23, నవంబర్ 2017, గురువారం

హాస్యం సృష్టించడం అంత హాస్యం కాదని కీ.శే భమిడిపాటి వారు ఏనాడో సెలవిచ్చారు. పేరుకు నరసింహాలైనా తమ రచనాస్రవంతులతో ఆంధ్రదేశానికి హాస్యామృతాన్ని పంచి హాస్య రచయతల త్రయంగా పేరుగాంచారు ముగ్గురు మహానీయులు. వారు: 1. పానుగంటి లక్ష్మీనరసింహాం (సాక్షి వ్యాసాలు) 2. చిలకమర్తి లక్ష్మీనరసింహం (గణపతి నవల) 3. మొక్కపాటి నరసింహం (బారిస్టరు పార్వతీశం- ఈ పాత్ర ఆంధ్రా బీన్‌గా ప్రసిద్ధి పొందింది నేడు. టెలివిజన్‌లో మిస్టర్‌ బీన్‌ సృష్టించే హాస్యం చూసి కడుపుబ్బ నవ్వకుండా ఉండలేం. బీన్‌ నటనా చిత్రాలేగాక, యానిమేషన్‌ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి.)
సాహితీ రూపకాల్లో హాస్యాన్ని సృష్టించడం వేరు. ప్రదర్శనా కళారూపాల్లో హాస్యాన్ని సృష్టించడం వేరు. గురజాడవారి 'కన్యాశుల్కం' నాటకం తొలుత సాహితీ రూపకమే! అనంతరంగా ప్రదర్శనాయోగ్యంగా మారి, వారి వారి పాత్రోచిత అభినయ పద్ధతుల్లో హాస్యాన్ని రంగరించి గుమ్మరించడంతో ప్రేక్షకులకు అది- అటు పండితులకు, ఇటు పామరులకు రసరమ్యమైన ఆధునిక దృశ్యకావ్యంగా ఆవిష్క ృతమైంది. 'ఇందుకు గురజాడ సాధించిన నాటకశైలి అద్భుతం, అద్వితీయం.' అని పరిశోధకులు పేర్కొన్నారు.
కందుకూరి వీరేశలింగం పంతులు ప్రప్రథమంగా వ్యవహార భాషలో ప్రదర్శించిన తొలి తెలుగు నాటకం 'వ్యవహార ధర్మబోధిని'లో కూడా (ప్లీడర్‌ నాటకం) నాటక ఛాయలు కన్నా ప్రహసన ఛాయలే ఎక్కువ. అంతకుముందు ధార్వాడ వారు ప్రదర్శించిన నాటక లక్షణాలు గమనించిన పంతులు గారి శిష్యులు, వారి సహజ నటనా కౌశలాన్ని జోడించి, నాటక ప్రదర్శనను రక్తికట్టించారు. ఆ విధంగా హాస్యరసాన్ని కేవలం రచనతోనేగాక, నటనతో కూడా పండించారు.
సాహిత్యానికైనా, కళలకైనా జీవితమే ప్రమాణం. జీవితం నవరసభరితం. కళలూ నవరసభరితం, నాటకం సర్వకళల సమాహారం. నవరసాల్లో హాస్యరసం విలక్షణమైనది. ఆరోగ్యకరమైనది. 'నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని హాస్యబ్రహ్మ జంధ్యాల చెప్పినా, 'నవ్వుతూ బతకాలిరా, తమ్ముడూ! నవ్వుతూ చావాలిరా! చచ్చినాకా నవ్వలేవురా! ఎందరేడ్చినా తిరిగిరావురా' అని ఆరుద్ర తెలిపినా ఈ కోవలేనిదే. 'సంతోషమే సగం బలం' అన్నారు పెద్దలు. ప్రస్తుతం ఉన్న యాంత్రిక వ్యాపార ప్రపంచంలో నానాటికి ఎక్కువ అవుతున్న మానసిక వత్తిడిని తగ్గించుకునేందుకు, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు నవ్వుల సంఘాలు (లాఫింగ్‌ క్లబ్‌లు) ఏర్పడుతున్నాయి. ఆనందపు ఆదివారాలు (హ్యాపీ సండేస్‌) వస్తున్నాయి. తత్సంబంధిత కాలక్షేప కదంబ కార్యక్రమాలు కొందరు కళాకారులు నిర్వహిస్తున్నారు.
పూర్వం రాజాస్థానాల్లో హాస్యం కోసమే విదూషకుడి పాత్ర ఉండేది. ఇటీవల ఒక పాఠశాలలో బాలలు ప్రదర్శించిన అక్బర్‌- బీర్బల్‌ నాటిక చూశాను. ప్రపంచంలోకెల్లా కష్టమైన పని ఏమిటి? అని అక్బర్‌ బీర్బల్‌ను ప్రశ్నిస్తాడు. 'ఇతరుల సంగతేమోగాని, నాకు మాత్రం నా పిల్లవాడిని సముదాయించడం' అని వినమ్రంగా చెప్తాడు బీర్బల్‌.
