతన్‌సింగ్‌ ఓటమి పాలవడం, రాజ్యం ఖిల్జీ వశం కావడం చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రకు జీవం పోసి.. దానిచుట్టూ కాల్పనికతను అల్లి ఒక కావ్యంగా తీర్చిదిద్దిందీ మాలిక్‌ మహమ్మద్‌ జయాసి అనే ఒక ముస్లిం సూఫీ కవి. 1540లో... అంటే యుద్ధం జరిగిన 224 ఏళ్లకు ఆయన ఈ కావ్య రచనకు ఉపక్రమించాడు. మొదటిసారిగా అందులో రాణా రతన్‌సింగ్‌ భార్య పద్మావతి ప్రస్తావన వచ్చింది. అంతకుముందున్న చరిత్రలో ఎక్కడా పద్మావతికి సంబంధించిన ఆధారాలు లేవు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆస్థానకవి అమీర్‌ఖుస్రో చిత్తోర్‌ కోట ముట్టడి గురించిన రాసిన పత్రాల్లో ఎక్కడా పద్మావతి గురించిన ప్రస్తావనే లేదు. రాజస్థాన్‌ నుంచి బంగా వరకూ దాదాపు ఐదొందల ఏళ్ల వ్యవధిలో మాలిక్‌ కావ్యానికి ఉర్దూ, పర్షియన్‌ భాషల్లో అనేక అనువాదాలొచ్చాయి. కవుల సృజన, ఊహ మేరకు ఎన్నో మార్పులూ చోటుచేసుకున్నాయి. ఇది కొత్త కాదు. రామాయణ, మహాభారతాల్లోనూ కొన్ని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ఎలా మార్పు చెందాయో వివరిస్తూ ఆరుద్ర 'రాముడికి సీత ఏమవుతుంది?' పేరుతో చాన్నాళ్లక్రితమే ఒక పుస్తకం రాశారు.
స్వేచ్ఛా భంగమే!
ఇప్పుడు 'పద్మావతి' సినిమాపై నిప్పులు చెరుగుతున్న పరివార్‌ శక్తులు, రాజ్‌పుట్‌ కులానికి చెందిన కర్ణిసేన సభ్యులు పద్మావతి సృష్టికర్త ఒక ముస్లింకవి సూఫీ అన్న సంగతి గుర్తించలేదు. రాజస్థాన్‌ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు చేసిన బాధ్యతలేని ప్రకటనలూ సరైనవి కాదు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ సైతం మాట్లాడిన తీరు ప్రమాదకరం. తాజాగా బిజెపి సీనియర్‌ నేత సూరజ్‌ పాల్‌ స్వచ్ఛభారత్‌లో భాగం ఇలాంటి సినిమాలు ప్రదర్శించే థియేటర్లను యువత తగులబెడతారంటూ ఉన్మాదంతో ఊగిపోతున్నారు.
సుప్రీం విలువైన వ్యాఖ్య
'పద్మావతి'పై జోక్యం చేసుకోనని, అది సెన్సార్‌బోర్డు పరిధిలోనే ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వేరే కేసులో సుప్రీం చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై నిర్మించిన 'యాన్‌ ఇన్‌సిగ్నిఫికెంట్‌ మాన్‌' పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ విడుదల కాకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ.. 'ఏ రకమైన సృజనాత్మక వ్యక్తీకరణలకైనా అడ్డుతగిలే ప్రయత్నం చేయరాదు' అని సుప్రీం వ్యాఖ్యానించింది. 'భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనది. దానిలో ఆషామాషీ జోక్యం తగదు' అని స్పష్టం చేసింది. 'చట్టపరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో తన భావాలను వ్యక్తపరచవచ్చు' అని తెలిపింది. అయినా అరాచకశక్తుల వీరంగం ఆగటంలేదు. బాధ్యతాయుత స్థానాల్లోని నేతలకు జ్ఞానోదయం కలగటం లేదు. ఇప్పుడు 'పద్మావతి'పై కేంద్రం స్పందన గురించే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.