5, అక్టోబర్ 2015, సోమవారం

##ఆధునిక కవిత్వం- రజకుల స్థితిగతులు##

అనాదిగా కులం, వృత్తి పరస్పరాశ్రితాలుగా కొనసాగాయి. విద్య, ఉద్యోగాలు, వ్యాపారకారణాల వల్ల ఆ బంధం బిగువు సడలింది. ప్రతి కులానికి ఒక సామాజిక ప్రతిపత్తి ఉంది. ప్రతివృత్తి సామాజిక అవసరంగా ఉంది. పులి కొండ సుబ్బాచారి కుల పురాణాలులో సామాజిక నిర్మితిలో రజక కులం, సామాజిక ప్రతిపత్తి, స్థానాన్ని బట్టి శ్రేణీకరణంలో ఆరవస్తరంలో సూచించారు. పద్మసాలె, దేవాంగ, యాదవ, కమ్మరి, కుమ్మరి చాకలి కులాలను ప్రభుత్వం బి.సి కమీషన్‌ సామాజికంగా వెనకబడిన కులంగా గుర్తించారు. స్థానాన్ని, సామాజిక అంతస్తును  ఉన్నతీకరించుకునే క్రమంలో కుల నామాలు సంస్కృతీకరించుకోబడినాయి. చాకలి-రజకులు, మంగలి- క్షురక-నాయిబ్రాహ్మణ, కంసాలి-విశ్వకర్మ, జాలరి - మత్స్యకార మొదలైనవి వృత్తి నైపుణ్యం వృత్తికారుల్లో పుష్కలం, కులం వంశపారంపర్యం వృత్తిఐచ్ఛికం, కులం వృత్తి అవినాభావ సంబంధం చాలా కాలంగా ఉండటం వల్ల నైపుణ్యం అలవడుతుంది. పుట్టినప్పటి నుంచి వృత్తి పనులను గమనిస్తూ, అనుభవిస్తూ ఉండడం వల్ల అలవోకగా అబ్బుతుంది. వివిధ రకాల వృత్తుల వాళ్లు అల్లిబిల్లిగా అల్లుకొన్న అనుబంధం, పరస్పర సహకారం, సమైక్యత పల్లెల్లో ముప్పరికొని ఉండేది. ప్రపంచీకరణ నేపథ్యంలో కులవృత్తులకు ఆదరణ సన్నగిల్లడం, ఇతర వ్యాపకాలపై మొగ్గు చూపడం తమ సామాజిక ప్రతిపత్తిని పరామర్శించుకునే చైతన్యం రావటం వల్ల కుల వృత్తిని పారంపర్యంగా చేపట్టడం తక్కువవుతోంది.
ప్రతి వృత్తిలో ఆధునికీకరణ యాంత్రీకరణ చోటుచేసుకుంది. దీనివల్ల వృత్తి దార్లకు కడుపునిండని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి స్థితి రజక, కుమ్మరి, పద్మసాలె, కమ్మరి మొదలైన కులాల్లో నెలకొనింది. ఆధునిక సాహిత్యం స్త్రీలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు సమస్యల వైపు దృష్టి సారించడంతో వారి స్థితిగతులు ఇతివృత్తాలయ్యాయి. ఆయా కులాల నుండి రచయితలు కలం సాగించడం వల్ల అనుభూతి అనుభవసారం సాహిత్యంలో ప్రతిఫలించింది. ఈ కోవలో ఆధునిక కవిత్వం రజకుల స్థితిగతులను విమర్శకు పెట్టింది. వృత్తిపని విధానం, వృత్తి పదజాలాన్ని అక్షరీకరించింది. బట్టలకంటిన మురికిని, మైలను చౌడునీళ్ళల్లో ఉడకబెట్టి, ఉతుకుడు బండకేసి బాది మిలమిలలాడించేది రజక వృత్తి. ప్రతి రజక కుటుంబానికి మిరాశి కుటుంబాలుంటాయి. వారికి తప్ప ఇతరులకు            ఉతకరు. నిర్ణీత మేర ఉంటుంది. అదే వారి జీవనాధారం. నేడు లాండ్రీలు, తోపుడు బండ్లపై ఇస్త్రీలు, డ్రై క్లీనింగ్‌ షాపులు వెలిశాయి. వారు నిర్ణయించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. శుభ్రపరచడానికి రకరకాల సబ్బులు డిటర్జంట్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
రజకవృత్తిలోని సాదకబాదకాలను కత్తి పద్మారావు 'చాకిరివీరుడు'లో వర్ణించారు. రజకులు మామూలు మురికి బట్టలతో పాటు మలమూత్రాల బట్టలను ఉతికి అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడంటారు.
మల మూత్రాలతో/మకిల బట్టిన బట్టలుతికి/అమ్మతనానికి / ఆయువు పోసినోడు.
చౌడులో ఉడికించి, ఉతికిన బట్టలు సువాసన కలిగి ఉంటాయని, దండేలపై ఆరేసిన రంగురంగుల పట్టుచీరలు రంగురంగుల పట్టుచీరలు హరివిల్లును తలపించేవని ననుమాసస్వామి 'నీలిబాల్యం'లో వ్యక్తీకరించారు.
సౌడులో ఉడికించి, ఉతికిన బట్టలు ఆరేస్తున్నప్పుడు - పరిసరాలన్నీ పరిమళభరితమయ్యేవి-జిట్టీదులపై ఆరేసిన పట్టుచీరలు రంగుల హరివిల్లులు -
చౌడుమట్టి నీళ్ళలో గుడ్డలు ఉడకేసి, మురికిని వదలగొట్టే రజకున్ని రసాయన శాస్త్రజ్ఞునితో పోల్చారు. చౌడుమట్టిని / సున్నపుగడ్డ/కలిపిన కమ్ముతో / గుడ్డలుడకేసి/మురికిని పిండిన / రసాయన శాస్త్రజ్ఞుడు
'చాకిరి వీరుడు'
మూడ్రోజులకో, వారానికో ఇంటింటికెళ్ళి మురికి బట్టలు సేకరించి, ఉదయాన్నే నీటివనరుల దగ్గర చాకిరేవు పెట్టి పిల్ల జెల్లాతో కూడా పనిలో నిమగ్నమవుతారు. ఉతికి, ఆరబెట్టిన గుడ్డలు సాయంత్రానికి యాజమానుల ఇండ్లకు చేర్చుతారు. ఇంతగా కష్టపడినా బట్ట చిరిగిందనో, మురికిపోలేదనో, జేబులో డబ్బుపోయిందనో, చీవాట్లు తప్పవంటారు.
మట్టి మరక పోలేదని / నలిగి, చిరిగిపోయిందని / చీరమడతలోనో / చొక్కాజోబులోనో / ఉన్న సొమ్ము పోయిందని / చీవాట్లు చీదరింపులు - అదిరింపులు, బెదిరింపులు - 'చాకిరి వీరుడు'.
ఈ వృత్తి పని చేసినందుకు మిరాశీదార్లు నుంచి పంట పండినపుడు ఇచ్చే మేర కూడా చాలా తక్కువ. మీరాశీదార్లు సాయంత్రం అన్నం పెట్టడం ఆనవాయితీ. అదైనా ఉడుకు అన్నం కాకుండా పాసిన అన్నం పెడతారని, దాని వల్ల అనారోగ్యం కలుగుతుందని, చాకిరీలో ఒళ్ళుగుల్లయి పోతందంటున్నారు.
పాసిన కూటి కోసం / నిలువెల్ల చాకిరీ చేసి 
కృత్నఘ్నుల సేవలో / మగ్గి బుగ్గయి/ జీవన సంస్కతంతా / గుల్ల చేసుకున్నోడు - చాకిరీ వీరుడు
సమర్తయినా, పెండ్లయినా/పురుడైనా/ మొత్తం మురికిని పిండి/ఆరేస్తూ ఆగ్రజుడు/కూలికొలత లేనోడు - శ్రమకు తగిన ప్రతిఫలం కూడా ఆశించని రజకుని శ్రమతత్త్వాన్ని వ్యక్తీకరించారు కత్తి పద్మారావు.
చౌడుమట్టిలో మురికిని పోగొట్టే లక్షణాలను గుర్తించిన రజకుడు గాడిద పెంటతో డిటర్జంట్‌లను చేసే పరిజ్ఞానాన్ని పొందాడు. వివిధ చేతి  వృత్తుల నైపుణ్యాన్ని మలినమైన పనులను చేస్తున్న సహనాన్ని గుర్తించటం లేదని 'మాకూ ఒక భాష కావాలి'లో తుల్లి మల్లి విల్సన్‌ సుధాకర్‌
''గాడిద పేడతో/డిటర్జంట్లు చేసే రజకుల మేదస్సుని'' పొగిడారు.
పురిటిమైలబట్టల నుండి మకిల బట్టిన బట్టలు తీసుకెళ్ళి చాకిరేవు పెడతారు. సాధారణంగా చెరువులు నీటికుంటల దగ్గర చాకిబండలను ఏర్పరచుకొని ఉతుకుతారు. ఉన్నవారి బట్టలకైనా, లేని వారి బట్టలకైనా రేవు బండ ఒకటే. బట్టల రకాలను బట్టి వేరు చేసి ఉబ్బపెట్టి సౌడుమట్టి కలిపిన నీళ్లలో తడిపి, వడతిప్పి నీళ్లు పిండి, మడిచి బానలో సగానికి పైగా నీళ్లు పోసి, మడిచిన గుడ్డలు  పేర్చి ఉడకబెట్టి  ఉతుకుతారు.
'మా ఊరు మొలకెత్తింది' కవితలో ఒక అంచున చాకిరేవు ఊరందరికి అదొకటే / మా చాకలి రావమ్మకు /   ఉన్నవారి పట్టుకోక/లేనివారి గోటురైక / అన్నింటికీ రేవొకటే బండొకటే / అని వృత్తి పనిలో సమత్వాన్ని తెలిపారు హనుమారెడ్డి.
కాలం మారింది. వానలు కరువయ్యాయి. చెరువులు, వాగు వంకలు ఎండిపోయాయి. ఎండిన చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకుపోతున్నాయి. దాంతో చాకలి వృత్తికి నెలవైన నీటివసతి కొరవడింది. వృత్తికి గండిపడింది. అందుకే గోరటివెంకన్న ''వాగులు వంకలు ఎండిపోయినయ్‌; చాకలి పొయ్యిలు కూలిపోయినవి'' అంటారు.
 ఉతకడానికి వేసే గుడ్డలు పలురకాలుగా ఉంటాయి. ఉతికిన తర్వాత అవన్ని జాగ్రత్తగా యజమానులకు చేర్చే బాధ్యత రజకునిదే. గుడ్డలు కలిసి పోయి ఒక ఇంటివి మరో ఇంటి వాళ్ళకు అందివ్వకుండా ఉండడానికి ఇంటికో గుర్తు వేసుకుంటారు. గుర్తును బట్టి వేరు చేసి, ఆయా ఇళ్ళ వారీగా చేరవేస్తారు. గుర్తులు వేయడానికి జీడిగింజలు వాడతారు. కాల్చిన జీడిగింజను సూదితో లేదా పిన్నుతో గుచ్చి ఆ రసంతో ఒక్కో ఇంటికి చుక్క, గీతలు లాంటివి వేసి, గుర్తు పెట్టుకుంటారు. ఒకసారి జీడిగింజ రసంతో గుర్తు వేస్తే గుడ్డ చిరిగి పోవాల్సిందే తప్ప గుర్తు చెరిగిపోదు.
కిర్రుచెప్పుల భాషలో శిఖామణి జీడిగింజతో వేసే చెరగని గుర్తులాగా జాతి వస్త్రంపై చాకలి సంతకం చేస్తున్నాను అంటున్నారు.
ఇప్పుడు అక్షరాన్ని / కాల్చిన జీడిగింజను చేసి/జాతి వస్త్రం మీద / నా చాకలి సంతకం చేస్తున్నాను.
చాకలికి బట్టల మూటలు మోయడంలో అండగా నిలిచేది గాడిద అధిక బరువును గాడిద బరువు అనీ, అధిక శ్రమను గాడిద చాకిరీ అనడం జనుల వాడుక. ఉప్పు వ్యాపారస్తులు మూటలను గాడిద పై వేసి ఊరూరు తిరుగుతుంటారు. గాడిదలు సాకే స్తోమత లేని రజకుడు తన వీపు పైనే మూటలు వేసుకొని, చాకిరేవుకు తీసుకెళతారు. పసిపిల్లలు, కాటికి కాళ్ళు చాపిన వృద్ధులు మలమూత్రాలు గుడ్డల్లో పోతుంటారు. అవి కూడా రజకుడు మూట కట్టి వీపున వేసుకొని రేవుకు తీసుకెళ్లి చాకిరి చేస్తారు.
పురిటి పిల్లల్నుంచీ / కాటికి కాళ్లుజాపిన / ముసలోల్ల దాకా ఉచ్చా పీతి గుడ్డల్ని / వీపున మోసే గాడ్దెలం/ అని ఆవేదన చెందుతున్నారు. పి, దస్తగిరి 'మేసాకలోళ్లం' కవితలో
బట్టల మలినాన్ని పోగొట్టి ముత్యాల్లాగా మార్చడమే కాకుండా, యజమానుల ఇండ్లలో శుభ కార్యాల్లోను, గ్రామాల్లో జరిగే ఉత్సవాలు, జాతర్లలో రజకులకు నిర్ణీత ప్రమేయముంటుంది. దేవుని ఉరేగింపులో, బలిజంతువులను గుడికి తీసుకెళ్ళేటప్పుడు ముందు రజకుడు దివిటీ పట్టుకెళ్ళడం ఆనవాయితీ. కొన్ని ప్రాంతాలలో గ్రామదేవతలకు పూజారులుగా ఉన్నారు.
దేవరెద్దు ఉత్సవాల్లో ఎద్దు అడుగు కింద పెట్టకుండా మడుగు పరచడం, గ్రామదేవతల జాతర్లలో దుప్పట్లు పరచడం, దేవుని ఊరేగింపులో వాహనాలు మోయడం, పండుగలకు గుడిగుమ్మాల్లో తోరణాలు కట్టడం వంటి పనులు వీరివంతు.
దివిటీపట్టే టోడు / పల్లకి మోసేవాడు - 'చాకిరి వీరుడు'. మడేలు దుప్పట్లు మడువుతో గ్రామదేవతలు ఆనందించిరి - మా ఊరు మొలకెత్తింది.
ఏ పండుగొచ్చినా, పబ్బ మొచ్చినా / గుడిగుమ్మాల కాడ / శోభతో స్వాగతించే మామిడి తోర ణాలం  / ఉత్సవ ఊరేగింపులలో / రాములోరిని / భుజాలపై వీధివీధికి మోసే  హనుమంతులం - మేం సాకలోళ్లం  - పి.దస్తగిరి.
 మిరాశిదార్ల ఇళ్లలో పెళ్లి పేరంటాలకు రజకులు సేవలందించాలి. పూర్వం                     శుభకార్యాలు వీరిప్రమేయం లేకుండా జరిగేవి కావు. నిర్ణీత పనులు తప్పక చేయాల్సి ఉండేది. ఆడపిల్లలు సమర్త అయినప్పుడు మైల గుడ్డలు పిండడం, నలుగు రోజు పీటలకింద వస్త్రాలు పరచడం, వంటి పనులు చేయాలి. గ్రామాల్లో ఈ ఆచారాలు కొంత తగ్గుముఖం పట్టాయి. పట్టణాల్లో ఆచారాల పట్ల ఆసక్తి తగ్గింది. మారుమూల గ్రామాల్లో సంప్రదాయాల పట్ల పట్టింపులున్న కుటుంబాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. 
పెండ్లికి కబురు చెప్పేటోడు / ఇంటికి వెల్ల వేసేటోడు - చాకిరి వీరుడు
మా బతుకుల్లో వెలుగులేకున్నా / మీ పెళ్ళిళ్లకూ పేరంటాలకూ / చీకటిని తరిమి వెలుతురునిచ్చే దివిటీలం - 'మేం సాకలోళ్ళం'.
ఇంటి చాకలి కళ్యాణ వేదిక సిద్ధం చేశాడు. - మా ఊరు మొలకెత్తింది.
పల్లెల్లో వివిధ కులవృత్తుల  వాళ్ళు, పరస్పరాధారితంగా అక్క, బావ, మామ అనుకుంటూ సుహృద్భావవాతావరణంలో ప్రశాంత జీవనం గడిపేవారని, స్థాయి భేదాలు లేవనీ, ఉత్పత్తిలో శ్రమవిభాగ వ్యవస్థ అని, రైతులు వారిని చేరదీసి అభిమానించేవారని, రైతుకు అండగా అన్ని వృత్తుల వారు సహకరించే వారని మా ఊరు మొలకెత్తింది లో హనుమారెడ్డి పేర్కొన్నారు.
కుమ్మర్లు కమ్మర్లు / చాకళ్ళు మంగళ్ళు / అందరూ సహజీవనం చేసేవారు / ఎవరైతేనెం తేడాలు తక్కువ/మక్కువలు ఎక్కువ / ఎవరిపని వారిదే / శ్రమవిభాగ వ్యవస్థ అది / శాంతం - ప్రశాంతం / వేతల్లో కోతల్లో ఏకత్వం.
అయితే కోలపూడి ప్రసాద్‌  అగ్ర కులస్థుల మధ్య కుల వృత్తిదారుల జీవితం దుర్భరంగా ఉంటుందని వర్ణించారు. వందపులులు మధ్య మేకలా / వేయి మంది అగ్రకులస్థుల మధ్య ఒక చాకలిగా/ కుమ్మరిగా/మంగలిగా బతకడం ఎంత దుర్భరం.
 రజకులకు గుడ్డలుతికే కుటుంబాలు నిర్దేశితంగా వుంటాయి. మిరాశీదార్లు అంటారు. వారికి తప్ప ఇతరులకు ఉతకరు. రజక కుటుంబం భాగాలు పోతే మిరాశీ ఇళ్లు పంచుకుంటారు. మిరాశీదార్లు రజకుల శ్రమకు సంవత్సరానికి 'మేర' ఇస్తారు. సాధారణంగా రైతులైతే పంట పండిన తర్వాత నిర్ణీత ధాన్యం ఇస్తారు. కరువు కాటకాలతో, రైతు పంట కళ్ళచూడడమే గగనంగా మారింది. అలాంటప్పుడు నెలవారి గాని, గుడ్డకింత అని డబ్బు రూపంలో చెల్లిస్తారు. కుటుంబమంతా చాకిరీచేస్తే దక్కేది పరిమిత ప్రతిఫలమే నంటున్నారు కత్తి పద్మారావు చాకిరీ వీరుడులో.
సంవత్సరానికొకతూరి / తూమెడు గింజలు కొలిస్తే/కుటుంబానికంతా/నిస్వార్ధంగా/ చాకిరీ చేసే / అవిశ్రాంత శ్రామికుడు.
ఇంటిపనితోపాటు వృత్తిపనిలో రజక మహిళ భాగస్వామ్యముంది. రజక స్త్రీలు సాయంత్రం పూట అన్నం పెట్టించుకురావాడానికో, గుడ్డలు తెచ్చుకోడానికో, ఇవ్వడానికో మిరాశీ ఇండ్లకు వెళ్ళినపుడు, పురుషుల కన్ను పడకపోదు. కన్ను పడిందంటే వేధింపులు తప్పవు. అఘాత్యాలకు గురికావచ్చు. చెల్లెలి పైనో, భార్యా పైనో అఘాయిత్యం జరిగినా, ఎదిరించలేని నిస్సహాయతను కత్తి పద్మారావు 'చాకిరివీరుడు'లో పేర్కొన్నాడు. 
సంధ్యకాంతుల్లో / గుడ్డలు మడతేసి/చీకటి పోరల్లో అఘాయిత్యానికి గురైన / చెల్లెలి ఆక్రందనను / గుండెల్లో దాచుకునే నిస్సహాయనిర్భాగ్యుడు/
తెలంగాణాలో దొరలదోపిడీ తనాన్ని, దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన సాహస వనిత ఐలమ్మ. పంట పొలాన్ని దోపిడీ చేయకుండా పోరాడి దక్కించుకుంది. వినుసూర్‌ దేశ్‌ముఖ్‌ ఐలమ్మపై పగ తీర్చుకోవడానికి ఆమె భర్తను, ఇద్దరు కొడుకులనీ హత్యాయత్నం కేసులో ఇరికించారు. కూతురు సోము నర్సమ్మ పై అత్యాచారం చేయించారు. అయినా ఐలమ్మ జంకలేదు. సంఘం పెట్టి ఎర్ర జెండా ఎగురవేసింది. తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచింది.
నా బువ్వ గుంజు కున్నందుకు/ బువ్వ గింజల పోరాటం జేస్తా / బువ్వ గింజల చాకలి ఐలమ్మ/ మొదటి నెత్తుటి చుక్క - దొడ్డి కొమురయ్యలు / మే మే / అంటున్నారు. 'నేను బహువచనం' కవితలో జూలూరి గౌరీ శంకర్‌.
తల్లికి పాలులేనపుడో, తల్లి మరణించిన సందర్భాల్లోనో రజక స్త్రీలు తమ పాలు పట్టి యజమానుల పిల్లలను పెంచిన సందర్భాలు అనేకం. పెరిగి పెద్దయ్యాక ఆ పిల్లలు వారి పై కృతజ్ఞత చూపడం సహజం చనుబాలతోనా మేను పెంచిన చాకలమ్మకు దండాలు / నన్నుపెంచిన చాకివంటేనే నాకు ప్రేమ -అంటూ  ననుమాసస్వామి 'నీలి బాల్యం'లో కృతజ్ఞత అర్పించారు.
మురికి బట్టలను ముత్యాల్లాగా, తీర్చినా వీరికి దక్కే గౌరవం దక్కటం లేదని, ఒరే , ఒసే, అని పిలుస్తూ, కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. 'మేం సాకలోళ్ళం' కవితలో పి. దస్తగిరి ఉత్తమపురుషులో సాగిన కవితలో మాకూ ఆత్మాభిమానముంది. గౌరవించండి అని నివేదించుకున్నారు.
ఒరే చాకలి/అన్న మీ గద్దింపులకు / సెప్పురెడ్డీ అంటూ పలికి/మానాన్ని సంపుకున్న / మనుషులం / ఇంగొద్దూ చాలు / మేము ఆత్మాభిమానమున్నోళ్ళమే / మనసున్న మనుషులమే / మమ్మల్ని గుర్తించండి/గౌరవించండి.
రజకులకు సంఘాలున్నాయి. వర్గ చైతన్యం కల్గింది. తమ స్థితిగతులపై ప్రశ్నిస్తున్నారు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను పట్టణాల్లో పెట్టుబడి దారి వ్యవస్థను ధిక్కరిస్తున్నారు. కులవివక్షను వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక, సామాజిక రంగాలలో సమత్వాన్ని కోరుతున్నారు. రజక స్త్రీలు పోరాటాల్లో పాల్గొంటున్నారు. తమ కులాన్ని హీనంగా చేసే కుల అహంకారాన్ని తత్వాన్ని బూర్జువాతనాన్ని దెబ్బకొట్టి తీరుతామని, బట్టల మురికిని పొగొట్టే రజకులకు అది కష్టం కాదని పి. దస్తగిరి మేం సాకలోల్లంలో నినదించారు.
దేవర దున్నపోతునే కాదు / కులహంకారాన్ని ఒక్క వేటుతో / నరికే వేట కొడవళ్లం / మనసుల్ని గుచ్చే మీ మాలిన్నమైన మాటలను / రోగాళ్లమై మోసుకెళ్లి చాకలి పొయ్యిలో కాల్చే పంగల కర్రలం / కాదంటే / బండకేసి బట్టల్ని ఉతకటం / బాగా తెలిసినోళ్ళం / మీ బూర్జువాతనాన్ని ఉతకటం / మాకేం కష్టం కాదు/
వివిధ కుల వృత్తుల వారు వృత్తిని వదలి విద్య, ఉద్యోగాల వైపు దృష్టిపెడ్తున్నారు. శ్రమదోపిడీ, ఆధిపత్య భావజాలం నిండుకున్న అగ్రకులస్థులకు అది కడుపు మంట కలిగించిందని ఏ.వై.ప్రభు 'మెరిటంటే ఏందిరో' కవితలో వ్యక్తీకరించారు.
సాలోల్లు, సాకలోల్లు, ఉప్పరోల్లు, వడ్డెరోల్లు, మంగలోల్లు - మాదిగోల్లు, ఎరుకలోల్లు, లంబడోల్లు.... ఉద్యోగం చేస్తుంటే కడుపుమండిందిరో/
ఆధునిక కవిత్వంలో రజకుల స్థితిగతులను అవలోకిస్తే రెండు కోణాలు అవగతమవుతున్నాయి. అనాదిగా సంప్రదాయ వృత్తిదారులకు వృత్తే జీవనాధారం. అరకొర ఆర్థిక వెసులుబాటుతో శ్రమ దోపిడీలో మగ్గారు. పెత్తందారీ వ్యవస్థ ఆధిపత్యంలో, వృత్తి నైపుణ్యం అగౌరవింపబడింది. నేడు శ్రమ విలువను, ఆర్థిక అసమానతను పసిగట్టి చైతన్య వంతులయ్యారు. అన్యాయాన్ని నిలదీస్తున్నారు.
పారిశ్రామికీకరణ, యాంత్రీకీకరణ కుల వృత్తులను దెబ్బకొట్టాయి. రజక వృత్తి విధానంలో మార్పులొచ్చాయి. పల్లెలకు పట్టణాలకు రజక వృత్తిలో తేడా ఏర్పడింది. పల్లెల్లో సంప్రదాయ పద్ధతిలో కులవృత్తి కొనసాగుతుండగా, పట్టణాల్లో ఇళ్లలో వాషింగ్‌మెషిన్‌ వాడుతున్నారు. లేదా                               ఉతికించుకుంటున్నారు. ల్యాండ్రీలు, ఇస్త్రీ బండ్లు వీధివీధినా వెలిశాయి. రజకులు నిర్ణయించిన ధర చెల్లించవలసి వుంటుంది. అయితే యాంత్రీకీకరణ వృత్తిదారుల పొట్ట కొట్టిందనీ, డ్రై క్లీనింగ్‌ ఆదాయ వనరుగా భావించి రజకులే స్థిరపడ్తున్నారు. ఏమైనప్పటికీ పట్టణాల్లో వృత్తి పని ఆధిపత్య వ్యవస్థ కబంధ హస్తాల నుండి విముక్తి పొంది, స్వేచ్ఛ వాయువులు పీల్చుకొంటుందనవచ్చు. 

12, ఆగస్టు 2015, బుధవారం

పోడుమీద పొడిచే పచ్చని పొద్దులా అడవి మీద ఎగిరే పావురాల గుంపులా స్వేచ్ఛగా, సహాజాతి సహజంగా....వాళ్ళు!వన్య ప్రాణులతో ఆటలాడుతూనో, అడవి పిట్టలతో పాట పాడుతూనొయీ కొండకోనల్లో ప్రవహించే స్వచ్ఛమైన సెలయేటి వాగుల్లా వాళ్ళు......వాళ్ళ కడుపులో పోడు కాలినపుడు గంటికూర నంజుకుని చింతంబలో, టెంకంబలో....జుర్రడం తెలుసు.ఆరారగా ఆకుల దొన్నల్లోని పుల్లేర్లు యేరుకుని పల్లీలు తిన్నట్టు ఒలుచుకు తినడం తెలుసు.యీవలేసినపుడు,కుందేటి పిల్లలతో కలసి ఏట్లో మూతిపెట్టి తాగడం తెలుసు! అమృతవృక్షం జీలుగుచెట్టు మీంచి అపుడే దించిన కల్లు కడుపారా తాగి అడవి తల్లి ఒడిలో కంటినిండా నిదురోవడం తెలుసు!వెదురుచాపల మీద మామిళ్ళ రసాలారబోసి , తాండ్రజేసి, లోకం నోళ్ళను తీపిచేయడం తెలుసు!పుట్టతేనె తీసి బొంగుల్లో పిండుకోవడం తెలుసు! విప్పపూల చెట్టెక్కి పిల్లంగోవితో పాటల పందిళ్ళు వేయడం తెలుసు!పున్నమి రాత్రుల్లో వెన్నెలచెట్టు కింద కిన్నెర మీటుతూనొ.....తుడుం కొడుతూనో......థింసాలాడడం తెలుసు!గూడేల ముందు తచ్చాడే నెమలి పిట్టలతో ఆటలాడుకోవడం తెలుసు.అడవిని కావుళ్ళకెత్తుకుని వారపు సంతల్లో అమ్ముకోవడం తెలుసు!అంతేనా.......వాళ్ళకు అడవి మీంచి వీచే పోరుగాలికి నెగళ్ళై రగలడం తెలుసు! వాళ్ళ తునికాకు కావుళ్ళను దోచుకునేటందుకు కాటాను తొక్కిపడుతున్న కాలిబొటనవేళ్ళనుఖండించడం తెలుసు!అడవిని అప్పనంగా దోచుకుపోతున్న లారీల చుట్టూ మానవహారంలా మూగడం తెలుసు! పన్నాగాలు పసిగట్టి కొండల్ని మింగేస్తున్న ఉక్కు పడగల మీద విల్లమ్ములెక్కుపెట్టి అమ్మలాంటి అడవిని కాపాడుకోవడమెలాగో వాళ్ళకు బాగానే తెలుసు!!

7, జులై 2015, మంగళవారం

ప్రకృతి :మార్క్స్

 పురాతన కాలంనాటి అద్భుతమైన స్వాభావిక తాత్విక ఊహలు, అరబ్బుల కాలంలో అడపాదడపా చోటు చేసుకున్న మహావిష్కరణలు ఎక్కువభాగం ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే అంతర్ధానమైపో యాయి. ప్రకృతిని ఆధునికంగా పరిశోధించి సాధించిన శాస్త్రీయమైన, క్రమబద్ధమైన పరిపూర్ణమైన శాస్త్రీయాభివృద్ధి మాత్రమే కాల పరీక్షకు నిలిచింది. ఈ ఆధునిక శాస్త్ర పరిశోధనాకాలంనుండి ఒక నూతన శకం ఆరంభమయ్యింది. ఇదంతా అతి సమీప చరిత్రయే. జర్మన్లు ఈ శకాన్ని సంస్కరణ యుగంగా పిలుచుకుంటే, ఫ్రెంచి వారు పునరుజ్జీవనశకంగా పిలుచుకున్నారు. ఇటలీవారు సంగీత, సాహిత్యాలు, కళలు, కుడ్యాల నిర్మాణంలో అద్భుత ప్రగతిసాధించిన కాలంగా పేర్కొన్నారు. పదిహేనవ శతాబ్దం ద్వితీయార్థం నుండి ఈ శకం ఆరంభ మయ్యింది. అప్పటిదాకా రాజ్యాలేలిన ఫ్యూడల్‌ ప్రభువులను, మహా సామ్రాజ్యాలను పట్టణ ప్రాంత వణిక్‌ ప్రముఖ వర్గమంతా కలిసి కూలదోసింది. ఇందులో 'జాతీయత' ప్రధాన భూమిక పోషించింది. ఆధునిక ఐరోపాలో జాతి రాజ్యాల అవతరణకు, ఆధునిక బూర్జువా వర్గ అభివృద్ధికి తోడ్పడిన ముఖ్య పరిణామం ఇది. ఒక ప్రక్కన వాణిజ్య వర్గాలు - రాజరికవర్గానికి మధ్యన యుద్ధాలు, తిరుగుబాట్లు, పోటారాలు జరుగుతూ ఉండగానే జర్మనీ రైతాంగం తిరుగుబాటు చేసి రానున్న వర్గ పోరాటాన్ని దోపిడీ వర్గాల ముందు సాక్షాత్కరింపచేసింది. రైతాంగ తిరుగుబాట్లు చరిత్రలో కొత్తకాదు గానీ జర్మనీ రైతాంగం చేతిలో ఎర్రజెండాతో, గొంతులో ఉమ్మడి యాజమాన్య హక్కు నినాదంతో తిరుగుబాటు చేసి ఆధునిక శ్రామికవర్గ శైశవ దశను రంగస్థలంమీదకు తెచ్చింది. బైజాంతియమ్‌ కూలిపోయిన పిదప భద్రపరచబడిన రాతప్రతులు, రోమ్‌ నగర శిధిల తవ్వకాలలో బయల్పడిన పురాతన విగ్రహాలు చూసి పశ్చిమ దేశాలు మ్రాన్పడిపోయాయి. మధ్యయుగాల నాటి ప్రేతాలు ఒక వెలుగు వెలగకుండానే అంతర్థానమైపోయిన ప్రాచీన గ్రీకు చరిత్ర పశ్చిమ దేశాలకు ఒక కొత్త లోకాన్ని కళ్ళకు కట్టించింది. కలలో కూడా ఊహింప తగని రీతిలో కళలు ఇటలీలో ప్రవర్థమాన మయ్యాయని చరిత్ర తెలుపుతున్నది. ఆ ప్రాచీన సౌందర్య సొబగులను తిరిగి ఆ దేశం ఎన్నటికీ అందుకోలేకపోయింది. ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ రాజ్యాలలో సాహిత్యం క్రొత్త పుంతలు తొక్కింది. ఆ తరువాతే ఇంగ్లీష్‌, స్పానిష్‌ సాహిత్యంలో ఆధునిక శకం ఆరంభమయ్యింది. ప్రపంచంలో అప్పటిదాకా ఉన్న భౌగోళిక సరిహద్దులు పటాపంచల ైపోయాయి. ్టమొదటి సారిగా ప్రపంచ వాణిజ్యానికి మార్గాలు ఏర్పడ్డాయి. చేతివృత్తుల స్థానంలో సరుకులను ఉ్తత్పత్తిచేసే పరిశ్రమలు వచ్చి చేరాయి. తదనంతరకాలంలో భారీ పరిశ్రమల అభివృద్ధి కి కేంద్ర బిందువుగా నిలిచాయి. ప్రజలపై మానసిక ఆధిపత్యం ఛలాయిస్తున్నచర్చి నియంతృత్వ ఆధిపత్యం కూలిపోయింది. మెజారిటీ ప్రజానీకం ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం వైపు మరలారు. లాటిన్‌ అమెరికా దేశాలు స్వేచ్ఛా ఆలోచనలకు కేంద్రంగా మారాయి. ఆ తర్వాత అరబ్బులు ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఆతర్వాత గ్రీకు తత్వశాస్త్రం విరాజిల్లింది. వీటి పునాది నుండే పద్దెనిమిదవ శతాబ్దం నాటికి భౌతికవాదం అంకురించింది. మానవాళి చరిత్రలో అద్భుతమైన అభ్యుదయ విప్లవకా లంయిది. అన్ని రంగాల్లోనూ దిగ్గజాలు ఉద్భవించారు. ఆలోచనల్లో, అన్వేషణలలో, వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ దిగ్గజాలు ఎనలేని ప్రభావం చూపించారు. జ్ఞాన సముపార్జన విశ్వవ్యాప్తమైంది. ఆధునిక బూర్జువా పరిపాలనకు రూపకల్పన చేసిన వారు కూడా బూర్జువా పరిమితులు ఏమిటో అర్థం చేసుకున్నారు. దేశాంతర పర్యటనలు చెయ్యడం, కనీసం నాలుగు భాషలు మాట్లాడటం, వివిధ రంగాలలో ప్రవేశం కలిగి ఉండటం నాటి జనానికి పరిపాటిగా మారింది. లియోనార్డో డావిన్సీని గొప్ప చిత్రకారుడిగానే చూస్తుంది ఈ ప్రపంచం. కాని అతను అద్భుత గణిత మేధావి, మెకానిక్కు, ఇంజనీరు. భౌతికశాస్త్రంలోకూడా అనేక నూతన ఆవిష్కరణలకు ప్రేరణగా నిలిచాడు. అలాగే ఆల్బర్ట్‌ డ్యూరర్‌ను తీసుకుంటే అతను చిత్రకారుడిగా, శిల్పిగా,భవన నిర్మాణ ప్రణాళికా రూపకర్తగా, రాతి చెక్కడాల రూప కర్తగా భాసించాడు. శత్రు దుర్భేద్యమైన నిర్మాణా లకూ రూపకల్పన గావించాడు. తదనంతర కాలంలో జర్మనీలో శాస్త్రీయాభివృద్ధి అతడి ఆలోచనల ఆధారంగానే ఆధునికాభివృద్ధి వైపు పురోగమించింది. మాకియవెల్లీ గొప్ప రాజనీతిజ్ఞుడే కాదు, గొప్ప చరిత్రకారుడు, గొప్ప కవి కూడా. అంతేకాదు ఆధునిక కాలపు సైనిక వ్యూహ శాస్త్రానికి ఆద్యుడు కూడా. లూథర్‌ అప్పటిదాకా ఏకఛత్రంగా ఏలిన చర్చిని సంస్కరించటమేకాదు.
జర్మన్‌ భాషనూ సంస్కరించి, వచనంలోకి మార్చటంలో ప్రధానపాత్ర పోషించాడు. అద్భుతమైన శబ్ద లాలిత్యంతో కూడిన వచన శ్లోకాలు రచించి, పదహారవ శతాబ్దపు మాకియవెల్లీగా ప్రభవించాడు. ఈ కాలపు కథా నాయకులు శ్రమ విభజనకు బందీలు కాలేదు.తదనంతర కాలంలో ఏకపక్షంగా కొనసాగిన వస్తూత్పత్తి విధానం మానవుడి సృజనాత్మక శక్తిమీద పరిమితులు విధించ సాగింది. అదలా ఉంచితే పైన చెప్పుకున్న కాలంనాటి కథా నాయకులు అనేకులంతా ఆ కాలపు ఉద్యమాలు, అసలైన పోరాటాలలో ఒక పక్షాన నిలబడి తమ కలాన్ని, గళాన్ని వినిపిం చారు. కత్తి పట్టి పోరాడారు. ఉద్యమాలతో మమేకం అవుతూనే జీవన మాధుర్యాన్ని అనుభవించారు. తమ సృజనాత్మక కార్యకలా పాలను కొనసాగించారు. పరిపూర్ణ మానవులుగా జీవించారు. అయితే కొద్దిమంది మేధావులు ఇందుకు మినహాయింపుగా బతికారు. ద్వితీయ, తృతీయ శ్రేణికి చెందిన ఈ రకం మేధావులు తమ చేతులు కాల్చుకో కుండా గట్టుమీద నిలబడి ఉద్బోధలతో కాలం గడిపారు. 
నాటి సామాజిక విప్లవాల కాలంలోనే సామాజికశాస్త్రాలలో అద్భుతమైన విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి పురాతనశాస్త్రాలూ పెనుగులాడాయి. ఆనాటి ఇటలీ తత్వవేత్తలతో పాటు శాస్త్ర పరిశోధనలలో తమ ప్రాణాలు అర్పించి అమరులైన వారు ఎందరో ఉన్నారు. ఈ పరిణామ క్రమంలో గమనించాల్సిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే ప్రకృతిని పరిశోధించడంలో క్యాథలిక్‌ల వలే కాకుండా ప్రొటెస్టెంట్లు ఎంతో స్వేచ్ఛ కల్పించారు. సెర్విటస్‌ రక్త ప్రసరణకు సంబంధించిన పరిశోధనలను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉండగా అందుకుగాను అతన్ని రెండుగంటలపాటు మంటల్లోసజీవదహనం చేశారు. గియార్డనో బ్రూనోనూ సజీవ దహనం చేశారు. 
అయినప్పటికీ శాస్త్రాలు విప్లవాత్మకంగా తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. మరణశయ్యమీదనుండే కోపర్నికస్‌ ప్రతిపాదించిన గ్రహగతుల సిద్ధాంతాన్ని ప్రచు రించడం ద్వారా లూధర్‌ చర్చి ఆధిపత్యానికి చరమగీతం పాడాడు. తద్వారా విశ్వాం తరాళగ వేషణకు నూతన మార్గాలు చూపాడు. ప్రకృతి పరిశోధనలో పెద్ద కుదుపు వచ్చిన కాలం అది. అప్పటికీ దైవదత్త సిద్ధాంతానికి, ప్రకృతి శాస్త్రాలకు మధ్యన నేను గొప్పంటే నేను గొప్పనే వాదులాటలు అడపదడపా కొనసాగు తున్నా, ప్రకృతి శాస్త్రాలు భావవాద సంకెళ్ళ నుండి ఈకాలంలోనే విముక్తిపొందాయి. అప్పటినుండి సైన్స్‌ అంగలు పంగలుగా అభివృద్ధి చెందింది. కాలంతోపాటు వేగంగా ఒక ధృతితో ఈ అభివృద్ధి సాగింది. మానవ మేధస్సు నిర్జీవ పదార్థం కాదని, అదొక పరమాద్భుతమైన జీవ పదార్థమని రుజు వయ్యింది.
ప్రకృతిశాస్త్రాలలో తొలిదశ కృషి అంతా అప్పటిదాకా అందుబాటులో వున్న పదార్థ విజ్ఞానాన్ని శిఖరస్థాయికి తీసుకు వెళ్ళడంగా సాగింది. కొన్ని రంగాలలో కృషికి మాత్రం అప్పుడే పునాదిపడింది. యూక్లిడ్‌, పిటోలిమక్‌లు సౌరవ్యవస్థ గురించి చేసిన ప్రాచీన సిద్ధాంత ప్రతిపాదనలు, అరబ్బులు కనుగొన్న శూన్యాం శము, ఆల్జీబ్రా, ఆధునిక సంఖ్యాశాస్త్రం, రసాయనశాస్త్రం-ఈ విజ్ఞానం మాత్రమే అప్పటివరకు అందుబాటులో ఉంది. మధ్యయుగాలలో శాస్త్ర విజ్ఞానానికి తోడ్పాటు పెద్ద గుండుసున్నాగా మిగిలింది. ఈ నేపథ్యంలో సామాజిక శాస్త్రాలకు సంబంధిం చిన మౌలికాంశాలు, మెకానిక్స్‌, గ్రహాలు, గ్రహాంతర అన్వేషణలు ప్రధానంగా సాగాయి. దీనికి సమాంతరంగా ఉపయుక్తంగా ఉండే రీతిలో గణితశాస్త్రాన్ని అభివృద్ధిచేసే కృషి జరిగింది. న్యూటన్‌ గమన సూత్రాలు, లీనియస్‌ సిద్ధాంతం ఈ రంగంలో సాగిన విశిష్ట అన్వేషణలుగా నిలిచాయి. ఇంక గణిత పద్ధతులలో డెస్కార్టెస్‌ 'ఎనలిటికల్‌ జామెంట్రీ'ని నేపియం 'ఆల్గరిధమ్స్‌'ని, లీబ్నిజ్‌ (న్యూటన్‌ కూడా) 'ఇంటిగ్రల్‌ కాలిక్యూలస్‌'ను తోడు చేశారు. అలాగే 'మెకానిక్స్‌'కు సంబంధించిన ప్రధాన సూత్రాలూ అందుబాటులోకి వచ్చాయి. అంతిమంగా ఖగోళశాస్త్రం, 'కెప్లర్‌'సౌర వ్యవస్ధలో గ్రహగతుల సిద్ధాంతం ద్వారా గ్రహ వ్యవస్థ చలనాన్ని కనుగొన్నాడు. పద్థాం, చలనాల సాధారణ సూత్రాల ద్వారా న్యూటన్‌ గ్రహాల చలనానికి సంబంధించిన సూత్రీకరణలను స్థిరపరిచాడు.అప్పటికింకా సామాజిక శాస్త్రాల్లో ఇతర విభాగాలు బాలారిష్టాలను అధిగమించ లేదు. ఆ శతాబ్దాంతానికి ద్రవ-వాయు రూపాలకు సంబంధించిన మెకానిక్స్‌లో కొంత పురోగతి సాధ్యపడింది. (ఇక్కడ రాత ప్రతి మార్జిన్‌లో ఏంగెల్స్‌ పెన్సిల్‌తో బోరిసెల్లీ-అల్పైన్‌ నదుల నియంత్రణలకు సంబంధించి అని రాసిపెట్టాడు) భౌతికశాస్త్రం కటక శాస్త్రంలో తప్ప ఏమాత్రం పురోగతి లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఖగోళశాస్త్రానికి కటక శాస్త్రం యొక్క అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందులో పురోగతి కలిగింది. అప్పటిదాకా రసాయనశాస్త్రం అంటే బంగారం తయారీగానే ఉంది. తొలిగా రసాయనశాస్త్రం ఈ పరిమితినుండి విముక్త మయ్యింది. భూగర్భ శాస్త్రానికి వచ్చేసరికి ఖనిజ శాస్త్రం పిండదశను దాటి పురోగమించలేక పోయింది. నాటికి భూభౌతికశాస్త్రం ఇంకా అంకురించనే లేదు. ఇక జీవశాస్త్రం (బయాలజీ) విషయానికి వస్తే వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, శరీర నిర్మాణశాస్త్రం, అవయవ శాస్త్రాల్లో అప్పటిదాకా అందుబాటులో వున్న విషయ సంపద విశ్లేషణలకు, పరీక్షలకు నిర్ధారణలకు పరిమితం అయ్యింది. దేశ కాలమాన పరిస్థితులు, వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా ఎక్కడ ఏ రకమైన జీవజాతులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే అంశం మీద అప్పటికింకా ఓనమాలు కూడా మొదలు కాలేదు. లిన్నీయస్‌ కృషి ఫలితంగా బోటనీ, జువాలజీలు మాత్రం పరిపూర్ణ దశకు చేరుకున్నాయి.
ఈ కాలానికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం 'ప్రకృతి స్వభావాన్ని మార్చలేం' అనే ప్రాపంచిక దృక్పథం బలంగా ఉండేది. ప్రకృతి ఏ రకంగా ఉనికిలోకి వచ్చిందనే విషయాన్ని ప్రక్కన పెట్టి, అది అంతమయ్యేదాకా ఇలానే కొనసాగు తుంది. గ్రహాలు, ఉపగ్రహాలు ఏ 'మిస్టరీ' శక్తి మూలంగా గమనంలో ఉన్నాయో గానీ అవి అనంతకాలంపాటు, లేదూ అవి క్షయమైపోయేం తవరకూ అలానే తిరుగుతూ వుంటాయి. విశ్వ గురుత్వాకర్షణ శక్తి మూలంగా ఆకాశంలోని నక్షత్రాలు స్థిరంగా, ఎక్కడివక్కడ కదలక మెదలక ఉండిపోతాయి. ఈ భూమి ఆవిర్భవించినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ, ఎప్పటికీ అలానే ఉంటుంది. ఐదు ఖండాలూ (అప్పటికి), పర్వతాలూ, నదులూ, లోయలూ, వాతావరణ పరిస్థితులూ, గడ్డీగాదం ఇవన్నీ ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఒక్క మానవ కల్పిత వ్యవసాయం, మొక్కల పెంపకం మూలంగా వచ్చిన మార్పులు తప్ప జీవ, జంతు జాలం కూడా యథాతథంగా పునరుత్పత్తి జరిగినంతకాలం అలానే కొనసాగుతాయి. లీన్నియస్‌ పరిశోధనల ఫలితంగా సంకరం జరిగి భిన్నమైన పునరుత్పత్తి జరిగితే తప్ప అన్నీ యథాతథంగా కొనసాగు తాయి అనే భావన ప్రబలంగా ఉండేది. మానవ జాతి చరిత్ర కాలాన్నిబట్టి వివిధ దశలలో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తూనే ప్రకృతి చరిత్ర విషయానికి వచ్చేసరికి అలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదన్న బలమైన అభిప్రాయం పాదుకుంది. ఫలితంగా ఎంతో విప్లవాత్మకంగా పురోగమించాల్సిన శాస్త్రాభి వృద్ధికి ప్రకృతిపట్ల ఈ మితవాద దృక్పధం అతిపెద్ద ఆటంకంగా పరిణమించింది.
పద్దెనిమిదవ శతాబ్దపు ప్రథమార్థం నాటికి శాస్త్రవిజ్ఞానం ప్రాచీన గ్రీకు విజ్ఞానానికన్నా ఎంతో ఉన్నతంగా ఎదిగింది. సైద్ధాంతికంగా, విషయపరంగా అప్పటిదాకా అందుబాటులో ఉన్న జ్ఞాన సంపదను లోతుగా విశ్లేషించింది. ప్రకృతిపట్ల ఉన్న ప్రాపంచిక దృక్పధానికి పుటం పెట్టింది. ఈ ప్రపంచం ఏదో ఒక సంక్షోభం నుండి ఆవిర్భవించి, అభివృద్ధి చెందింది. ఇలాగే ఉనికిలోకి వచ్చిందనేది గ్రీకు తత్త్వవేత్తల అభిప్రాయం. ప్రకృతిశాస్త్రజ్ఞుల దృష్టిలో కూడా ఈ భూమండలం, సమస్త చరాచర ప్రకృతి ఒక్క దెబ్బతో ఆవిర్భవించాయి. ఇవి ఎలాంటి మార్పులకు లోనయ్యే అవకాశం లేదనేభావం ఉండేది. అప్పటికి శాస్త్రవిజ్ఞానం కూడా భావవాద దృక్పధంలో చిక్కుకొని ఉంది. ప్రతి విషయమూ అంతిమంగా తేల్చాల్సి వచ్చేసరికి 'అది ప్రకృతికి అతీతమైన శక్తిమూలంగా అట్లా అయ్యింది' అనో, 'దాన్ని వివరించలేం' అనడమో ముక్తాయింపుగా మారింది. పదార్థానికి ఉండే ముఖ్య లక్షణం ఆకర్షణ అని న్యూటన్‌ తేల్చి చెప్పిన తర్వాత నుండి అలవిమాలిన ప్రశ్నలన్నింటికీ 'బాప్టిజం' ఇచ్చినట్లు-'విశ్వ గురుత్వాకర్షణ శక్తి' కారణం అన్న సమాధానం వినవచ్చేది. గ్రహాలకు కక్ష్యలు ఎలా ఏర్పడ్డాయి? ఈ భూమ్మీద వేనవేల జంతువులు, లక్షోపలక్షల రకాల మొక్కలు, చెట్లు ఎలా వచ్చాయి? మనిషి పుట్టుక ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం కూడా 'ఇదంతా ఆ సృష్టికర్త లీల' అని చెప్పుకొచ్చిన కాలం అది. మొదటగా కోపర్నికస్‌ ఈ భావవాదం వాకిళ్ళు తెరిచాడు. న్యూటన్‌ ఆ రెక్కలు మూసి ఒక 'అతీత శక్తి'ని ముందుకు తెచ్చాడు. ఈ చరాచర ప్రకృతి అంతా పరస్పర ఉపయోగార్థం సృష్టించబడింది. ఎలుకలని చంపి తినడానికి పిల్లులు, పిల్లుల్ని చంపి తినేదానికి కుక్కలు అంటూ ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని ఏదో ఒక అవసరార్థం ఆ సృష్టికర్త సృష్టించాడని చెప్తూ ఉండే వాళ్ళు. అయితే గొప్పతనం ఏంటంటే నాటి ప్రకృతి విజ్ఞానం ఇంత పరిమితంగా ఉన్నప్పటికీ తత్త్వవేత్తలు మాత్రం స్పినోజానుండి, ఉద్దండ ఫ్రెంచి పదార్థవాదుల వరకు ఎందరో ప్రపంచం గురించి పరిపరి విధాలా వ్యాఖ్యానిస్తూ, వాటి మంచి చెడులను మాత్రం భవిష్యత్‌ ప్రకృతిశాస్త్రాలు నిగ్గు తేలుస్తాయని వదిలి పెట్టారు. 
పద్దెనిమిదవ శతాబ్దపు పదార్థవాదులను కూడా కలిపి ఎందుకు చెప్పానంటే పైన పేర్కొన్న దానికి మినహా వారికి శాస్త్రీయమైన ప్రకృతి పరిజ్ఞానం ఏదీ అందుబాటులో లేదు. కాంట్‌ తత్వ బోధలు నూతన శకానికి నాందిగా, ఒక రహస్యంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఎప్పటికోగానీ వాప్లాస్‌ తత్వం రంగం మీదకి రాలేదు. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏమిటంటే ఒక ప్రక్కన విజ్ఞానశాస్త్రం నిత్య నూతనంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరోవైపు ప్రకృతిపట్ల కాలం చెల్లిన ప్రాపంచిక దృక్పధం బలంగా వేళ్ళూనుకొని ఉన్న కాలం అది. పంతొమ్మిదవ శతాబ్దం ప్రథమార్థం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూళ్ళలో ఇప్పటికీ అవే పాఠాలు బోధిస్తూ ఉన్నారు. 
ప్రకృతికి సంబంధించి బూజుపట్టిన ఈ భావాలను త్రోసిరాజన్నది ఒక ప్రకృతి శాస్త్రజ్ఞుడు కాదు, ఒక తత్వవేత్త. 1755లో కాంట్‌ రాసిన యూనివర్సల్‌ నాచురల్‌ హిస్టరీ అండ్‌ థియరీ ఆఫ్‌ హెవెన్‌' అన్న చిరుపొత్తంలో విస్ఫోటన సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చాడు. ఈ భూమి సహా మొత్తం సౌర వ్యవస్థ క్రమానుగతంగా ఉనికిలోకి వచ్చాయి అని ప్రకటించాడు. 'భౌతికశాస్త్రమా, అధి భౌతికశాస్త్రం (మెట్ట వేదాంతం)తో జాగ్రత్త సుమా' అన్న న్యూటన్‌ పలుకులు గమనంలో ఉంచుకొని ఉంటే మెజారిటీ ప్రకృతి శాస్త్రజ్ఞులు 'కాంట్‌' యొక్క ఒకే ఒక్క అద్భుత ఆవిష్కరణను పరిగణనలోకి తీసుకునేవాళ్ళు. లెక్కలేనంతశారీరక , మేధోశ్రమలను, విలువైన కాలాన్ని, తప్పుడు పద్ధతులలో జరిగిన పరిశోధనలకు వెచ్చించేవారు కాదు. కాంట్‌ ఆవిష్కరణలతో అప్పటిదాకా స్ధంభించి ఉన్న పరిశోధనలు ఊపందుకున్నాయి. 
భూమి పరిణామక్రమంలో ఉనికిలోకి వచ్చినదయినందున దాని భౌగోళిక, వాతావరణ, భూగర్భ పరిస్థితులూ, ఈ భూమ్మీది మొక్కలు, ప్రాణులు కూడా ఆవిధంగానే ఉనికిలోకి వచ్చి ఉంటాయి. ఇవి సహజీవనం సాగించడానికి ఒక చరిత్ర ఉన్నట్లే కాలానుగుణమైన మార్పులూ ఉండి వుంటాయి. ''ఈ దిశగా మరిన్ని పరిశోధనలు కొనసాగితే ప్రకృతి శాస్త్రం మరింత పురోగమించివుండేది. కాని తత్వశాస్త్రం నుండి ఆ మాత్రం మంచిని ఎవరు ఆశించారు గనుక 'కాంట్‌' ఆవిష్కరణను చాలాకాలంపాటు ఎవరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ళ తరువాత లాప్లాస్‌, హెర్షెల్‌లు ఇరువురూ కాంట్‌ ఆలోచనలను మరింత లోతుగా విశ్లేషించి, బలమైన పునాది తయారు చేశారు. క్రమంగా 'నెబ్యూలార్‌ హైపోథిసిస్‌' దగ్గరకు తెచ్చారు. ఆ తరువాత కొనసాగిన అన్వేషణలు మరిన్ని విజయాల్ని తెచ్చిపెట్టాయి. స్థిర నక్షత్రాల గమనం. విశ్వాంతరాళంలో నిరోధక మాధ్యమం, విశ్వ పదార్థరాశి, రసాయన గుర్తింపు దాని... విశ్లేషణ, పాలపుంతల ఉనికి వంటి కీలక ఆవిష్కరణలు అందులో ముఖ్యమైనవి.
అయినప్పటికీ భూమి అనేక మార్పులకు గురవుతున్నట్లే ప్రకృతి కూడా పరిణామ క్రమంలో ఉనికిలోకి వచ్చిందని మెజారిటీ ప్రకృతి శాస్త్రవేత్తలు అంగీకరించారా అంటే జవాబు అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. అయితే ఈ వాదనకు మరో రంగంనుండి మద్దతు లభించింది. భూగర్భశాస్త్ర విజ్ఞానం ఈ భూమి పొరలు పొరలుగా ఒకదానిమీద ఒకటిగా ఏర్పడ్డాయని ఈ పొరలలో అంతరించిపోయిన జంతువుల అస్థిపంజరాలు, గుల్లలు, అలానే చెట్ల దుంగలు, ఆకులు, పళ్ళ అవశేషాలు ఉన్నాయని వెలుగులోకి తెచ్చింది. దానితో ఇప్పుడీ భూమ్మీద ఉన్న సమస్త జీవజాలమూ ఒక చారిత్రక పరిణామ క్రమంలో ఏర్పడ్డాయని అంగీకరించాల్సి వచ్చింది. అయితే అది కూడా ఎంతో అయిష్టంగానే జరిగింది. 'రివల్యూషన్స్‌ ఆఫ్‌ ఎర్త్‌' పేరిట కూవియర్‌ ఒక సిద్ధాంతం ముందుకు తెచ్చాడు. పేరులో 'విప్లవం' తప్ప సారంలో ఈ సిద్ధాంతం పచ్చి ప్రతీఘాతుకమైనది. ప్రకృతిని ఎవరో ఒక సృష్టికర్త' ఇట్లా సృష్టించాడన్న దానికి బదులుగా, ఒక్కో దశకు ఒక్కో సృష్టికర్తని జోడించి 'మానవాతీతం' అనేది ప్రకృతి పరిణామ క్రమానికి మూలం అని తేల్చి చెప్పాడు. సృష్టికర్త 'మూడ్‌'ని బట్టి ఈ భూమి తాపీగా దశలవారీగా రూపాంతరం చెందినదన్న వాదన ముందుకు తెచ్చాడు లీయెల్‌. గతంలో వాళ్ళందరికన్నా పనికిమాలిన వాదన ఇది. ప్రాణికోటి ఉనికిలోకి వచ్చి యథాతథంగా కొనసాగుతున్నాయనేది అతని ఆలోచన. కాని భూమి ఉపరితలం క్రమంగా గట్టిపడుతూ, జీవం ఆవిర్భవించే పరిస్థితులు ఏర్పడిన క్రమంలో, జీవకోటి ఆవిర్భవించింది అనేది వాస్తవం.
సంప్రదాయం అనేది క్యాథలిక్‌ చర్చిలోనే కాదు ప్రకృతిశాస్త్రంలోనూ బలంగా ఉండింది. చాలా ఏళ్ళపాటు లియెల్‌ తన సిద్ధాంతంలోని వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేదు. ఇంక ఆయన శిష్యగణం గురించి చెప్పేదేముంది. ఆనాటికి సైన్స్‌మీద కూడా శ్రమ విశజన ప్రభావం పడడమే ఇందుకు కారణం.శ్రమ విభజన ఎవరికి వారిని ఆయా ప్రత్యేక రంగాలకే పరిమితం చేసింది. అయితే కొద్దిమందిలో సమగ్రత కోసం మిగిలివున్న తృష్ణను ఆశ్రమ విభజన వారిని ఏవోకొన్ని రంగాలకే పరిమితం చేయలేకపోయింది.
ఇదిలా ఉంటే భౌతికశాస్త్రంలో పెద్ద ముందడుగు సాధ్యపడింది. సామాన్యశాస్త్రంలో ముగ్గురు వ్యక్తులు 1842వ సంవత్సరంలో అలాంటి పురోగతికి కారకులయ్యారు. హీల్‌బ్రాన్‌కు చెందిన 'మాయర్‌', మాంచెస్టర్‌కు చెందిన 'జోలీ'లు ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా, యాంత్రికశక్తి ఉష్ణశక్తిగా రూపాంతరం చెందడాన్ని ఆవిష్కరించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన 'గ్రూప్‌' భౌతికశక్తులు అన్నీ - యాంత్రికశక్తి, ఉష్ణశక్తి, కాంతిశక్తి, ఆయస్కాంతశక్తి, విద్యుత్‌ శక్తి ఆ మాటకి వస్తే రసాయనశక్తి కూడా నిర్దిష్ట పరిస్థితులలో ఎటువంటి శక్తి నష్టపోకుండానే ఒక శక్తిరూపం నుండి మరొకశక్తి రూపానికి మారతాయన్న ఆవిష్కరణ చేశాడు. ప్రపంచంలో చలన పరిమాణం స్థిరంగా ఉంటుందన్న 'డెస్కారిస్‌ సూత్రీకరణకు అదనంగా భౌతికశక్తులు నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక శక్తిరూపం నుండి మరొక శక్తి రూపానికి మారతాయని నిర్థారించాడు. తద్వారా చలనంలో ఉన్న వివిధ పదార్థాలు నిర్దిష్ట సూత్రాలకు లోబడి ఒకదానినుండి ఇంకొక రూపంలోకి మారతాయన్నది రుజువు కావడంతో ప్రకృతిని ఏమాత్రం మార్చలేం అన్న సంప్రదాయభావానికి కాలం చెల్లింది. ఖగోళశాస్త్రంలో వలె భౌతిక శాస్త్రంలో కూడా పదార్థ చలనం ఒక్కటే మార్పులకు మూలం అన్న విషయం రుజువయ్యింది. 
రసాయన శాస్త్రంలో కూడా లోపోయిజర్‌ ప్రత్యేకించి డాల్టన్‌ ప్రకృతికి సంబంధించిన పాత భావాలమీద మరో కోణం నుండి దాడి చేశారు. సేంద్రియ మిశ్రమాల తయారీకి వర్తించే సూత్రాలే సేంద్రియేతర మిశ్రమాల తయారీకీ వర్తిసాయి అని రుజువు చెయ్యడం ద్వారా సేంద్రియ - సేంద్రియేతర పదార్థాల మధ్యన ఉన్న అంతరాన్ని అధిగమించలేం అన్న కాంట్‌ భావన కూడా పనికిమాలినదని రుజువయింది.
ఇక జీవశాస్త్ర పరిశోధనలలో 18వ శతాబ్దం ద్వితీయార్థం నుండే శాస్రీయమైన బృందయాత్రలు, పర్యటనలు ప్రపంచంలో నలుమూలలా ఉన్న ఐరోపా వలస దేశాలన్నింటికీ సాగాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండి పరిశోధనలు కావించినవారు ఎందరో శరీర శాస్త్రం, శరీర నిర్మాణశాస్త్రం, అంగ నిర్మాణ శాస్త్రాల్లో ఎంతో పురోగతి సాధించారు. మైక్రోస్కోప్‌ను శాస్త్రీయంగా వినియోగించడం, కణాన్ని గుర్తించడంతో అప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారాన్ని తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం ఆరంభమయ్యింది... అనివార్యమైంది. 
ఒక వంకన వివిధ రకాల మొక్కల, వృక్షజాతుల జీవావరణ పరిస్థితుల మీద తులనాత్మక భౌతిక భౌగోళిక అధ్యయనం కొనసాగితే మరోవంకన సమజాతి జీవుల అంగ నిర్మాణానికి సంబంధించిన వివిధ అధ్యయనాలు - అది కేవలం వయసున ఉన్న దశలోనే కాకుండా అన్ని దశలకు సంబంధించి - కొనసాగాయి. ఈ అధ్యయనాలు లోతుగా, నిర్దిష్టంగా కొనసాగిన కొలదీ ప్రకృతి నిర్మాణం మార్పులకు అతీతంగా ఉంటుందనుకున్న భావన పటాపంచలవుతూ వచ్చింది. వివిధ జాతుల మొక్కలు, జంతువులు అనివార్యంగా పరస్పర ఆధారితం అని తెలియవచ్చింది. దీనితో అప్పటివరకూ జరిగిన వర్గీకరణకు కాలం చెల్లిపోయింది. భూభౌతికశాస్త్రంలో అప్పటిదాకా ఉన్న లోపాలు ఒకటొకటిగా తొలగిపోతున్న కొలది సేంద్రియ ప్రపంచ చారిత్రక అభివృద్ధికి, వ్యక్తిగత సేంద్రియ చారిత్రక అభివృద్ధికి మధ్యన ఉన్న సమాంతర సంబంధాలు వెల్లడవుతూ వచ్చాయి. అరియాడ్నె ఆవిష్కరణలతో జీవ-జంతు కీటక శాస్త్రాల్లో మరింత లోతైన అన్వేషణలు సాధ్యపడ్డాయి. 1759లో 'కాంట్‌' సౌర వ్యవస్థ అసంతత్వ భావనమీద దాడిచేసిన నేపథ్యంలోనే సి.ఎఫ్‌. ఫూల్స్‌ జీవజాతుల క్షీణతా సిద్ధాంతాన్ని ప్రకటించాడు. ఓకెన్‌, లామార్క్‌, బాయర్‌లు ఈ సిద్ధాంతానికి కొనసాగింపు కృషి చేశారు. అంతిమంగా వందేళ్ళ తర్వాత డార్విన్‌ 'పరిణామ క్రమ సిద్ధాంతం' వెలుగులోకి వచ్చింది. దాదాపుగా అదే కాలంలో ప్రోటోప్లాజమ్‌, కణం-ఈ రెండూ సేంద్రియ జీవానికి అట్టడుగు స్థాయి రూపాలని నిర్థారణ అయ్యాయి. తద్వారా సేంద్రియ-సేంద్రియేతర స్వభావాల మధ్యన అప్పటిదాకా ఉన్న అగాధం కనీస స్థాయికి తగ్గుముఖం పట్టింది. ప్రకృతి, దాని లక్షణాల పట్ల ఏర్పడిన నూతన ప్రాపంచిక దృక్పథం పరిపూర్ణ స్థాయికి చేరుకుంది. ప్రకృతి స్థిరంగా ఉండిపోతుంది అనే భావన అంతమయింది. అనంతమైన విశ్వానికి ఆపాదించిన అనంతత్వం( క్షయాకానకం) సరికాదు అని కూడా తెలియవచ్చింది. ప్రకృతి సమస్తం చలనశీలమైనదని, నిరంతరం మార్పులకు లోనవుతూ వుంటుందని స్పష్టమైంది. 
ఆ రకంగా మనం గ్రీకు తత్వశాస్త్ర ఆద్యుల ప్రాపంచిక దృక్పథం దగ్గరకి తిరిగి వచ్చాం. ఈ ప్రకృతి యావత్తూ, చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇసుక రేణువు నుండి సూర్యుడిదాకా, ప్రోటోజోవా (ఏకకణ జీవి) నుండి మనిషివరకూ - సమస్త పదార్థం ఉనికిలోకి వచ్చి, వృద్ధిచెంది, గతించిపో తుంటాయి.ప్రకృతి నిరంతర చలనం, నిరంతర మార్పులకు లోనవుతూ వుంటుంది అనేది గ్రీకు తత్వశాస్త్ర సారాంశం. తేడా అల్లా ఆ రోజున గ్రీకు తత్వవేత్తలు మేధోకల్పనగా లోకం ముందుకు వచ్చింది. మన నిర్థారణలు శాస్త్రీయ ప్రాతిపదికన పరిశోధన చేసి నిర్దిష్టంగా, స్పష్టంగా సూత్రీకరించాం. ఈ చక్రపాత పయనాన్ని అనుభవవాద రుజువులతో పరిశీలించదలిస్తే అక్కడక్కడా చిన్న చిన్న లోటుపాట్లు లేవని కాదు, అయితే ఇప్పటిదాకా నిర్దిష్టంగా రుజువు కాబడిన విషయ పరిజ్ఞానంతో పోలిస్తే అవి అంత పరిగణనలోకి తీసుకొనే అంశాలు కాదు. రానున్న కాలంలో ఇవన్నీ ఒకటొకటిగా పరిష్కారం అవుతాయని మనం ఆశించవచ్చు. అదయ్యే పనేనా అని ఎవరన్నా సందేహించ వచ్చు. ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రం వంటి శాస్త్రీయ పరిజ్ఞానం వందేళ్ళక్రితం ఊహింపశక్యం కాని విషయాలేగా, యాభై ఏళ్ళక్రితం దాకా శరీర శాస్త్రం, అంగ నిర్మాణ శాస్త్రం ఊహింపశక్యం కాని విషయాలేగా, నలభై ఏళ్ళ క్రితం దాకా కణ నిర్మాణాన్ని కనుగొంటారని ఎవరన్నా ఊహించి ఉంటారా?- ఇవీ అలానే పరిష్కారం అవుతాయి.
× × ×
అంతులేనన్ని సౌర గ్రహాలు, మన భూమండలం అంతర్భాగంగా ఉన్న సౌర వ్యవస్థ ఇవన్నీ పాలపుంత. ఇవన్నీ వాటి గమనవేగం కారణాన సంకోచించి చల్లబడి, మెరిసే ఘనీభవించిన వాయురూప పదార్థాలుగా అవతరించడం వెనుక గమన సూత్రాలు ఇమిడి ఉన్నాయని వెల్లడయిన తర్వాత, నక్షత్ర గమనం మీద వందల ఏళ్ళపాటు మనలో ఉన్న పొరబాటు భావాలు పటాపంచలయిపోయాయి. నూతన అవగాహన నూతన ఆలోచనలను తోడు చేసింది. అయితే అన్ని రంగాల్లో ఇది ఏకరీతిన జరగలేదు. 
ఖగోళశాస్త్రానికి నానాటికీ కృష్ణబిలాల ఉనికిని తప్పనిసరిగా గుర్తించాల్సిన అగత్యం ఏర్పడింది. కృష్ణబిలాలు అంటే ప్రకృతిలో ఇమిడి వున్న గ్రహాంతర పదార్థం మాత్రమే కాదు అవి ఆరిపోయిన సూర్యగ్రహాల మూలంగా ఏర్పడినవి (మాడ్లియర్‌), మరో ప్రక్కన వాయురూప పాలపుంతల్లో కొన్ని 'ప్లాచ్‌'లు మన సౌర వ్యవస్థలోనే ఇంకా పూర్తిగా ఏర్పడని సూర్యులని (సెచీ) ఆవిష్కరించబడడంతో ఇతర( నెబ్యూలాల)నక్షత్రమండలాల ఉనికిని కొట్టిపారెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. సాపేక్షంగా ఇవి ఏమేరకు అభివృద్ధి చెంది ఉన్నాయనేది 'స్పెక్టోస్కోప్‌'తో మాత్రమే నిర్థారించగలం.
పాలపుంత పదార్థరాశి క్రమంగా సౌరవ్యవస్థగా ఎలా అభివృద్ధి చెందినదీ ఎంతో వివరణాత్మకంగా ఆవిష్కరించాడు లాప్లాస్‌. ఇప్పటిదాకా దీన్ని మించిన వివరణ రాలేదు. తర్వాత తర్వాత జరిగిన పరిశోధనలు కూడా లాప్లాస్‌ ఆవిష్కరణలనే మరింత ఖచ్చితత్వంతో బలపరిచాయి. 
సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అని అంతరిక్షంలో మూడు రకాలుగా ఏర్పడడానికి చలనంలో ఉన్న ఆ పదార్థరాశి కలిగి ఉన్న ఉష్ణశక్తి కారణం. ఉష్ణశక్తిని నిర్దిష్ట పరిస్థితులలో విద్యుత్‌, అయస్కాంత శక్తులుగా మార్చే వీలున్నప్పుడు సూర్యుడు ఎంతటి తీవ్ర ఉష్ణోగ్రత కలిగి ఉన్నప్పటికీ అందులో మూలకాల రసాయన మిశ్రమాల చర్యలను కొట్టిపారెయ్యలేము. ఉష్ణానికి - గురుత్వాకర్షణకు మధ్య ఉండే ఘర్షణ మూలంగా సూర్యుడిలో యాంత్రిక చలనం కలుగుతుందని కనిపెట్టారు మరిన్ని పరిశోధనలలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. పరిమాణంలో చిన్నవిగా ఉండే పదార్థాలు పెద్దవాటికన్నా త్వరగా చల్లబడతాయి. అయితే రెండు సందర్భాలలో పదార్థ కేంద్రం అన్నింటికన్నా ఆఖర్న చల్లబడుతుంది.
ఏ పదార్థరాశి అయినా క్రమంగా చల్లబడేటప్పుడు భౌతిక, అంతర్గత కదలికలో మార్పులు ఒకదానినుండి మరొకదానికి రూపాంతరం చెందుతూ ఒక దశలో రసాయన మార్పులకు పరిస్థితులు పరిపక్వమై ఆ పదార్థరాశిలో రకరకాల రసాయనిక సంయోగ వియోగాలు చోటు చేసుకుంటాయి. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతోపాటుగా ఈ రసాయన సంయోగాలు అందలి మూలకాలతోపాటు, మూలక సంయోగాలను కూడా ప్రభావితం చేసి రసాయన సమ్మేళనాల ఏర్పాటుకు దారితీస్తాయి. క్రమానుగతంగా కొనసాగే ఈ మార్పుల మూలంగా వాయురూపంలో ఉన్న పదార్థం ముందుగా ద్రవరూపంలోకి, తరువాత ఘన పదార్థరూపంలోకి మారుతుంది. తద్వారా నూతన పరిస్థితులు ఆవిర్భవిస్తాయి. 
అట్లా ఒక గ్రహ పదార్థం గట్టి గుల్లగా తయారయినాక దాని ఉపరితలం మీద నీరు నిల్వ ఉండటం పెరుగుతూ ఉంటుంది. ఆ గ్రహ పదార్థ కేంద్రం నుండి వెలువడే ఉష్ణోగ్రతలతో పోలిస్తే దాని ఉపరితలం అంతర్గత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేకొలది (వీటి) ఆవిర్భావం పెరుగుతా వస్తుంది. ఆ రకంగా దాని వాతావరణంలో వచ్చే మార్పులు భౌగోళిక మార్పులుగా అవతరిస్తాయి.
అంతిమంగా ఉపరితలంమీద ఉష్ణోగ్రత గణనీయమైన ప్రదేశం మేరకు సరిసమానంగా ఉంటే ప్రోటీన్లు జీవం పోసుకొనే అవకాశాలు ఏర్పడతాయి. ఇతరత్రా రసాయన పరిస్థితులు కూడా అనుకూలిస్తే జీవం ఉన్న ప్రోటోప్లాజమ్‌ అవతరిస్తుంది. అనుకూల పరిస్థితులు ఏమిటనేవి మనకు తెలియకపోవచ్చు. ఆ మాటకి వస్తే ప్రోటీన్ల రసాయన ఫార్ములానే మనకు ఇంతరకూ తెలియదు. ప్రొటీన్లలో ఉండే వివిధ రసాయనాలు ఏమిటో కూడా పూర్తి సమాచారం లేదు. అయితే ఒక దశాబ్దం క్రితమే నిర్మాణ రహిత ఈ ప్రొటీన్‌ల మూలంగానే అరుగుదల, విసర్జన, కదలిక, కుంచించుకుపోవడం, ప్రతిస్పందన, ప్రత్యుత్పత్తి వంటి క్రియలన్నింటికీ కీలకం అని కనుగొన్నారు. 
అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి, ఈ ఆకార రహిత ప్రోటీన్‌ మొదటగా కణాన్ని ఉత్పత్తి చెయ్యడానికి, ఒక న్యూక్లియర్‌, ఒక కణపొర ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అయితే ఈ కణజాలం ఆవిర్భావంతో ఆర్గానిక్‌ ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. అసంఖ్యాకమైన సెల్యూలార్‌, నాన్‌-సెల్యూలార్‌ జీవులనేకం ఆవిర్భవించాయి. ఈ జీవులను వృక్షజాతి, జంతుజాతిగా వర్గీకరించారు. 
మనిషి అవతరణ కూడా ఇలానే జరిగింది. ఏక కణం నుండి సంక్షిప్త అంగ నిర్మాణం దాకా మానవజాతి అవతరణ ఒక చారిత్రక క్రమంలో జరిగినదే. చతుష్పాద జంతువులా నాలుగు కాళ్ళ నడక నుండి రెండు కాళ్ళు, రెండు చేతులుగా వైవిధ్యం సంతరించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. నిటారుగా నడవడానికి మరికొన్ని వేల ఏళ్ళు పట్టింది. కోతినుండి మానవరూపంలోకి పరిణామ క్రమం తరువాత మాటనేర్వడం, ఆ తరువాత మెదడు అభివృద్ధి చెంది ఆలోచించగలగడంతో మానవ పరిణామక్రమం పరిపూర్ణమయ్యింది. వానరుడికి నరుడికి మధ్యన పూడ్చలేని అగాధం ఏర్పడిపోయింది.
చేతిని పనిముట్టులా వాడుకోవడం మానవ కార్యకలాపాల్లో ప్రత్యేకతగా నిలిచింది. తద్వారా మానవుడికి ప్రకృతికి మధ్యన ఉత్పత్తి సంబంధం ఏర్పడింది. జంతుజాలానికి చేతులు ఉన్నాయి. వాటినీ ప్రకృతినుండి తమ ఆహార సముపార్జనకు వాడుకుంటాయి. అంతవరకే వాటి పరిమితి. కాని మానవుడి విషయంలో అలా కాదు. ప్రకృతిమీద తనదైన ముద్రవేశాడు. మొక్కలని, జంతుజాలాన్ని ఒకచోట నుండి మరొకచోటుకి మార్చగలగడం, తన ఆవాస ప్రాంత వాతావరణాన్ని తనకి అనువుగా మార్చుకోవడం ద్వారా నెమ్మది నెమ్మదిగా ప్రకృతిమీద పట్టు సాధించసాగాడు. మానవుడు ఇదంతా కేవలం తన చేతులతో సాధించాడు. ఆ తరువాత అంచెలంచెలుగా చేతులతో పాటు మెదడు అభివృద్ధి కావడంతో ఆ చైతన్యాన్ని ఉపయోగ పెట్టుకొని పరిస్థితులను విశ్లేషించి ఆచరణలో ఉపయోగపడతాయనుకొనే కార్యకలాపాలు చేపట్టసాగాడు. ప్రకృతి నియమాలకు సంబంధించి జ్ఞానాన్వేషణకు పూనుకున్నాడు. ప్రకృతి సూత్రాలను ఒకటొకటిగా అర్థం చేసుకోవడం ద్వారా ప్రకృతిమీద నానాటికీ పట్టు పెంచుకోసాగాడు. చేతులను పనిముట్టుగా వినియోగించడంతో పాటు సమాంతరంగా మెదడుకు పదునుపెట్టడం ద్వారా మానవాళి అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రకృతిని ఎక్కువగా వినియోగించుకోవటం సాధ్యపడింది.
మానవజాతి 'చరిత్ర'లోకి మనం అలా అడుగుపెట్టాం. జంతుజాలానికి ఒక చరిత్ర ఉంది. వాటి పుట్టుక, పరిణామక్రమం ఇవన్నీ వాటితో ప్రమేయం లేకుండా సాగిన చరిత్ర వాటిది. కాని వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన అనంతరం మానవుడు చైనత్యపూర్వకంగా తన చరిత్రను తానే నిర్మించుకున్నాడు. మానవజాతి చరిత్రలో అదృశ్యశక్తుల ప్రమేయంగాని, అదాటు పరిణామాల ప్రమేయంగాని నామావశిష్టంగా మారింది. మానవజాతి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా చరిత్ర ప్రభవించింది. అయితే ఇవే ప్రమాణాలను మానవజాతి చరిత్రకు అన్వయించి చూసుకుంటే మానవ మేధస్సు ఈ నాటికి ఎంత అభివృద్ధి చెందిందో, ఎంతటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నదో వాటికీ వాస్తవాలకు మధ్యన అంతులేని వ్యత్యాసం ఉండడం మనం గమనించవచ్చు. దీనికి కారణం అనియంత్రిత శక్తుల ఆధిపత్య ప్రభావాలే అని వేరుగా చెప్పనక్కరలేదు. ఇది ఇంతకన్నా భిన్నంగా ఉండకపోవడం సహజమైన విషయమే. ఎందుకంటే వానరుడు నరుడుగా అవతరించడానికి ఒక పాదార్థిక పునాది ఉంది. అసంఖ్యాకమైన కార్యకలాపాలకు ఈ పాదార్ధిక లక్షణాలే పునాదిగా నిలిచాయి. మానవాళి తన అవసరాలకోసం చేపట్టిన ఉత్పత్తి - సామాజిక ఉత్పత్తి - కార్యకలాపాలు అన్నీ అనియంత్రిత శక్తుల అవాంఛిత ప్రభావాలతో అంతర్గతంగా ఘర్షణపడి, కొన్ని మినహాయింపులతో విజయం సాధించినవే తప్ప ఎక్కువ సందర్భాలలో వైఫల్యం చెందినవే.
అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లో ప్రకృతి శక్తులను చెరబట్టి మానవాళి అవసరాల పేరిట అలవిమాలిన ఉత్పత్తిని చేపట్టారు. ఒకప్పుడు వందమంది పెద్దవాళ్ళు కలిసి చేసే ఉత్పత్తిని ఒక పిల్లవాడితో చేయిస్తున్నారు. దీని ఫలితం ఏమిటి? పనిభారం పెరిగింది. ప్రజల కష్టాలు కడగండ్లు పెరిగాయి. ప్రతి పదేళ్ళకు ఒకసారి భారీ సంక్షోభాలు వస్తున్నాయి. స్వేచ్ఛాపోటి, మనుగడ కోసం పోరాటం అన్న పదాలను అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవేత్తలు అత్యున్నత చారిత్రక విజయాలుగా కీర్తిస్తున్నారు. కాని అలాంటి జంతు లక్షణాలను గురించి డార్విన్‌ చెప్పిన వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. మానవాళిమీద, ముఖ్యంగా తన దేశ జనులమీద తాను రాసిన క్రూర పరిహాసం ఎటువంటి ప్రభావం చూపుతుందో బహుశా డార్విన్‌కి తెలిసి ఉండదు. చైతన్యయుతమైన, నిర్మాణాత్మకమైన సామాజిక ఉత్పత్తి మాత్రమే... ఎక్కడయితే ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికాబద్ధంగా సాగుతాయో - మానవాళిని జంతు ప్రపంచం నుండి వేరు పరుస్తుంది. ఇది కేవలం సామాజికపరమైన అంశమే కాదు.( దైహికపరమైన) అంశం కూడా. చారిత్రక పరిణామ క్రమం మాత్రమే అలాంటి సమాజాన్ని అనివార్యం చేస్తుంది. రోజు రోజుకీ ఆ సమాజ ఆవిర్భావాన్ని మరింత దగ్గర చేస్తుంది. అలాంటి సమాజం సాకారం అయిన రోజున చరిత్ర ఒక నూతన శకంలోకి ప్రవేశిస్తుంది. సకల మానవాళి, మానవాళి సకల కార్యకలాపాలూ, ముఖ్యంగా విజ్ఞానాభివృద్ధి ఫలాలు - మనుపెన్నడూ లేనంత స్థాయిలో అభివృద్ధి చెందుతాయి.( గతం మొత్తాన్ని విస్తుపోయేలా చేస్తుంది.)
సృష్టిలో ప్రతిదీ లయం కావల్సిందే. లక్షల ఏళ్ళు గడవనీ, వందల వేల తరాలు జన్మించి మరణించనీ, ప్రపంచమంతటికీ వేడిమిని పంచుతున్న సూర్యుడిలో ఉష్ణోగ్రతలు తగ్గి ధృవప్రాంతాల్లో మంచును కరిగించడంలో విఫలమవుతాయి. మానవజాతి భూమధ్యరేఖ సమీపంలోకి కిక్కిరిసి చేరిపోతారు. అప్పటికీ బతకడానికి తగినంత వేడిమి పొందలేకపోతారు. క్రమేపీ ఈ భూమ్మీద జీవజాలం తన ఉనికిని కోల్పోతుంది. జీవం అంతరించిపోతుంది. ఈ భూమి కూడా చలికి బిగుసుకుపోయిన మరో చంద్రగ్రహంలా మారుతుంది. చీకటి కుహరంలోకి జారిపోయి, సంకుచిత కక్ష్యలో తిరుగాడుతూ అప్పటికే అవశేషప్రాయంగా మారిన సూర్యగ్రహంలోకి కూలిపోతుంది. ఇంతకుముందు ఉన్న గ్రహాలకు పట్టిన దుస్థితి ఇదే. మిగిలిన గ్రహాలకూ పట్టబోయే దురవస్థా అదే. తన వేడిమితో సౌరవ్యవస్థ మనుగడకు ప్రాణవాయువుగా నిలిచిన సూర్యగ్రహం చప్పున చల్లారిపోతే జరగబోయే వినాశనం ఇది. అయినప్పటికీ ఈ గ్రహాలు విశ్వాంతరాళంలో మృతకక్ష్యలో తిరుగాడుతూనే ఉంటాయి. మన సౌరవ్యవస్థకు పట్టిన గతే ఈ విశ్వాంతరాళంలో ఉన్న మిగిలిన గ్రహ వ్యవస్థలకూ పడుతుంది. మన భూమిమీదకి ఇప్పటికీ తన కాంతిని ప్రసరింపచెయ్యలేనంత సుదూర తీరాల్లో ఉన్న గ్రహాల వెలుగు రేపు ఎప్పుడైనా ఈ భూమిని తాకినా దానిని ఆస్వాదించే మానవ నేత్రం మిగిలి ఉండదు.
సౌరవ్యవస్థ జీవచరిత్ర అంతటితో అంతరించిపోయి 'చావు'ను చవిచూస్తుందా? ఆ తర్వాత ఏమిటి? ఈ అనంత విశ్వంలో సూర్యగ్రహ కళేబరం అంతం లేకుండా పరిభ్రమిస్తుంటుందా? వైవిధ్యభరితమైన వివిధ ప్రాకృతిక శక్తులు ఒకే ఒక చలన రూపాన్ని 'ఆకర్షణ'ని సంతరించుకుంటాయా?
లేక సెక్‌చీ ప్రశ్నించినట్లు ''ప్రకృతిలోని ఈ శక్తులు మృతప్రాయమైన వ్యవస్థను తిరిగి మెరిసే పాలపుంతలాంటి తన యధాతథస్థితికి రూపాంతరం చెందుతాయా, నూతన జీవానికి తిరిగి ప్రాణం పోస్తాయా?'' ఏం జరగనున్నదో మనకి తెలియదు. 
అప్‌కోర్స్‌, మనకు తెలియదు అన్నామంటే మనకు రెండు రెళ్ళు నాలుగని, పదార్థ ఆకర్షణ శక్తి దూరానికి అనుగుణంగా పెరుగుతూ తరుగుతూ వస్తుందని తెలిసినంత పక్కాగా తెలియదని కాదు. ప్రకృతి శాస్త్రం సిద్ధాంతపరంగా సాధ్యమైన మేరకు ప్రకృతితో సామరస్య సహ జీవన ప్రాపంచిక దృక్పధాన్ని కలుగచేస్తుంది. ఆలోచనలేని శుద్ధ అనుభవవాదులు కూడా దీన్ని అంగీకరిస్తారు. మనం మన పరిజ్ఞాన లోపాన్ని అధిగమించాలంటే మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనేఆసక్తి, నిరంతర ధ్యాస మనలో ఉండాలి. పదార్థ చలనాన్ని నాశనం కావించలేమనే తత్వశాస్త్ర సూత్రాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్రం (సైన్స్‌) అందిపుచ్చుకోవాలి. ఈ సూత్రాన్ని వదిలిపెడితే విజ్ఞానశాస్త్రం అనేదే మన జాలదు. పదార్థ చలనాన్ని కేవలం యాంత్రిక చలనంగానో, ఒక చోటు నుండి మరొక చోటుకు మారడం అనే సామాన్య అర్థంలోనో చూడకూడదు. పదార్థ చలనం అంటే ఉష్ణ, కాంతి, విద్యుత్‌ అయస్కాంతాల తలతన్యత, అంతర్గత చలనం రసాయన సంయోగం, వియోగం, జీవం, అన్నింటికీ మించి అది ఒక చైతన్యం. అనంతకాలంలో పదార్థ ఉనికి ఒకే ఒక రూపంలో ఉంటుంది. పదార్థ అనంతత్వంతో పోలిస్తే ఈ అనంతకాలం అతి స్వల్పమైన కాలం. అయితే ఈ పదార్థం చలనం ద్వారా వైవిధ్యత సంతరించుకుంటుంది. చలనం పదార్థ లక్షణాన్నే మార్చివేస్తుంది. ఏతావాతా పదార్థమనేది జీవరహితమైనది. చలనం అనేది జవజీవమైనది అని మనం అర్థం చేసుకోవచ్చు. చలనాన్ని నాశనం చెయ్యలేమని పరిమాణాత్మకంగానే కాదు, గుణాత్మకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యాంత్రిక చలనం ఒక ప్రదేశంనుండి మరొక ప్రదేశానికి మారడమే అయినప్పటికీ నిర్దిష్ట అనుకూల పరిస్థితులలో అది ఉష్ణంగా, విద్యుత్‌గా, రసాయన చర్యగా, జీవంగా మారుతుంది. కాని చలనం తనంతతానుగా ఈ నిర్దిష్ట అనుకూల పరిస్థితులను సృష్టించలేదు. అలాంటిదానినే జడంగా మారిన చలనం అంటాం. రూపాంతరం చెందే శక్తిని కోల్పోయిన చలనానికి తిరిగి ఆ సామర్థ్యాన్ని అందించాలంటే 'శక్తి'ని సంతరిస్తే సరిపోదు. దానికి 'డైనమిక్స్‌' జత చెయ్యాలి. అలా చెయ్యాలంటే పాక్షికంగా దాన్ని ధ్వంసం చెయ్యాలి. అయితే ఈ రెండు ఊహింపనలవి కానివి.
అయితే ఒకటి మాత్రం తథ్యం. విశ్వాంతరాళంలో మనం ఉన్న ఈ భూగోళం ఏదో ఒక స్థాయి చలనంలో వేడెక్కింది. తద్వారా మనం చూస్తున్న 'సౌర వ్యవస్థ' ఆవిర్భవించింది. అది ఏ స్థాయి చలనమో ఇప్పటికీ అంతుబట్టలేదు. మనం చూస్తున్న పాలపుంతలో హీనపక్షంగా 20 లక్షల నక్షత్రాలు వున్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక నాటికి అంతరించిపోతాయి. 
మరి తరువాత ఏం జరుగుతుంది? ఫాదర్‌ సెక్‌చీ అంచనా వేసినట్లుగా మన సౌర వ్యవస్థ నుండే మరో నూతన సౌరవ్యవస్థ ఆవిర్భవించటానికి తగిన ముడి సరుకు దొరుకుతుందా? ఏమని సమాధానం చెప్పగలం. అయితే భావవాదులు భావించినట్లు ఆ సృష్టికర్తే పునఃసృష్టి చేస్తాడని ఓ దణ్ణం పెట్టి సరిపెట్టుకోవాలి. లేదంటే భౌతికవాద దృక్పధం ప్రకారం పదార్థ చలనం మూలంగా మరలా సౌరవ్యవస్థ, ఈ విశ్వం ఏర్పడతాయని నిర్ణయానికి రావడమా. మొదటి సూత్రం ప్రకారం చిటికెలోనో, ఏడు రోజుల్లోనో ఈ సృష్టి జరిగిపోవాలి. కాని రెండవ సూత్రం ప్రకారం అలాంటి సృష్టి జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. పరిస్థితులు కలిసివచ్చే అవకాశం ఉంటేనే అదైనా జరుగుతుంది.
శాస్త్రవేత్తలు అలాంటి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతరిక్షంలో భారీ శకలాలు ఒకదానిమీద మరొకటి కూలిపోతాయని, అలా భారీ శకలాలు ఒకదానినొకటి ఢకొీట్టే సమయంలో వెలువడే ఉష్ణోగ్రతల మూలంగా కొత్తగా నక్షత్రాలు ఆవిర్భవించవచ్చు. మరికొన్ని మరింత వెలుగు సంతరించుకోవచ్చు అని ఖగోళ శాస్త్రజ్ఞులు లెక్కలు కట్టి చెబుతున్నారు. మన గ్రహాలు ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లే, సూర్యగ్రహం కూడా మనకు కనబడే విశ్వంలో తిరుగుతున్నది. ఈ విశ్వం అంతా అంతరిక్షంలోని ఇతర విశ్వాలతో సమాంతర ఆకర్షణ శక్తితో తిరుగుతూ ఉంటుందని, ఇవన్నీ పరస్పర ఆకర్షణతో అంతరిక్షంలో గిరికీలు కొడుతున్నాయని తేల్చి చెబుతున్నారు. అంతరి క్షంలో అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు ఒకేస్థాయిలో లేవని ఇప్పటికే చాలామంది చెబుతున్నారు. చివరిగా మనం తేల్చుకోవాల్సింది ఏమిటంటే ఏదో స్వల్ప మినహాయింపులు మినహా ఈ విశ్వంలో ఉన్న అసంఖ్యాకమైన సూర్యుల వేడిమి అంతరిక్షంలోకి అదృశ్యమైపోయినా అంతరిక్ష ఉష్ణోగ్రతను ఒక సెంటీగ్రేడు డిగ్రీలో లక్షవవంతు కూడా పెంచలేదు.
మరయితే అంతటి వేడిమి ఏమైపో యినట్టు? విశ్వాంతరాళాన్ని వెచ్చచేసే ప్రయత్నం లో ఆవిరయి పోయిందా? ప్రాక్టికల్‌గానే అంతటి ఉష్ణం అదృశ్యమైపోయిందా? కేవలం సైద్ధాంతికంగా మాత్రమే ఉనికిలో ఉందా? చలనానికి నాశనం ఉండదనే సూత్రం ప్రకారం పై సందేహాలకు అసలు తావు ఉండకూడదు. భారీ శకలాలు ఒకదానితో ఒకటి ఢకొీని పతనమవుతూ యాంత్రిక చలనం ఉష్ణంగా మారి విశ్వంలోకి వికిరణం చెందుతుంది. పదార్థశక్తి అవిచ్ఛిన్నమైనది అయినట్లే చలనంకూడా అవిభాజ్యమైనది. కాబట్టి మనం ఏం భావించవచ్చు అంటే - విశ్వంలోకి వికిరణం చెందిన ఉష్ణోగ్రత మరో (పదార్థ) చలన రూపం తీసుకోవచ్చు. అలా చలన రూపంలో నిల్వ ఉన్న ఉష్ణం చల్లారిన సూర్య గ్రహాల్లో తిరిగి వేడిమిని పుట్టించవచ్చు. ఈ అంశాన్ని భవిష్యత్‌ పరిశోధనలు శాస్త్రీయంగా నిగ్గు తేల్చాల్సివుంది.
ఈ అనంత విశ్వంలో అనేకానేక ప్రపంచాలు ఉన్నాయనే అంచనా ప్రకారం ఈ ప్రపంచం నాశనమైనా తిరిగి పునరుద్భవిస్తూనే ఉంటుంది. ఇది అనంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది అంటాడు జె.డబ్ల్యు.డ్రేపర్‌. పదార్థ చలనం అనేది వర్తులం రూపంలో అనంతంగా కొనసాగుతుంటుంది. ఈ వర్తులం ఒక కక్ష్యలో పరిభ్రమణం కావించడానికి ఎన్ని కాంతి సంవత్సరాలు పడుతుంది అనేది ఇప్పటికయితే సరైన అంచనా లేదు. ఈ వర్తులకాలంలో ఒక దశలో అత్యున్నతస్థాయి అభివృద్ధి కారణంగా సేంద్రియ జీవం ఏర్పడి జీవం పట్ల, ప్రకృతి పట్ల చైతన్యాన్ని సంతరించుకుంది. సూర్యుడు, నక్షత్ర ధూళి (నెబ్యూలా), ఏకకణజీవి, బహుకణ జీవి. రసాయన సంయోగ వియోగాలు అన్నీ... ఏదీ అనంతమైనది కాదు, కానీ అనంతంగా మార్పులకు లోనవుతూనే ఉంటాయి. పదార్థం అనేది చలన సూత్రాల ప్రకారం చలిస్తుంది. మార్పుకు లోనవుతుంటుంది. ఒక సౌర వ్యవస్థలో అదీ ఒకే ఒక్క గ్రహం మీద సేంద్రియ జీవాభివృద్ధికి తగిన పరిస్థితులు ఉన్నాయి. అనేక జీవాలు పుట్టి గిట్టే క్రమంలో మానవుడి మెదడు అభివృద్ధి చెందింది. ఈ మొత్తం పరిణామ క్రమం అంతా చివరికి అంతమై తీరుతుంది. కాని పదార్థం మాత్రం మిగులుతుంది. పదార్థం అనేక రూపాల్లోకి మార్పులు చెందినా దాని లక్షణాలు మాత్రం కోల్పోదు. అందుకే ఈ భూమి అంతరించిపోయినా, ఆలోచనా జ్ఞానం కలిగిన మానవజాతి అంతరించిపోయినా తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఇదే పరిణామ క్రమం పునరావృతం కాక మానదు.

6, జులై 2015, సోమవారం

matam vs praja kalalu


altranative political culture

మాకినేని బసవపున్నయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడమని కోరారు. ఇంతకుముందు భాషా వికాసం గురించి మాట్లాడిన కొత్తపల్లి రవిబాబుగారు నాకో కరపత్రం ఇచ్చారు. మాతృభాష ప్రాధాన్యత గురించి ఛాయారాజ్‌గారు రాసిన మంచి కవిత్వం దానిలో ఉంది. అందులోని చివరి చరణాలు. 
''అమ్మా నీ భాష కావాలి. 
నిప్పులు చెరగటానికి.. altranetive polititical culture
చెమటను జల్లెడ పట్టి సంపదలను తీయడానికి.. 
తెలుగు పౌరుషాగ్నిని రాజేయడానికి.. మాతృభాష కావాలి..''
అలాంటి తెలుగు పౌరుషాగ్నిని రాజేయడంలో దిట్ట కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య. ఎక్కడకు వెళ్లి ఏ అంశం మీద మాట్లాడినా ప్రజలను ఉర్రూతలూగించి, నిప్పులు కురిపించి, వారిని కదన రంగానికి కదిలించడంలో వీర సారథిలా పనిచేసేవారు బసవపున్నయ్య. ఆరోజుల్లో ఆయన ఉపన్యాసాలంటే చెవులు కోసుకునేవారు. ఒకసారి ఆయన ప్రసంగం విన్న తరువాత 'పోరాటంలో దుమికి తాడో పేడో తేల్చుకుందాం. ఈ దోపిడీ సమాజాన్ని తుత్తునియలు చేసేదాకా వదలకూడదు' అన్నంత పట్టుదల ఆయన ఉపన్యాసాలద్వారా కలిగేది. అదే భాషా పటుత్వమంటే. ఏ సామాజిక, సాంస్కృతిక ఉద్యమానికైనా ఓ లక్ష్యం ఉంటుంది. అది వ్యక్తి వికాసానికీ, సామాజిక వికాసానికీ తోడ్పడాలి. ఇక్కడో చర్చ నడుస్తోంది. వ్యక్తి వికాసం అంటే ఏమిటీ, సామాజిక వికాసం అంటే ఏమిటీ అని? 'వ్యక్తులు మారితే సమాజం మారుతుంది. ముందు నువ్వు మారు' అని చాలామంది చెబుతుంటారు. ఇంకొంతమంది 'సమాజం మారేదాకా వ్యక్తి మార్పును చూడలేము' అంటారు. వాస్తవం ఈ రెండింటి మధ్యా ఉంది. రెండూ పరస్పర సంబంధమూ, అనుబంధమూ కలిగినవి. వ్యక్తి దేనికి మారాలి? సమాజాన్ని మార్చడానికి మారాలి. సమాజ చోదకుడుగా మారాలి. ఆ వ్యక్తి తనను తాను మార్చుకొని సమాజాన్ని మార్చడానికి ఉద్యుక్తుడయితే మొత్తం సమాజం మారుతుంది. సమాజం మారితే సమాజంలోని వ్యక్తులూ మారతారు. అలా చొరవ చేసేవారూ, నడుంకట్టేవారూ ముందు తమను తాము తీర్చిదిద్దుకోవాలి.
బసవపున్నయ్య, సుందరయ్య, రాజేశ్వరరావుగారలు ఎవరయినా ముందు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని ఆ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసి, ప్రజల్లో తిరుగుబాటు భావాలను రగిల్చి, అనేక ఉద్యమాలకు నాంది పలికారు. ఆ ప్రభావం సమాజంపై పడి అనేక మంది మారారు. ఈ రకమైన పరస్పర సంబంధం వ్యక్తి వికాసానికీ సామాజిక వికాసానికీ మధ్య ఉంది. నేడు సమాజంలో లంచగొండితనం ఉంది. ఈ వ్యవస్థలో ఒక భాగం అయ్యింది. సమాజం మారకుండా లంచగొండితనం పోదని కొందరి అభిప్రాయం. ఎవరు లంచమిచ్చినా, తీసుకున్నా చూస్తుండాలి. సమాజం మారిందాకా మనమేం చేయలేం అనుకుంటే మనకు తెలియకుండానే మనలో నిష్క్రియాపరత్వం ఏర్పడుతుంది. లంచగొండితనంతో సమాజం బాధపడుతున్నా మనకేం సంబంధం లేదు. లేదూ వ్యక్తి మారాలంటే లంచం ఇచ్చేవారినీ, తీసుకునేవారినీ నిర్మూలించాలని ఒక తహశీలుదారు ఆఫీసు గుమాస్తానో, గేటు దగ్గర ఉండే అటెండరో పదో పరకో తీసుకుంటేనో లేదా బస్సు కండెక్టరు చిల్లర ఇవ్వలేదనో అవినీతిపై పోరాడే పేరుతో వారిమీద తిరుగుబాటు చేస్తే అది గందరగోళమూ, అరాచకమూ అవుతుంది. అలా అని భూరికార్డులు తారుమారు చేసే అధికారులను చూస్తూ వదిలేయలేం. మరి ఈ రెంటికీ మధ్యన ఏమిటి? గుడినీ, గుడిలో లింగాన్నీ, దేశాన్నీ మింగేస్తున్న అవినీతిపరులపైనా, ప్రజల సంపదను మెక్కేస్తున్నవారిపైనా పోరాడాలి. అదే సందర్భంలో అవినితికి మూలమైన వ్యవస్థనూ మార్చడానికి కృషి చేయాలి. వ్యక్తికీ సమాజానికీ మధ్య సంబంధం లాంటిదే ఇది కూడా. అలా అయినప్పుడే మొత్తం సాంస్కృతిక, సామాజికోద్యమాలు, వ్యక్తి వికాసం ముందుకుపోతాయి. 
సంస్కృతి అనేది ప్రజల మధ్య భావ సమైక్యతను సృష్టిస్తుంది. అది భావాల్లోనూ, భాషలోను, ఆచార, సంప్రదాయాల్లోనూ కనిపిస్తుంది. పండుగలు, ఉత్సవాలు, పెండ్లిండ్లు, శవసంస్కారాలు-ఇలా సందర్భం ఏదైనా ప్రజలు ఒక వర్గంగానో, తరగతిగానో, జాతిగానో, తెగగానో భాగస్వాములవుతారు. ఇది ఒక ఉమ్మడి తత్వాన్ని తీసుకొస్తుంది. వివిధ చారిత్రక దశల్లో ఈ సంస్కృతి విభిన్నంగా పనిచేస్తుంది. అది నిరంతరం చలనంలో ఉంటుంది. మారుతుంటుంది. సంపర్కం చెందుతుంది. ప్రగతిశీలంగా ఉంటుంది. ప్రగతి నిరోధకంగానూ ఉంటుంది. నేడు మంచిగా ఉన్నదే రేపు చెడుగా మారుతుంది. చారిత్రక, తార్కిక దృష్టితో ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. మన సౌలభ్యం కోసం నేను వీటిని మూడు భాగాలుగా చెప్పదలుచు కున్నాను. ఒకటి : స్వాతంత్య్రోద్యమ ప్రభావం. రెండోది : కమ్యూనిస్టుల ప్రభావం. మూడోది : ఈనాటి ప్రపంచీకరణ ప్రభావం. ప్రజలమీదా, సమాజం మీద ప్రగాఢముద్ర వేసిన ప్రభావాలివి.
స్వాతంత్య్రోద్యమ కాలంలో చాలా ఉద్యమాలు నడిచాయి. బ్రిటీష్‌వారు దేశం నుంచి వెళ్లిపోవాలి, స్వతంత్రం కావాలీ అన్నది ప్రధానమైన అంశమే అయినా ప్రజలను కదిలించడానికీ, ప్రభావితం చేయడానికీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల నాయక్వంలో కావచ్చు, గాంధీ ప్రభావంతో కావచ్చు చాలా ఉద్యమాలు కొనసాగాయి. ప్రత్యేకించి అంటరానితనానికి వ్యతిరేకంగానూ నడిచాయి. దళితులనూ, మైనారిటీలను, ఇతర వెనుకబడిన తరగతులనూ భాగస్వాములను చేయడానికి ఉద్యమాలు నడిచాయి. మహిళల అక్షరాస్యత కోసమూ, మద్యపానానికి వ్యతిరేకంగానూ ఉద్యమాలు నడిచాయి. శ్రమదాన, సేవా కార్యక్రమాల కోసం ఉద్యమాలు నడిచాయి. కలరా వంటి అంటు వ్యాధులు వచ్చినప్పుడు వాటిని నిర్మూలించడానికి కార్యకర్తలే నేరుగా రంగంలో దిగేవారు. అందరూ భయపడి పారిపోయి ఊళ్ల నుంచే వారిని వెలివేసే పరిస్థితుల్లో వారి దగ్గరకు పోయి సేవ చేశారు. ఆఖరికి కుష్టు వ్యాధిగ్రస్తులను సైతం చేరదీసి మనుషుందరూ ఒకటే అనే నిరూపించడానికి ప్రయత్నించారు. ఇలాంటి అనేక ఉద్యమాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రభావితం చేశాయి. వాటిని చూసి ప్రభావితమైన అనేకమంది స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు.. 
స్వాతంత్య్రోద్యమంలో ఖద్దరు ధరించడమే పెద్ద ఉద్యమంగా సాగింది . ఇది బ్రిటీషువారికి ప్రతిఘటన. ఖద్దరు వేసుకొని కాలేజీకి వెళ్లారంటే ప్రత్యక్షంగా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లే. ప్రిన్సిపాల్‌ వెంటనే ఆ విద్యార్థిని పిలిపించి కళాశాల నుంచి సస్పెండ్‌ చేసేవారు. అప్పుడు ఖద్దరు చొక్కా ధరించడమే తిరుగుబాటుకూ, ప్రతిఘటనకూ చిహ్నంగా మారింది. ఇది సామాజిక సాంస్కృతికోద్యమ ప్రభావమే. గాంధీ ఉప్పు మీద పన్ను వేసినం దుకు సత్యాగ్రహం నడిపారు. ఉప్పు మీద పన్ను ఇప్పుడూ మనం కడుతూనే ఉన్నాం. పన్నుల మీద పన్నులు పెంచేస్తున్నారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సర్వీసు టాక్స్‌ 14 శాతం పెంచారు. చివరికి శిరోముండనం చేయించుకోవాలన్నా టాక్స్‌ కట్టాల్సిందే. తిరుపతి వెళ్లి క్యూలో నుంచున్నా సర్వీసు టాక్స్‌ కట్టాల్సిందే. కాని ఆ రోజుల్లో ఉప్పు మీద పన్ను వేస్తే ప్రజలను కదిలించగలిగారు. దండి సత్యాగ్రహంలో మనుషుల తలలు పగులగొడుతున్నా ఖద్దరు ధరించి, సంచి తగిలించుకొని ముందుకు పోయారు. ఇదొక ఉద్యమ సంస్కృతి. ప్రతి ఒక్కరినీ కదిలించి తిరుగుబాటుకు పురికొల్పిన సంస్కృతి ఆరోజు సాతంత్య్రోద్యమంలో అంతర్భాగంగా నడిచింది. 
అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా గాంధీ, అంబేద్కర్‌ ఉద్యమాలు నడిపారు. కమ్యూనిస్టులు దానిలో అగ్రభాగాన ఉన్నారు. కమ్యూనిస్టులంటే మాలమాదిగల పార్టీ అనేవారు. సున్నితంగా చెప్పేవారయితే లేబరోళ్లనీ, లేబర్‌పార్టీ అనీ అనేవారు. అగ్రకులాల నుంచీ, ధనిక రైతు కుటుంబాలను నుంచీ వచ్చినవారు కూడా బసవపున్నయ్య, సుందరయ్య వంటి నాయకులతో కలిసి దళితవాడల్లో పడుకొని వారు పెట్టింది తిని, వారిని కదిలించడానికి చేసిన కృషి అసమాన్యం. ఈ మధ్య స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చూస్తున్నాం. ఈ రోజు బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్‌ తాము సాధించిన ఘనవిజయాల్లో గొప్పదని అరుణ్‌జైట్లీ చెప్పాడు. ఏమిటీ స్వచ్ఛ భారత్‌ అంటే? వీధుల్లోకి వెళ్లి చీపురు పట్టుకొని ఒక ఫొటో దిగడంతో స్వచ్ఛ భారత్‌ అయిపోతుంది. ఆ రోజుల్లో చూసుకోవడానికి ఏ ఫొటోలూ లేవు. అంటరానితనమే అతి పెద్ద సాంఘిక దురాచారం. అంటరానితనాన్ని నిర్మూలించ కుండా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడకుండా స్వచ్ఛ భారత్‌కు అర్థమేమిటి? నీ తోటివాడినే అంటరానివాడిగా చూస్తుంటే, వీధుల్లో నడవనివ్వకుండా, నీళ్లు తాగనివ్వ కుండా చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా నేను వీధులను శుభ్రం చేస్తాను, మరుగుదొడ్లు కడతాను అంటున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు అశుద్ధం ఎత్తివేయడానికి కూడా సిద్ధపడ్డారు. సాంస్కృతిక సామాజికోద్యమాలకు స్వాతంత్య్రోద్యమం ఒక నమూనాగా నిలబడింది. అయితే స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్‌ అనుసరించిన రాజీ పద్ధతులు యువతరాన్ని స్ఫూర్తివంతంగా, ఉత్సాహంగా కదిలించలేకపోయాయి. భగత్‌సింగ్‌ వంటివారిని ఉరితీస్తున్నా మాట్లాడలేకపోవడం వంటి అనేక అంశాలు యువతరాన్ని ప్రభావితం చేశాయి. ఇది మార్గం కాదు, కమ్యూనిస్టు పార్టీ అయితేనే సమాజం మారుతుంది. కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అనేకమంది కాంగ్రెస్‌ను వదిలేసి కమ్యూనిస్టుపార్టీలో చేరిపోయారు. 
1940, 50, 60ల్లో మూడు దశాబ్దాలపాటు తెలుగు రాష్ట్రాలను అత్యంత ప్రభావితం చేసింది కమ్యూనిస్టు ఉద్యమం. వారు చెప్పిన భాషా వికాసం, జాతి వికాసం, సామాజిక న్యాయం, సామాజిక వికాసం. ఒక అంశం కాదు. అన్ని అంశాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ ప్రభావం చూపింది. 1950 నాటి సినిమాలు చూడండి. అది ప్రేమ, క్రైం, పౌరాణిక సినిమా ఏదైనా కావచ్చు. అందులో ఒక అభ్యుదయ గీతం లేకుండా, అందులో కుల మతతత్వాలను చీల్చి చెండాడకుండా, అందులో అవినీతినీ, అన్యాయాలనూ, అక్రమాలనూ ప్రశ్నించకుండా ఏ సినిమా ఉండదు. అటువంటి ప్రభావం రచయితలమీదా, నిర్మాతల మీద ఉంది. ఈ మాటలు ఇలా చెబితేనే ప్రజలు స్వీకరిస్తారనే అంతటి తీవ్రమైన ప్రభావం ఉండేది. ప్రజానాట్యమండలి, అభ్యదయ రచయి తల సంఘం, ఆరోజు ప్రతిఒక్కరూ, కమ్యూనిస్టులనే కాదు భావావేశం ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యుదయ ఉద్యమాల వైపు చూశారు. ఆ రోజు అతి పెద్ద ఉద్యమం, కమ్యూనిస్టులు శాసించిన ఉద్యమం సామాజికోద్యమం. తెలుగువాళ్లంతా ఒకటిగా ఉండాలని, జాతినీ భాషనూ ఏకం చేసి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పోరాడాలనే నినాదానికి అక్షర రూపం ఇచ్చి, మద్రాసు రాష్ట్రంలో ఉన్నా, నైజాంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువాళ్లు ఒకటి కావాలని ఉద్యమానికి శ్రీకారం చుట్టి దాన్ని సాధించిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. మిగతా అన్ని పార్టీలూ ఉండొచ్చు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. కొంతమంది కాంగ్రెస్‌వారు కూడా పాల్గొన్నారు. కానీ దానికి ఊపిరిపోసి నడిపించింది మాత్రం కమ్యూనిస్టు పార్టీయే. అంతకుముందు ఎప్పట్నించో తెలుగువారు చీలిపోయారనే భావన ఉంది. అప్పటికే తెలుగు భాషా వికాసానికి తోడ్పడినవారున్నారు. ఛాంతసత్వంపై ఎదురుదాడి చేసినవారున్నారు. కాని వారి కృషంతా వ్యక్తులకు సంబంధించినదిగానే మిగిలిపోయింది. దానికి ఉద్యమ రూపం ఇచ్చినవారు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమం మొత్తం దేశ భౌతిక స్వరూపాన్నే మార్చేసింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎవరి భాషలో వారు చదువుకోవచ్చు. ఎవరి భాషలో వారు మాట్లాడుకోవచ్చు. ఎవరి భాషలో వారు చట్టాలు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రం ఏర్పడక ముందు ఢిల్లీ వెళితే అక్కడ తెలుగువారిని మదరాసీలనేవారు. తెలుగువారికి ఒక అస్థిత్వం కల్పించింది కమ్యూనిస్టు పార్టీ. ఇది అతి పెద్ద సామాజిక ఉద్యమం. 
సామాజికోద్యమాల్లో ముందుకొచ్చిన రెండో అతి పెద్ద ఉద్యమం దళితవాదం. 1980లో ఇది ఒక వాదం కింద పుట్టుకొచ్చింది. దళితులు మొత్తం ఒక ప్రజాస్వామ్య స్రవంతిలో 1940, 50ల్లో ఒక భాగంగా ఉన్నారు. దళితులంటే కమ్యూనిస్టులూ, కమ్యూనిస్టులంటే దళితులూ అన్న పద్ధతిలో ఆనాడు కలిసిపోయారు. వారికోసం కమ్యూనిస్టులు తప్ప మరెవరూ కృషి చేయలేదు. ఇది కమ్యూనిస్టు కార్యకర్తలకు ఒక గుర్తింపునిచ్చింది. అమెరికాలో, బ్రిటన్‌లో, రష్యాలో ఏం జరుగుతోందీ అన్నది, ప్రపంచంలోని విషయాలన్నీ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు మాట్లాడేవారు అని ఊళ్లలోకి పోతే పెద్దవాళ్లు చెప్పేవారు. అసలు వీళ్లకీ జ్ఞానం ఎక్కణ్ణుంచి వచ్చింది అనే ప్రశ్న వచ్చింది. కమ్యూనిస్టులు కాబట్టే వచ్చింది. కమ్యూనిస్టులం అయితే మనం వికాసవంతులమవుతాం. ప్రశ్నించగలుగుతాం అనే భావాలు విస్తరించాయి. మామూలు వ్యవసాయ కూలి అమెరికా గురించో, రష్యా గురించో, రెండో ప్రపంచ యుద్ధం గురించో, సామ్రాజ్యవాదం గురించో మాట్లాడుతుంటే, వీళ్లకు ఇన్ని విషయాలెలా తెలుసు అని ఆ ఊళ్లో తలనెరిసిన మోతుబరి రైతులు నోళ్లు వెళ్లబెట్టుకొని వింటుండేవారు. అంటే విజ్ఞానంలో ఒక మామూలు మనిషిని, ఒక మట్టి మనిషి, రాతి మనిషినుకున్నవాణ్ణి కమ్యూనిస్టు పార్టీ ఒక చైతన్యవంతమైన ఆయుధం కింద మలిచింది. ఇదేం చిన్న విషయం కాదు. ఈ మధ్య విజ్ఞాన్‌ రత్తయ్యగారు రాసిన ఓ పుస్తకం చదివాను. మిగతా విషయలెలా ఉన్నా ఒక విషయం మాత్రం ఆయన స్పష్టంగా రాశారు. తెలుగునాట విద్యాభివృద్ధికి మొట్టమొదట పునాది వేసింది కమ్యూనిస్టులు అని. అది వాస్తవం. ఊళ్లో చదువు అనేది ఒక హక్కుగా ఉండేది. ఎందుకురా మట్టి పిసుక్కునేవాడికి చదువు? చదువుకొని ఊళ్లేలతారా? ఎందుకు బడికి పంపడం? అనుకునే రోజుల్లో చొరవ చేసి, పిల్లలను చదివించడానికి రాత్రిబడులు పెట్టి, లాంతర్ల కింద చదువు చెప్పిన ఘనత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలది. మహిళలకు చదువేంటనుకునేకునే రోజుల్లో చదువుకు ప్రోత్సహించి, వారిని విద్యాలయాలకు పంపిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. కమ్యూనిస్టుపార్టి మహిళలను వీధుల్లోకి తీసుకొచ్చి పోరాటాల్లో భాగస్వాములను చేసింది. మోటూరు ఉదయం గారి నాయకత్వంలో ఒక బుర్రకథ దళం ఏర్పడింది. బహిరంగ ప్రదర్శనలివ్వడంపై భూస్వాములు అసహ్యంగా మాట్లాడేవారు. దాన్నెదుర్కొనే ధైర్యాన్నీ, తెగువనూ మహిళల్లో కల్పించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకని భాషా వికాసంలో, జాతీయ వికాసంలో, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన ఉంది. రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రజల చరిత్రను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికారంలోకి రాకపోవచ్చు. మామూలుగా అయితే భావాల గురించి చెప్పుకున్నప్పుడు ఎవరయితే అధికారంలో ఉంటారో వారి భావాలే ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయని చెప్పుకుంటాం. స్థూలంగా అది సరైనది. కానీ అధికారంలో లేకుండానే కమ్యూనిస్టు పార్టీ తన భావాలతో ప్రజలందరినీ ప్రభావితం చేసింది. కాంగ్రెస్‌ వాళ్లు భూస్వామ్య వ్యవస్థను బలపరిస్తే, ఆ వ్యవస్థకు, దాని కుళ్లు సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే.
ఈ రోజు రాజకీయ సంస్కృతి గురించి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ వారు ఎలా ఉంటారు. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు. ఖరీదైన ఖద్దరు ధరించాలి. లెదర్‌ చెప్పులేసుకోవాలి. ఆధునికమైన కారు, హంగూఆర్భాటం, మందీ మార్బలం, గన్‌మెన్‌లు...అదో ప్రత్యేకమైన స్టయిల్‌ లేదా బ్రాండ్‌. ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటాడనే భావన ఉంది. అలా ఉంటేనే రాజకీయ నాయకుడి కింద లెక్క. కానీ మామూలుగా నిరాడంబరంగా ఉండి, చేతిలో సంచి పట్టుకుని, అందులో ఓ పేపరు పెట్టుకొని, ఎక్కడబడితే అక్కడ పేపరు పరుచుకొని పడుకోవడం వంటి ఒక నూతన రాజకీయ సంస్కృతిని 1950లో కమ్యూనిస్టుపార్టీ ప్రవేశపెట్టింది. దాని ప్రభావం కూడా ఇతర పార్టీల మీద ఉంది. కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్నచోట్ల ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. కేరళలో కాంగ్రెస్‌ వాళ్లు కూడా కమ్యూనిస్టులు మాట్లాడే భాష మాట్లాడేవాళ్లు. కమ్యూనిస్టుల్లాగానే మేమూ ఉన్నాం అని చెప్పుకోవడానికీ, పోటీ పడటానికీ ప్రయత్నిస్తుండేవాళ్లు. ఇతర పార్టీలను కూడా ప్రభావితం చేయగలిగింది కమ్యూనిస్టు జీవన విధానం. అది నీతి, నిజాయితీ, నిరాడంబరత్వంతో కూడిన జీవన విధానం. 