'అంతకష్టమా? ఏది నీ పిల్లవాడిని రప్పించు.' అని అక్బర్‌ ఆజ్ఞాపిస్తాడు. పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తూ వస్తాడు. అప్పుడు అటుగా పిల్లి వెళ్తుంది. 'నాకు ఆ పిల్లి కావాలి' అంటూ మారాం చేస్తాడు. సరే అని భటులను పంపి, ఆ పిల్లిని పట్టుకు రమ్మని పిల్లాడికి ఇస్తాడు అక్బరు. అప్పుడే ఒక సైనికుడు గుర్రంపై సభకు వస్తాడు. 'నాకు ఆ గుర్రం కావాలి' అని అడుగుతాడు పిల్లాడు.
సరే! అని ఆ గుర్రం ఇప్పిస్తాడు అక్బర్‌. కొంతసేపటికి ఓ సామంతరాజు ఏనుగుపై వస్తాడు. ఆ ఏనుగు కావాలి అంటే, అదీ ఇప్పిస్తాడు. మరికొంతసేపటికి ఓ పురోహితుడు ఓ బంగారు చెంబుతో ప్రవేశిస్తాడు. ఆ చెంబు కావాలి' అంటే అదీ ఇప్పిస్తాడు అక్బర్‌. ఇక చివరికి ఆ పిల్లవాడు ఆ పిల్లిని, గుర్రాన్ని, ఏనుగునీ ఈ చెంబులో పెట్టండి' అంటూ మారాం చేస్తాడు. అప్పుడు అక్బర్‌ చూసిన చూపుల్లో, బీర్బల్‌ భాషలో, సభికుల చూపుల్లో నుంచి నవ్వులు విరబూస్తాయి. ఎంత హాస్య! ఎంత చమత్కారం! పిల్లల ఊహకు, మారానికి తర్కం ఉండదనే అంశం హాస్యస్పోరకంగా బోధపడుతుంది. జీవితంలో సంభవించే ఇలాంటి ఘటనలకు తెనాలి రామకృష్ణకథలు, పరమానందయ్య శిష్యుల కథలు పెట్టింది పేరు.
ఏ సాహిత్యం చదివినా, ఏ కళారూపం తిలకించినా అది ఆరోగ్యకరంగా ఉంటూ మనిషిని వికాసం వైపు, విజ్ఞానం వైపు, సంస్కారం వైపు నడిపించాలి. అంతేతప్ప జీవితాన్ని హేళన చేసేలా, అగౌరవపరిచేలా ఉండకూడదు. అందునా ఇతరులకు హక్కులను భంగం పరిచేలా, కించపరిచేలా అస్సలు ఉండకూడదు. వీటినే మనం కళావిలువలు అంటాం. సామాజిక రుగ్మతలను ఎండగట్టడం వేరు. వ్యక్తుల వైకల్యాలను హేళన చేయడం వేరు. సామాజిక స్థితిని, శరీరాకృతిని చూసి హేళన చేయడం వేరు. ఇది అసఖ్యత తప్ప సఖ్యత కాదు.
కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్‌ ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌కు కొంచెం నత్తి ఉంది. ఓసారి తమిళనాడులో ఓ మిమిక్రి కళాకారుడు దానిని ప్రదర్శించి అగౌరవపరిచేలా వ్యాఖ్యానించాడు. ఓ జర్నలిస్టు ఈ విషయాన్ని నంబూద్రిపాద్‌ దృష్టికి తేగా- 'దిసీజ్‌ మై ఫిజికల్‌ వీక్‌నెస్‌.. దటీజ్‌ హిజ్‌ మెంటల్‌ వీక్‌నెస్‌' అని బదులిచ్చారు.
కళాకారులకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఇది గుర్తెరగకపోతే మానసిక బలహీనతకు లోనవుతారు. 'సృజనాత్మకత' అంటూ ఎన్ని వెకిలిచేష్టలు చేయడానికైనా సిద్ధమవుతారు. అదే గొప్ప అనుకునే భ్రమల్లో ఉంటారు.
అశ్లీల చిత్రాలు ఎందుకు తీస్తున్నారు? ద్వంద్వార్థాల మాటలు ఎందుకు చొప్పిస్తున్నారు? అసభ్యతకు ఎందుకంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తే- 'ప్రేక్షకులు చూస్తున్నారు కనుక మేం తీస్తున్నాం' అని చాలా తేలికగా బదులిస్తున్నారు. ఇంకొందరైతే అదే తమ సృజనాత్మకత అని భ్రమపడుతున్నారు. తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారానికి పోతుంటారు. కానీ, సమాజం వారికి కళ్లెం వేస్తూనే ఉంటుంది. నిజం చెప్పుకోవాలంటే సమాజానికి ఆ సంస్కారం నేర్పేది కూడా సత్కళాకృతులే!
కొసమెరుపు ఏమంటే... ఇటీవల ఓ టీవీ షో కళాకారుడు 'మేం మంచి ఆలోచనతోనే కళారూపాలు సృష్టిస్తున్నాం. చెడ్డగా ఆలోచించే ప్రేక్షకులకే అది చెడుగా కన్పిస్తుంది' అని బుకాయిస్తున్నాడు. ప్రేక్షకులు అంత తెలివితక్కువ స్థాయిలో ఉన్నారా? తమరు శుద్ధం - తడికకు బెజ్జం అంటే ఇదే కదా!

- శైలి
99597 45723

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి