##ఆధునిక కవిత్వం- రజకుల స్థితిగతులు##
అనాదిగా కులం, వృత్తి పరస్పరాశ్రితాలుగా కొనసాగాయి. విద్య, ఉద్యోగాలు, వ్యాపారకారణాల వల్ల ఆ బంధం బిగువు సడలింది. ప్రతి కులానికి ఒక సామాజిక ప్రతిపత్తి ఉంది. ప్రతివృత్తి సామాజిక అవసరంగా ఉంది. పులి కొండ సుబ్బాచారి కుల పురాణాలులో సామాజిక నిర్మితిలో రజక కులం, సామాజిక ప్రతిపత్తి, స్థానాన్ని బట్టి శ్రేణీకరణంలో ఆరవస్తరంలో సూచించారు. పద్మసాలె, దేవాంగ, యాదవ, కమ్మరి, కుమ్మరి చాకలి కులాలను ప్రభుత్వం బి.సి కమీషన్ సామాజికంగా వెనకబడిన కులంగా గుర్తించారు. స్థానాన్ని, సామాజిక అంతస్తును ఉన్నతీకరించుకునే క్రమంలో కుల నామాలు సంస్కృతీకరించుకోబడినాయి. చాకలి-రజకులు, మంగలి- క్షురక-నాయిబ్రాహ్మణ, కంసాలి-విశ్వకర్మ, జాలరి - మత్స్యకార మొదలైనవి వృత్తి నైపుణ్యం వృత్తికారుల్లో పుష్కలం, కులం వంశపారంపర్యం వృత్తిఐచ్ఛికం, కులం వృత్తి అవినాభావ సంబంధం చాలా కాలంగా ఉండటం వల్ల నైపుణ్యం అలవడుతుంది. పుట్టినప్పటి నుంచి వృత్తి పనులను గమనిస్తూ, అనుభవిస్తూ ఉండడం వల్ల అలవోకగా అబ్బుతుంది. వివిధ రకాల వృత్తుల వాళ్లు అల్లిబిల్లిగా అల్లుకొన్న అనుబంధం, పరస్పర సహకారం, సమైక్యత పల్లెల్లో ముప్పరికొని ఉండేది. ప్రపంచీకరణ నేపథ్యంలో కులవృత్తులకు ఆదరణ సన్నగిల్లడం, ఇతర వ్యాపకాలపై మొగ్గు చూపడం తమ సామాజిక ప్రతిపత్తిని పరామర్శించుకునే చైతన్యం రావటం వల్ల కుల వృత్తిని పారంపర్యంగా చేపట్టడం తక్కువవుతోంది.
ప్రతి వృత్తిలో ఆధునికీకరణ యాంత్రీకరణ చోటుచేసుకుంది. దీనివల్ల వృత్తి దార్లకు కడుపునిండని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి స్థితి రజక, కుమ్మరి, పద్మసాలె, కమ్మరి మొదలైన కులాల్లో నెలకొనింది. ఆధునిక సాహిత్యం స్త్రీలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు సమస్యల వైపు దృష్టి సారించడంతో వారి స్థితిగతులు ఇతివృత్తాలయ్యాయి. ఆయా కులాల నుండి రచయితలు కలం సాగించడం వల్ల అనుభూతి అనుభవసారం సాహిత్యంలో ప్రతిఫలించింది. ఈ కోవలో ఆధునిక కవిత్వం రజకుల స్థితిగతులను విమర్శకు పెట్టింది. వృత్తిపని విధానం, వృత్తి పదజాలాన్ని అక్షరీకరించింది. బట్టలకంటిన మురికిని, మైలను చౌడునీళ్ళల్లో ఉడకబెట్టి, ఉతుకుడు బండకేసి బాది మిలమిలలాడించేది రజక వృత్తి. ప్రతి రజక కుటుంబానికి మిరాశి కుటుంబాలుంటాయి. వారికి తప్ప ఇతరులకు ఉతకరు. నిర్ణీత మేర ఉంటుంది. అదే వారి జీవనాధారం. నేడు లాండ్రీలు, తోపుడు బండ్లపై ఇస్త్రీలు, డ్రై క్లీనింగ్ షాపులు వెలిశాయి. వారు నిర్ణయించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. శుభ్రపరచడానికి రకరకాల సబ్బులు డిటర్జంట్లు మార్కెట్లోకి వచ్చాయి.
రజకవృత్తిలోని సాదకబాదకాలను కత్తి పద్మారావు 'చాకిరివీరుడు'లో వర్ణించారు. రజకులు మామూలు మురికి బట్టలతో పాటు మలమూత్రాల బట్టలను ఉతికి అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడంటారు.
మల మూత్రాలతో/మకిల బట్టిన బట్టలుతికి/అమ్మతనానికి / ఆయువు పోసినోడు.
చౌడులో ఉడికించి, ఉతికిన బట్టలు సువాసన కలిగి ఉంటాయని, దండేలపై ఆరేసిన రంగురంగుల పట్టుచీరలు రంగురంగుల పట్టుచీరలు హరివిల్లును తలపించేవని ననుమాసస్వామి 'నీలిబాల్యం'లో వ్యక్తీకరించారు.
సౌడులో ఉడికించి, ఉతికిన బట్టలు ఆరేస్తున్నప్పుడు - పరిసరాలన్నీ పరిమళభరితమయ్యేవి-జిట్టీదులపై ఆరేసిన పట్టుచీరలు రంగుల హరివిల్లులు -
చౌడుమట్టి నీళ్ళలో గుడ్డలు ఉడకేసి, మురికిని వదలగొట్టే రజకున్ని రసాయన శాస్త్రజ్ఞునితో పోల్చారు. చౌడుమట్టిని / సున్నపుగడ్డ/కలిపిన కమ్ముతో / గుడ్డలుడకేసి/మురికిని పిండిన / రసాయన శాస్త్రజ్ఞుడు
'చాకిరి వీరుడు'
మూడ్రోజులకో, వారానికో ఇంటింటికెళ్ళి మురికి బట్టలు సేకరించి, ఉదయాన్నే నీటివనరుల దగ్గర చాకిరేవు పెట్టి పిల్ల జెల్లాతో కూడా పనిలో నిమగ్నమవుతారు. ఉతికి, ఆరబెట్టిన గుడ్డలు సాయంత్రానికి యాజమానుల ఇండ్లకు చేర్చుతారు. ఇంతగా కష్టపడినా బట్ట చిరిగిందనో, మురికిపోలేదనో, జేబులో డబ్బుపోయిందనో, చీవాట్లు తప్పవంటారు.
మట్టి మరక పోలేదని / నలిగి, చిరిగిపోయిందని / చీరమడతలోనో / చొక్కాజోబులోనో / ఉన్న సొమ్ము పోయిందని / చీవాట్లు చీదరింపులు - అదిరింపులు, బెదిరింపులు - 'చాకిరి వీరుడు'.
ఈ వృత్తి పని చేసినందుకు మిరాశీదార్లు నుంచి పంట పండినపుడు ఇచ్చే మేర కూడా చాలా తక్కువ. మీరాశీదార్లు సాయంత్రం అన్నం పెట్టడం ఆనవాయితీ. అదైనా ఉడుకు అన్నం కాకుండా పాసిన అన్నం పెడతారని, దాని వల్ల అనారోగ్యం కలుగుతుందని, చాకిరీలో ఒళ్ళుగుల్లయి పోతందంటున్నారు.
పాసిన కూటి కోసం / నిలువెల్ల చాకిరీ చేసి
కృత్నఘ్నుల సేవలో / మగ్గి బుగ్గయి/ జీవన సంస్కతంతా / గుల్ల చేసుకున్నోడు - చాకిరీ వీరుడు
సమర్తయినా, పెండ్లయినా/పురుడైనా/ మొత్తం మురికిని పిండి/ఆరేస్తూ ఆగ్రజుడు/కూలికొలత లేనోడు - శ్రమకు తగిన ప్రతిఫలం కూడా ఆశించని రజకుని శ్రమతత్త్వాన్ని వ్యక్తీకరించారు కత్తి పద్మారావు.