అలాగే సంస్కరణోద్యమాలు కూడా. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ఆ రోజు బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం వంటి ఉద్యమాలు నడిపారు. వాటి ప్రభావం ప్రజల్లో ఒక భాగానికే పరిమితమయింది. దాన్ని సాధారణ ప్రజల్లోకి తెచ్చింది కమ్యూనిస్టుపార్టీ. వివాహ పద్ధతిలోనే ఒక ప్రత్యామ్నాయాన్ని చూపింది. అదర్శ వివాహం అంటే అది కమ్యూనిస్టు పార్టీ పెళ్లి అనీ, మీటింగుల పెళ్లనీ, దండలు మార్చుకుంటే పెళ్లయిపోయినట్లేననీ అనేవారు. ఇప్పుడంటే రిజిస్ట్రేషన్లు కావాలి. అప్పుడు రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. దండలు మార్చుకుంటే పెళ్లియిపోయినట్లే అనే సాదాసీదా పద్ధతిలో ఖర్చు లేకుండా వివాహం జరిపించేవారు. ఆడపిల్లల పెళ్లంటే సగం ఆస్తి అమ్ముకోవాలనేటువంటి రోజుల్లో పెళ్ళంటే చాలా సులభంగా చేసే ప్రక్రియగా మార్చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. కొన్ని స్వఛ్చంద సంస్థలు, అభ్యుదయవాదులు కూడా హంగూఆర్భాటం లేని వివాహ వేడుకల్ని ప్రోత్సహించారు. కమ్యూనిస్టుపార్టి ఆ రోజు నుంచి ఈ రోజుదాకా ఒక ప్రత్యామ్నాయ వివాహ పద్ధతిని ప్రోత్సహిస్తున్నది. తన సొంత కుటుంబంలో కమ్యూనిస్టులు విభిన్నంగా వ్యవహరిస్తారు. ఒకళ్లకొకళ్లు తోడ్పడటం అందరూ చేయకపోవచ్చు. కానీ ఆ సంస్కృతిని మాత్రం ప్రవేశపెట్టింది కమ్యూనిస్టు పార్టీయే. వంటలో సహాయపడటం, పిల్లల పెంపకంలో సహాయం చేయడం వంటివి. వారిని ఎడ్యుకేట్‌ చేయడానికీ, వారు కూడా జెండా పట్టుకొని ఉద్యమాల్లోకి రావడానికీ, కుటుంబం కుటుంబాన్నే పిల్లలతోసహా వీధుల్లోకి తీసుకురావడానికీ తోడ్పడింది. బహుశా ఆనాడున్న ఫ్యూడల్‌ విశ్వాసాలు కూడా దీనికి దోహదపడి ఉండొచ్చు. అన్నిటికన్నా మించి స్వాతంత్య్రోద్యమం తరువాత అధికారంలోకి వచ్చి పదవీలాలస పెరిగిన రోజుల్లో సమాజం కోసం త్యాగం చేయాలి. ఈ ఆస్తులూ ఆదాయాలూ, సంపదా ఇవి కాదు. ఉద్యమమే ప్రధానం అని ఎవరికి వారు తెగించి ఇంట్లో ఉన్న తల్లులు, అక్కలు, అమ్మలు వాళ్లందరూ ఉమ్మడిగా అనుకొని సుందరయ్యను చూసో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ను చూసో స్ఫూర్తి తెచ్చుకొని ఉద్యమాల కోసం త్యాగం చేయడం ఒక సంస్కృతిగా మారింది. ఆ రకమైన ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని సృష్టించడంలో 1950లలోనే కమ్యూనిస్టు పార్టీ చరిత్ర సృష్టించింది. 
దాని తరువాత మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా. ప్రజలకు హానిచేసే కొన్ని సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమూ, కేవలం శాస్త్రీయంగా ప్రచారం చేయడమే కాదు. శాస్త్రబద్ధంగా ఆలోచించడమూ, జీవించడమూ అనే విధానానికి నాంది పలికింది కమ్యూనిస్టుపార్టీ. మూఢనమ్మకాలకు వ్యతిరేకమంటే ప్రజలకు హానిచేసేవాటికి వ్యతిరేకం. ముఖ్యంగా మూఢనమ్మకాలకు బలయ్యింది సామాన్య పేద ప్రజలు, దళితులు, గిరిజనులు, మహిళలే. వీరే ఎక్కువ భాగం నష్టపోయారు. వాటిని ప్రశ్నించి నిరోధించేందుకు కమ్యూనిస్టు పార్టీ కృషి చేసింది. మానవ పరిణామం నుంచి అనేక శాస్త్రీయ గ్రంథాల వరకూ ప్రచురించి ప్రచారంలో పెట్టేందుకు కృషి చేసింది. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా యువతరాన్ని ఆకర్షించింది. ఒక శక్తిగా ముందుకొచ్చింది.
సమాజంలో ఫ్యూడలిజం బలంగా ఉన్న రోజుల్లో కూడా (కమ్యూనిటీ) ఉమ్మడితత్వం ఉండేది. 1950-60 కాలాల్లో పెళ్లి జరుగుతోందనుకోండి. పెళ్లి పందిళ్లు వేయడం, వంటలు చేయడం, ఇల్లిల్లూ తిరిగి పాలూ పెరుగూ తేవడం, ఒక విధంగా ఒకరింట్లో పెళ్లి అంటే ఊరు మొత్తం పెళ్లిలాగుండేది. ఎవరింట పెళ్లి జరిగినా ఇతర కులాల వాళ్లూ వెళ్లేవాళ్లు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లో సహపంక్తి భోజనాలు సాగేవి. భూస్వాములు బలంగా ఉన్న చోట దళితులకు విడిగా పెట్టేవారు. భోజనాల వడ్డింపులో అవమానాలు ఎదురయ్యేవి. అందుకే కమ్యూనిస్టులు విభ్నింగా కనిపించేవారు.
1960-70ల తరువాత కమ్యూనిస్టు ఉద్యమం బలహీన పడ్డాక సాంస్కృతిక, సామాజికోద్యమాల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. అక్కణ్నుంచి సాహిత్యంలో మూఢ నమ్మకాలకు పెద్దపీట వేయడం ప్రారంభమైంది. అభ్యుదయకరపాత్ర పోషించిన సినిమాలు, మీడియా స్వభావమే మారిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన నేపథ్యంలో 1980 నాటికి కొన్ని కొత్త రకాల ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో దళితవాదం ఒకటి. ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో అది పుట్టుకొచ్చింది. భూస్వాముల ఆధిపత్యాన్ని సవాల్‌ చేసి దళితల ఆత్మగౌరవాన్ని నిలబెడతామనే ఉద్దేశంతో పుట్టుకొచ్చిన ఉద్యమం అది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ గుర్తించిందీ, గౌరవించింది. దానికి సంఘీభావమూ తెలిపింది. కానీ దళితవాదం మొత్తం ప్రజాస్వామిక ఉద్యమ స్రవంతి నుంచి వేరుపడి మేం వేరు, మిగతావాళ్లు వేరు, మిగతా సెక్షన్లతోనూ, మిగతా ప్రజలతో కలవం అనే అస్థిత్వవాదం వారిలో పుట్టుకొచ్చింది. అలాగే మహిళల్లో ఫెమినిజం పేరుతో ఒక అస్తిత్వ వాదం ముందుకొచ్చింది. ప్రాంతీయత కూడా ఒక అస్తిత్వవాదం. మా ప్రాంతం వేరు, మేం వేరు అనే వాదం దానిది. మా గురించి మాకు అర్థం అవుతుంది తప్ప ఇతరులు అర్ధం చేసుకోలేరు అనేది వివిధరకాల అస్థిత్వవాదాల సారాంశం. 
దళితవాదం భూస్వామ్య సంస్కృతితో పోరాడటానికి బదులుగా సమస్య నుండి తప్పించుకునే (ఎస్కేప్‌) దారులు వెతికింది. గుడిలోకి అందరినీ అనుమతించాలనేదాని కన్నా, నీళ్ల బావిలో తోడుకోడానికి అవకాశం ఇవ్వాలనే దాని కన్నా, ప్రభుత్వాల మద్దతుతో ప్రత్యేకంగా గుడులు కట్టించుకోవడం, బోర్లు వేయించుకోవడం, విడిగా స్కూళ్లు పెట్టించుకోవడం ద్వారా వివక్షను అధిగమించాలన్న ఆలోచనకు వచ్చారు. వ్యవసాయ దోపిడీ నుండి బయటపడటానికి సుదూర ప్రాంతాలకు వలసలు పోవడం ఆరంభమైంది. ఇలా భూస్వామ్య వ్యవస్థతో పోరాడటానికి బదులుగా దూరంగా పారిపోయే విధానాన్ని అనుసరించింది. అయినా మారిన సామాజిక పరిస్థితులలో దళితుల్లో వస్తున్న ప్రజాస్వామిక భావాలను సహించలేని భూస్వామ్యవర్గాలు దాడులకు తెగబడ్డాయి. కారంచేడు ఘటనతో దళిత ఉద్యమానికి కొత్త అస్థిత్వం వచ్చింది. అయితే ఈ అస్థిత్వవాదాల కారణంగా వర్గ ఐక్యత చెదిరిపోయింది. కమ్యూనిస్టుపార్టీ ప్రవేశపెట్టిన ఉమ్మడి సంస్కృతి దెబ్బతిన్నది. కులాలవారీ సాంస్కృతిక ఐక్యత ఏర్పడింది. అది ఉప కులాలకూ పాకింది. తద్వారా వర్గఐక్యతకు తూట్లు పడ్డాయి. 
అస్థిత్వవాదం ప్రారంభకాలంలో ముందుకొచ్చిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తించి, దాన్ని అందిపుచ్చుకొని లీడ్‌ చేయడంలో కమ్యూనిస్టు పార్టీ వెనుకబడిపోయింది. 1980ల్లో దళిత ఉద్యమం ఒక అభ్యుదయకరమైన పాత్ర పోషించింది. 1990-2000 మధ్య ప్రపంచీకరణ కారణంగా దాని రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచీకరణతో దళిత ఉద్యమాలు సమ్మిశ్రితం అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సహకారంతోనే సామాజికోద్యమాలు నడపాలి. ఏ ప్రభుత్వం అయితే సామాజిక వెనుకబాటుకు కారణమయ్యిందో, ఏ పాలకవర్గాలయితే భూస్వాములకు వత్తాసుగా నిలబడ్డారో వారి సహకారంతోనే సామాజికోద్యమాలు నడిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారు తమ అస్థిత్వాన్ని వెదుక్కునే పనిలో పడ్డారు. ఇలాంటి స్థితిలో తిరిగి మరలా 2000 సంవత్సరం నుంచి సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టు పార్టీయే. ఎక్కడ అన్యాయం, అక్రమాలు జరుగుతున్నా, వివక్ష పాటిస్తున్నా, అక్కడ వాలి తెగబడి పోరాడుతున్నది కమ్యూనిస్టు కార్యకర్తలే. 1980ల్లో వెనకబడినా, ఈ సంధి యుగంలో దాన్ని అందిపుచ్చుకొని నూతన అవగాహనతో కమ్యూనిస్టు పార్టీ ముందుకు తీసుకుపోతోంది. 
1980ల్లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్‌టి రామారావు ముందుకొచ్చారు. దానికి మూలం కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే. వారి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అవమానించడం, తెలుగువారిని గుర్తించకపోవడం వల్ల అప్పుడా అస్థిత్వం ముందుకొచ్చింది. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి: కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే రాజకీయ చైతన్యం ఉంది. రెండోది తెలుగువారి ఆత్మగౌరవాన్ని గుర్తించాలనే సాంస్కృతిక, సామాజిక వాంఛా ఇమిడి ఉంది. నాటి ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తిలో వెంటనే కలవకపోయినా ఆ తరువాత భాగసామ్యం వహించింది కమ్యూనిస్టు పార్టీ. తెలుగువారిని కేంద్ర గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా కదిలించడంలో కమ్యూనిస్టుపార్టీ ముందుకొచ్చింది. అయితే తెలుగువారిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టడంలో టిడిపి అవకాశవాద పాత్ర పోషించింది. తెలుగుదేశం ప్రారంభ దశలో ఎన్టీఆర్‌ మొదట అభివృద్ధికరమైన పాత్ర నిర్వహించినా ఆ తరువాత అది అభివృద్ధి నిరోధక పాత్రకు మారిపోయింది. ఎన్టీఆర్‌ చనిపోయాక అదే చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచబ్యాంక్‌కు తాకట్టుపెట్టాడు. 
మూడోది ప్రపంచీకరణ. సామాజిక, సాంస్కృతికోద్యమాలను పూర్తిగా తిరోగమింప చేయడం, ప్రతిదాన్నీ వాణిజ్యీకరించటం దీని లక్షణం. సాహిత్యం, కళలు, మీడియా, సినిమా, పెళ్లి, చావు, ఆఖరికి అవి నైతిక విలువలైనా, ప్రతిదాన్నీ వ్యాపారసరుకుగా మార్చింది. 'కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవిత కనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లుగా అమ్మడానికీ కొనడానికీ ఈ ప్రపంచీకరణలో అనర్హమైనదేమీలేదు. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు చాలా మార్పులకు గురవుతున్నాయి. భాషా వికాసం చెందాలంటే ఆ జాతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమనం సాధిస్తుందో ఆ భాష అంత పురోభివృద్ధి సాధిస్తుంది. ఉదాహరణకు భాషా వికాసానికి 1980ల్లో ఈనాడు దినపత్రిక ముఖ్య పాత్ర నిర్వహించింది. జనం వాడుక భాషలో అది వార్తలనందించింది. ప్రత్యేకంగా స్థానిక వార్తలను ప్రవేశపెట్టింది. అంతకుముందు (1950-60ల్లో) అంతర్జాతీయ,జాతీయ వార్తల విషయంలో కమ్యూనిస్టులు మీడియాను ఎంతగానో ప్రభావితం చేశారు. అమెరికాలో ఏం జరుగుతోందో, రష్యాలో ఏంజరుగుతోందో మామూలు వ్యక్తి చెప్పగలిగాడంటే అది కమ్యూనిస్టు జర్నలిజం వల్లనే. వారి పత్రికల వల్లనే. కానీ ఈనాడు దినపత్రిక వార్తల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి వీధుల్లోకి తెచ్చింది. అది మంచి పనే. మన సమస్యలు, మన వీధి, మన ఇరుగు పొరుగు ఇలా. దాన్నే కమ్యూనిస్టు జర్నలిస్టులు కూడా అనుసరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితేమిటి? ప్రతిదీ ప్రపంచీకరణ గురించే. ప్రపంచంలో జరిగే ప్రతి మార్పూ మనల్ని ప్రభావితం చేస్తోంది. ప్రపంచం గురించీ, దేశం గురించీ చెప్పకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ ఊరి గురించి నువ్వాలోచించుకో, దేశం గురించి నువ్వాలోచించొద్దు అంటే కళ్లున్న కబోదులమైపోవడమే. ఆరోజు ప్రగతిశీల పాత్ర నిర్వహించిన 'ఈనాడు' ఈ ప్రపంచీకరణ యుగంలో స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వస్తున్న మార్పుల నుండి ప్రజలను దూరంగా ఉంచుతోంది. తద్వారా సామాజిక పురోగమనానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తోంది. సాధారణ భాషతో పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా భాషను ప్రజల దగ్గరకు తెచ్చిన ఈనాడు పాత్ర ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ఈమధ్య కంప్యూటరును అంతర్జాలం అని రాస్తున్నారు. అంతర్జాలం అంటే అర్థమేమిటో తెలుసుకోవడానికి నిఘంటువును వెదకాలి. అంతర్జాలం అనే పదం సంస్కృతమా, పార్శీకమా, తమిళమా, మళయాలమా అని తెలుగువారు తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. అంతర్జాలం అనడం కన్నా కంప్యూటరు అంటే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దీన్ని చాదస్తమందామా లేక వ్యవహారిక భాష అనాలా? గిడుగు రామ్మూర్తి పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో పోరాడారు. వ్యవహారిక భాషా వ్యాప్తి కోసం వారు రాసిన పుస్తకాలు ఇప్పుడు చదివితే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కందుకూరి రాజశేఖర చరిత్ర నవల, గురజాడ కన్యాశుల్కం నాటకం చదివితే అప్పటికీ ఇప్పటికీ భాష చాలా మారిపోయిందని అర్థంమవుతుంది. 
కంప్యూటరును మనమే కనుక్కున్నామనుకోండి. దానికి అంతర్జాలం అని పేరు పెట్టామనుకోండి. దాన్ని ప్రపంచమంతా అంతర్జాలం అనే అంటుంది. మన భాష ప్రపంచ భాషగా మారిపోతుంది. అందుకే భాషా వికాసాభివృద్ధికీ, శాస్త్ర సాంకేతికాభివృద్ధికీ సంబంధం ఉంది. మనం శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందకుండా అన్నీ అమెరికా నుంచో, యూరోపు నుంచో దిగుమతి చేసుకుంటూ మన భాషలో వాటికి పేర్లు పెడితే మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు? పిల్లలు అభివృద్ధి కావాలన్నా, మాతృభాషాభివృద్ధి కావాలన్నా కచ్ఛితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అభివృద్ధి కావాలి. ఇప్పుడు 'మేకిన్‌ ఇండియా' అంటే మన డబ్బు పెట్టి అమెరికా నుంచి విడిభాగాలు కొని, వాటిని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేయడమే. కారు పార్టులన్నీ అక్కడ కొంటాం. వాటిని ఇక్కడ కూర్పుచేసి కారును తయారు చేస్తాం. అది 'మేకిన్‌ ఇండియా' అయిపోతుంది. దానివల్ల శాస్త్ర సాంకేతికాభివృద్ధి రాదు. మనందరి దగ్గరా సెల్‌ ఫోన్లు ఉన్నాయి. దానిలో ఉండే చిన్న చిప్‌ను మనం ఇక్కడ తయారు చేసుకోలేం. ఒక వెబ్‌సైట్‌కు అవసరమైన సర్వర్లను నిర్వహించలేం. దీనికోసం అమెరికా మీదనో, యూరోపు మీదనో ఆధారపడాలి. మనం సర్వర్‌ అని అంటున్నాం. దానికేం పేరు పెట్టాలి? ఆ సర్వర్‌ అమెరికాలో ఉంటుంది. అదే సర్వర్‌ను మనం ఇక్కడ తయారు చేసుకుంటే ఒక తెలుగు పేరు పెట్టుకుంటే? మన తెలుగువాళ్లే ఇంజనీర్లు. తెలుగు ఇంజనీర్లయినా ఇంగ్లీషు పేరు పెట్టాల్సిందే. లేకపోతే వాళ్లకు అమెరికా జీతం రాల్చదు. అదే మన ప్రభుత్వం వాళ్లను ప్రోత్సహించి అవే సర్వర్లను, చిప్‌లను ఇక్కడ తయారు చేయించుకొని తెలుగు పేర్లు పెట్టుకుంటే అవి ప్రపంచవ్యాప్తం అవుతాయి. అప్పుడు తెలుగువారి కీర్తి ఖండఖండాంతరాలకూ వ్యాపిస్తుంది. ఈ రెంటి మధ్య సంబంధాన్ని విడదీయలేము. 
ఈ మధ్య హైదరాబాద్‌ వెళ్లినప్పుడు ఒక పాప టైం ఎంతయింది అని అడిగింది. పదయ్యిందని చెప్పా. అంటే ఎంతా అని అడిగింది. టెన్‌ అన్నా. ఓ అప్పుడే టెన్‌ ఓ క్లాక్‌ అయ్యిందా అన్నది. రాబోయే కాలంలో యువతరం తెలుగుభాష కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందనీ, దాన్ని కమ్యూనిస్టులే లీడ్‌ చేస్తారనీ నాకనిపించింది. అలాంటి కొత్త పరిస్థితి ఈ రోజు తలెత్తుతోంది. ఇక భాషా వికాసంలోనూ ఛాందసత్వం ఉంది. కొన్ని సందర్భాల్లో కొత్త పదాలు పుట్టుకొని వస్తుంటాయి. ఉదాహరణకు జరీబు భూములంటున్నాం. ఇది ఉర్దూ పదం. మాగాణి అని అర్థం. ఉర్దూ పదాన్ని మన భాషలో భాగంగా చేసుకున్నాం. ఇటువంటివి వ్యవసాయ సంబంధమైన పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి చాలానే వచ్చాయి. రెవెన్యూ పదజాలం కూడా ఎక్కువగా ఉర్దూలోనే ఉంటుంది. పహణీ వంటి పదాలు అందుకు ఉదాహరణ. ఇలా భాషా వికాసంలో వస్తున్న మార్పులను కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
ప్రపంచీకరణలో వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో జాతుల ప్రత్యేకతను గుర్తించకపోవడం ఒకటి. ఇంగ్లీషులో 'నేషనల్‌ స్టేట్‌' అంటారు. మన జాతీయోద్యమం కూడా దాని ఆధారంగానే నడిచింది. ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి ప్రపంచం అంతా ఒకటే అంటున్నారు. ప్రపంచమంతా ఒకటి కావాలని కమ్యూనిస్టులు అందరికన్నా ముందు కోరుకున్నారు. కానీ కమ్యూనిస్టులు కోరుకున్నది వేరు, నేడు జరుగుతున్నది వేరు. ఇపుడు జరుగుతున్నది ప్రపంచ సరిహద్దులు చెరిపేసి అందరూ ఉమ్మడిగా ఒక ప్రపంచ రాజ్యాన్ని ఏలడం కాదు. అమెరికా ఆధిపత్యంలో ఉన్న సంపద్వంతమైన జాతులు కొన్ని ప్రపంచం మీద పెత్తనం చేస్తున్నాయి. వారు శాసిస్తారు. మనం అనుసరించాలి. ఆ రకంగా జాతుల నిర్మూలనకు దారితీసే ప్రమాదం కూడా ప్రపంచీకరణలో మనకు కనిపిస్తోంది. మతం పేరుతో పెద్ద అలజడి సృష్టిస్తున్నారు. మతాన్ని విషగుళికలుగా మార్చి, దానికి భక్తి అనే తీపి ముసుగు తొడిగి సమాజంపై చల్లారు. జనానికి మత్తెక్కించి చీలగొట్టారు. వారిలో వారికి తగాదాలు పెట్టారు. పెత్తందారీ వర్గాలను అందలమెక్కించారు. బలపరచారు. దేవుడు ఉద్యమాలకు కానీ, సమాజాభివృద్ధికిగానీ ఎప్పుడూ అడ్డం రాలేదు. దేవుని పేరు చెప్పుకునే మనుషులు అడ్డం వచ్చారు. లాటిన్‌ అమెరికాలోని పరిణామాలు చూస్తే, వారి సహజ సంపదను అమెరికా వాళ్లు దోచుకుపోతుంటే, వాళ్లను అణిచిపెట్టి బికారులను చేస్తుంటే దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలతోపాటు క్యాథలిక్కులు, క్రిష్టియన్లు, థియాలజిస్టులు కూడా కలిసి వచ్చారు. మత పెద్దలు కలిసి వచ్చారు. ఈ రోజు వాటికన్‌ సిటీకి పోప్‌ ప్రాన్సిస్‌ అధినేతగా ఉన్నాడు. ఆయనీరోజు పేదల గురించి మాట్లాడుతున్న పాపానికి 'మార్క్సిస్ట్‌ పోప్‌' అంటున్నారు. ప్రజల ఒత్తిడి వల్ల కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు, ఈనాడు మతం అక్కడ సానుకూల పాత్ర పోషిస్తోంది. కానీ ఈరోజు మన దేశంలో మతం ప్రతికూల పాత్ర పోషిస్తోంది. మతం పేరుతో మతో న్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. భారతీయులు అంటే హిందువులు మాత్రమే అంటున్నారు. మన పురాణాల్లో, రామాయణ, భారతాల్లో హిందూ అనే పదం ఎక్కడా కనపడదు. భరత వర్షే, భరత ఖండే అన్నారు తప్ప హిందూ దేశే, హిందూ ఖండే, హిందూ వర్షే అని ఎక్కడా అనలేదు . హిందూ అన్నది విదేశీయులు పెట్టిన పేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, హిందువులు ప్రార్థన చేయడం ముస్లింలు వచ్చాకే నేర్చుకున్నారని చెబుతున్నాడు. ఇన్నాళ్లకు ఆయనకు రియలైజేషన్‌ వచ్చింది. దీనర్థం ప్రార్థన చేయడం అన్నదే మనకు తెలియదని అంగీకరించడమేగా కదా! కనీసం ముస్లింల నుంచి హిందువులు నేర్చుకున్నారనే సత్యాన్నయినా గ్రహించాడు. మోడీ కుర్తా, పైజామా, కోటు ధరిస్తున్నాడు. అది హిందువుల డ్రస్సా? పురాణాల్లో ఉందా? మొఘలాయిలు తెచ్చిన డ్రస్సు అది. మోడీ ఎలా ధరిస్తున్నాడు? దళితుల అంటరానితనాన్ని ముస్లింలు తీసుకువచ్చారట. అంతకుముందు అంటరానితనం లేదట. ఎవరైనా నవ్వుతారు. అంటే మొత్తం చరిత్రను వక్రీకరించి, చెడును ముస్లింలకు ఆపాదించి దళితులకూ, ముస్లింలకూ తగాదాలు పెడుతున్నారు. డిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో చాలా చోట్ల జరుగుతున్న మతఘర్షణలు మనం చూస్తున్నాం. ఈరోజు మత ఘర్షణలన్నింటిలో దళితులను ముస్లింల మీదకు మళ్లిస్తున్నారు. గుడి దగ్గరో, గోపురం దగ్గరో, ప్రేమ దగ్గరో, పెళ్లి దగ్గరో తగాదా సృష్టించి ముస్లింల మీదకు రెచ్చగొడుతున్నారు. ఆ రకంగా వారిని బలిపశువులను చేస్తున్నారు. మనవారి మధ్య తగాదా పెట్టి, ఒకగౄపును ఆయుధంగా మార్చి మనవారిమీదే ప్రయోగిస్తున్నారు. ఇదే గుజరాత్‌ నమూనా. 
అనేక రకాల పండుగలు జరుగుతున్నాయి. ఈ పండుగల్లో కూడా జాతీయమైనవీ, మత సంబంధమైనవీ, స్థానికంగా ఉండేవీ, ప్రకృతి పరమైనవీ, పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చేవీ ఉన్నాయి. పండుగలన్నీ మూడనమ్మకాలని, పనికిరానివీ అని ఒకే గాటన కట్టలేం. ఒకప్పుడు 1950ల్లో పండగొస్తే కమ్యూనిస్టులు ప్రభలు కట్టి అభ్యుదయ పాటలు పాడుకుంటూ తిరుణాళ్లు, జాతర్లలో పాల్గొనేవారు. ఆరోజు అభ్యుదయ గీతాలు కూడా పండుగల్లో భాగమై పోయాయి. సంక్రాంతి వస్తే ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఊరుఊరంతా పండుగ వాతావరణం వచ్చేది. అలాంటి ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని పండుగలతో మమేకం చేసి నిర్మించింది కమ్యూనిస్టు ఉద్యమం. మరలా అలాంటి సాంస్కృతికోద్యమాన్ని బీజం తొడిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేడే ఉంది. అది కార్మికుల పండుగ. జెండా ఎగురవేసి డప్పుకొట్టి నినాదాలిస్తేనే పండుగకాదు. ప్రతి ఇంట్లో దీపం వెలిగించవచ్చు. జెండా ఎగురవేయవచ్చు. అదొక ఉమ్మడి పోరాట ప్రతిజ్ఞాదినం. ప్రజా పండుగ. కార్మికుల పర్వదినం. ఓ ప్రమాణం స్వీకరించే దినంగా భావించాలనుకుంటే అప్పుడు కొత్త వెల్లువ, కొత్త సంస్కృతి వచ్చేస్తుంది. ఈ రోజు ప్రపంచీకరణ వాణిజ్యీకరణగా మారింది. సాంస్కృతిక రంగంలో ప్రజలకుండే జాగా క్రమంగా తగ్గిపోతోంది. ఇంతకుముందు పిల్లలను పార్కులకు తీసుకొని వెళ్లి అలా తిప్పి తీసుకువచ్చేవాళ్లు. పార్కుల్లోకి పోవాలంటే అప్పుడు ఉచితం. కానీ ఇప్పుడు పార్కులకు పోవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు కన్నా మించిన పెద్ద ఖర్చుంది. పార్కు మొత్తం ఇప్పుడో కమ్మర్షియల్‌ మాల్‌ అయిపోయింది. అన్నీ రకాల షాపులు ఉంటాయి. అక్కడ రకరకాల వస్తువులు అమ్ముతారు. అయితే పిల్లలను తీసుకుపోయినప్పుడు వెంట ఒక ఆటం బాంబును పట్టుకుపోయినట్లే. వెయ్యో, రెండు వేలో తీసుకుపోతేనే పిల్లలను సంతృప్తిపరచగలం. లేకుంటే లేదు. అటువంటి చోటకు పోయి ఏం చేస్తాం? కాబట్టి పార్కులకు పోయే సమస్య లేదు. మరి ఓ ఉయ్యాల లేకుండా, ఓ జారుడు బండ లేకుండా పిల్లల వికాసం ఏమిటి? గ్రామాల్లో కూడా కోతికొమ్మచ్చాటలు, బిళ్లంగోడులు కనిపించడం లేదు. వినోదాల కోసం పట్నాలకు పోతున్నారు. స్కూలు బస్సే పిల్లలకు ఆటస్థలంగా మారిపోయింది. 24 గంటలూ తోమి వారిని మర మనుషులుగా మార్చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అప్పుడు ఆ జాతి ఎలా ఉంటుంది? ఒక భౌతికపరమైన, మానసికపరమైన వికాసంలేని జాతి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది? సాంస్కృతిక శూన్యం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద సవాల్‌గా మారుతుంది. టర్కీలో పార్కుల కోసం పెద్ద ఉద్యమం నడిచింది. కమ్యూనిటీ హాలు కోసం కేటాయించిన స్థలంలో పెద్ద మాల్‌ కట్టబోతుంటే మాకు ఈమాల్‌ వద్దని ప్రజలు తిరుగుబాటుచేశారు. అది ప్రభుత్వాన్ని గడగడలాడించిన పెద్ద ఉద్యమంగా మారింది. ఇటువంటి ఉద్యమాలు ప్రపంచమంతా నడుస్తున్నాయి. మన దేశంలోనూ ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, బొంబాయిల్లో ఇలాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటివి అనేకమైనవి ప్రతిదీ డబ్బుతో ముడిపడిపోతాయి. పార్కుకు పోయినా డబ్బు. సినిమాకు పోయినా డబ్బే. కానీ సినిమాకు పోయినట్లు ఉండదు. మాల్‌కు పోయినట్లు ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వే స్టేషన్‌కు పోయినా కమ్మర్షియల్‌ మాల్స్‌కు పోయినట్లుంటుంది. దానికి డబ్బు కావాలి. అందుకే మోడీ ధన్‌జన్‌ యోజన ప్రవేశపెట్టాడు. జన్‌ధన్‌ యోజన కింద ఐదు వేల రూపాయలు ఓవర్‌డ్రాప్ట్‌ ఇస్తాడట. అంటే అప్పు తీసుకో. అనుభవించి, దివాళా ఎత్తు. ఎవరైనా ప్రజల ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వం మార్గాలు చూపాలి. పథకాలు పెట్టాలి. కానీ జన్‌ధన్‌ యోజన ప్రజలను అప్పులపాలు చేసే పథకం. ఈ పథకాన్నిపెట్టి నాది ఘన విజయం అని చెబితే ఉపయోగమేమిటి? ఈ ఐదు వేలు దేనికి పనికి వస్తాయి? ఏమైనా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి పనికి వస్తుందా? ఏదో ఒకటి కొనుక్కోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కొనుకున్న తరువాత మళ్లీ ఎలా తీర్చాలి? వారు కట్టలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే పెద్ద వాళ్లు లక్షల కోట్లు ఎగవేశాక వీరి ఐదువేలు పోతే పోయిందిలే మాఫీ చేస్తామంటారు. ఎందుకంటే జనాన్ని అవినీతిపరుల్ని చేస్తేనే కదా వారి అవినీతి కూడా మూడుపువ్వులు,ఆరుకాయలుగా వర్ధిల్లేది. కాబట్టి ఈ రకమైన సాంస్కృతిక శూన్యత రాబోయే రోజుల్లో పెరగబోతున్నది. 
ఇప్పుడు భాష గురించి చెప్పుకున్నాం. భాషల్లో చాలా భాషల గురించి చెప్పారు రవిబాబుగారు. ఓ కొత్త భాష వచ్చింది. అది రాజకీయ భాష. రాజకీయ సంస్కృతి మాదిరిగానే రాజకీయ భాష కూడా. ఈ రాజకీయ భాష ప్రత్యేకత ఏమిటంటే వారుచెప్పేది జనానికి అర్థమయినట్లే ఉంటుంది కానీ అర్థం కాదు. అంటే అస్పష్టంగా ఉంటుంది. ఇచ్చినట్లే ఉంటుంది. నేను చెప్పానా ఆమాట అంటాడు. అప్పులు రద్దు చేస్తానంటాడు. రూ.పదివేలు కూడా రద్దు కాలేదు అని రైతులు అడిగితే అప్పులన్నీ రద్దు చేస్తానని చెప్పానా అంటాడు. అదన్నమాట రాజకీయ భాష అంటే. తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి నెత్తిమీద పదిపైసలు పెట్టి నిన్ను పావలాకు అమ్మేస్తామని చెప్పే మాటలు ఇక్కడున్న భాషా పండితులు, సాహితీవేత్తలు రాజకీయ నాయకుల వద్ద, మోడీ దగ్గర, చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. ప్రజలను మోసం చేసి, వంచన చేసే నయవంచక భాష ఒకటి రాజకీయ రంగంలో ప్రవేశపెట్టారు. సాహిత్య రంగంలో దీన్ని కూడా చీల్చి చెండాడాలి. ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి రావాల్సి ఉంది. కేజ్రీవాల్‌ కూడా అదే చెబుతున్నారు. విఐపి కల్చర్‌ వద్దు. అవినీతి లేని రాజ్యం రావాలి. గుడ్‌గవర్నెస్‌- అంటే మంచి పాలన కావాలి. అంటే కష్టం లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రజలకు సర్టిఫికెట్లు వచ్చేయాలి. ఆసుపత్రికి పోతే వెంటనే పనికావాలి. స్కూల్లో వెంటనే సీటు కావాలి. ఇవన్నీ మంచి ఆశయాలే. కమ్యూనిస్టులు కోరుకునేవి కూడా ఇవే. వామపక్షాలు అధికారంలో ఉన్నచోట ఎవరికన్నా బాగా వీటిని అమలు చేస్తున్నారు. కానీ ఒకటే తేడా. ఈ వ్యవస్థను ఇలా ఉంచి దీనినే సంస్కరించి అన్నీ సమృద్ధిగా సమకూర్చి పెడతానని కేజ్రీవాల్‌ అంటున్నారు. ఈ వ్యవస్థను ఇలాగే ఉంచి అన్నీ సమకూర్చాలంటే అసాధ్యం. అన్ని సౌకర్యాలూ సమకూరాలంటే వ్యవస్థను సమూలంగా పునర్నిర్మించి కొత్త వ్యవస్థను నిర్మిస్తేనే సాధ్యమవుతుందని కమ్యూనిస్టులు చెబుతున్నారు. తక్షణం భారాలకు వ్యతిరేకంగానో, కాలేజీల్లో ఫీజుల పెంపుకు వ్యతిరేకంగానో, ఆసుపత్రిల్లో వైద్యం కోసమో, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు కల్పించాలనో, సబ్సిడీల కోసమో పోరాడుతూనే ప్రజలను కదిలించి, సమూల మార్పుల కోసం పెద్ద ఉద్యమాలు నిర్మిస్తే, దానికో రాజకీయ రూపమిస్తే అప్పుడు ఈ సమాజాన్ని మార్చొచ్చు. 
ఈ మధ్య హైదరాబాద్‌లో పార్టీ ఇంటింటికీ వెళ్లి ఓ సర్వే నిర్వహించినప్పుడు 30 ఏళ్లలోపు యువకుల్లోలో ఒక ధోరణి కనిపించింది. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ గురించి వారికి తెలియదు. అందులో రాజకీయాలు మాకనవసరం. అన్ని పార్టీలూ ఒకటే. కమ్యూనిస్టు పార్టీ కూడా అందులో ఒకటి. 40, 50 ఏళ్ల వాళ్లలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఉంది. (సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన దాని ప్రభావం వారి మీద ఉంటుంది
). అందుకని కమ్యూనిస్టులంటే కొంత ద్వేషం ఉంటుంది. కానీ యువకుల్లో కమ్యూనిస్టులంటే ద్వేషం లేదు. రాజకీయాలంటేనే వ్యతిరేకం. రాజకీయాలకు వ్యతిరేకమంటే కమ్యూనిస్టు పార్టీ కూడా రాజకీయ పార్టీ కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చింది. మీరేదన్నా మాకోసం పని చేయండి. నచ్చితే నిధులిస్తాం అన్నవాళ్లున్నారు. రాజకీయాలంటే తెలియకపోయినా, రాజకీయాలంటే వ్యతిరేకత ఉన్నా, కమ్యూనిస్టు పార్టీ ఈ కొత్త తరంలో పనిచేస్తే అభివృద్ధి అయితీరుతుంది. ఈ తరంలో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలత వుందని కాదు. దాన్ని సృష్టించుకోవాలి.
రాబోయే కాలంలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతోంది. కంప్యూటర్‌ ఉద్యోగాలు వస్తాయి అని యువ ఇంజనీర్లు ఆశగా ఎదురు చూస్తుంటే నాస్‌కాం 16 శాతం ఉద్యోగాలు పడిపోతాయని ప్రకటించింది. ఇప్పటికే చాల కంపెనీల్లో రిట్రెంచ్‌మెంట్లు చేసేస్తున్నారు. 25 వేల ఉద్యోగులను తొలగించి 5 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగంవల్ల యువకుల్లో నిస్పృహ వస్తుంది. దానికి నమూనానే మోడీ వేవ్‌, డిల్లీలో కేజ్రీవాల్‌ వేవ్‌ వచ్చాయి. ఇది శాశ్వతం అనుకుంటే పొరబాటు. ఈ తరంలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏమిటంటే తక్షణ ఫలితాలను కోరుతున్నారు. వెంటనే మాకు ఫలితం కావాలి. ఎక్కడకు పోయినా అంతేకదా. ఇంతకుముందు కేథలాబ్‌కు వెళ్లి బ్లడ్‌ ఇచ్చి వచ్చేవాళ్లమనుకోండి. మూడు రోజుల తరువాత రమ్మంటారు. ఈ రోజుల్లో కంప్యూటర్‌ ద్వారా గంటలో అయిపోతోంది. ఆ ప్రభావం యువకులపైన కూడా ఉంటుంది. అందుకని ఏడాదిలో రెండేళ్లలో వారు అనుకున్నది నెరవేర్చకపోతే, మోడీనీ, క్రేజీవాల్‌ను ఎంత ఎత్తుకు లేపారో అంత ఎత్తునుంచీ పడేస్తారు. 
అప్పుడు ప్రజలకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం అవుతుంది. కేజ్రీవాల్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించి వారిలో పనిచేశాడు. అవినీతిలేని రాజ్యాన్ని అందిస్తానన్నాడు. ఆశయం మంచిదే. అతడు నిజాయితీపరుడే. కానీ ప్రభుత్వ అధికారాలు చాలా తక్కువగా ఉన్న ఢిల్లీ వంటి చోట అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందా? సాధ్యం కానప్పుడు యువకులు ఎలా ఆలోచిస్తారు? ఆయనను ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెబుతారు? రాబోయే కాలంలో ఇలాంటి ప్రశ్నలకు మోడీ అయినా, కేజ్రీవాల్‌ అయినా సమాధానాలు చెప్పాలి. రాబోయే కాలంలో ఓ రాజకీయ శూన్యత కూడా ఏర్పడబోతోంది. దీన్ని భర్తీ చేయడంపైనే భారతదేశ, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 
కొత్త రాజకీయ సంస్కృతిని కమ్యూనిస్టు పార్టీ ప్రజల ముందుకు తీసుకువచ్చి జాతి వికాసం కోసం, భాషా వికాసం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక వికాసం కోసం, సామాజిక మార్పు కోసం పోరాడేందుకు ఈ తరాన్ని ముందుకు నడిపించాలి. 1950ల్లో ఏ చరిత్రనయితే సృష్టించి మొత్తం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసి, అధికారంలో లేకపోయినా ఒక ట్రెండ్‌ను సృష్టించిందో ఆ విధంగానే రాబోయే కాలంలో కూడా మరలా ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించడానికి కమ్యూనిస్టు ఉద్యమం పూనుకోవాలి.