చౌడుమట్టిలో మురికిని పోగొట్టే లక్షణాలను గుర్తించిన రజకుడు గాడిద పెంటతో డిటర్జంట్లను చేసే పరిజ్ఞానాన్ని పొందాడు. వివిధ చేతి వృత్తుల నైపుణ్యాన్ని మలినమైన పనులను చేస్తున్న సహనాన్ని గుర్తించటం లేదని 'మాకూ ఒక భాష కావాలి'లో తుల్లి మల్లి విల్సన్ సుధాకర్
''గాడిద పేడతో/డిటర్జంట్లు చేసే రజకుల మేదస్సుని'' పొగిడారు.
పురిటిమైలబట్టల నుండి మకిల బట్టిన బట్టలు తీసుకెళ్ళి చాకిరేవు పెడతారు. సాధారణంగా చెరువులు నీటికుంటల దగ్గర చాకిబండలను ఏర్పరచుకొని ఉతుకుతారు. ఉన్నవారి బట్టలకైనా, లేని వారి బట్టలకైనా రేవు బండ ఒకటే. బట్టల రకాలను బట్టి వేరు చేసి ఉబ్బపెట్టి సౌడుమట్టి కలిపిన నీళ్లలో తడిపి, వడతిప్పి నీళ్లు పిండి, మడిచి బానలో సగానికి పైగా నీళ్లు పోసి, మడిచిన గుడ్డలు పేర్చి ఉడకబెట్టి ఉతుకుతారు.
'మా ఊరు మొలకెత్తింది' కవితలో ఒక అంచున చాకిరేవు ఊరందరికి అదొకటే / మా చాకలి రావమ్మకు / ఉన్నవారి పట్టుకోక/లేనివారి గోటురైక / అన్నింటికీ రేవొకటే బండొకటే / అని వృత్తి పనిలో సమత్వాన్ని తెలిపారు హనుమారెడ్డి.
కాలం మారింది. వానలు కరువయ్యాయి. చెరువులు, వాగు వంకలు ఎండిపోయాయి. ఎండిన చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకుపోతున్నాయి. దాంతో చాకలి వృత్తికి నెలవైన నీటివసతి కొరవడింది. వృత్తికి గండిపడింది. అందుకే గోరటివెంకన్న ''వాగులు వంకలు ఎండిపోయినయ్; చాకలి పొయ్యిలు కూలిపోయినవి'' అంటారు.
ఉతకడానికి వేసే గుడ్డలు పలురకాలుగా ఉంటాయి. ఉతికిన తర్వాత అవన్ని జాగ్రత్తగా యజమానులకు చేర్చే బాధ్యత రజకునిదే. గుడ్డలు కలిసి పోయి ఒక ఇంటివి మరో ఇంటి వాళ్ళకు అందివ్వకుండా ఉండడానికి ఇంటికో గుర్తు వేసుకుంటారు. గుర్తును బట్టి వేరు చేసి, ఆయా ఇళ్ళ వారీగా చేరవేస్తారు. గుర్తులు వేయడానికి జీడిగింజలు వాడతారు. కాల్చిన జీడిగింజను సూదితో లేదా పిన్నుతో గుచ్చి ఆ రసంతో ఒక్కో ఇంటికి చుక్క, గీతలు లాంటివి వేసి, గుర్తు పెట్టుకుంటారు. ఒకసారి జీడిగింజ రసంతో గుర్తు వేస్తే గుడ్డ చిరిగి పోవాల్సిందే తప్ప గుర్తు చెరిగిపోదు.
కిర్రుచెప్పుల భాషలో శిఖామణి జీడిగింజతో వేసే చెరగని గుర్తులాగా జాతి వస్త్రంపై చాకలి సంతకం చేస్తున్నాను అంటున్నారు.
ఇప్పుడు అక్షరాన్ని / కాల్చిన జీడిగింజను చేసి/జాతి వస్త్రం మీద / నా చాకలి సంతకం చేస్తున్నాను.
చాకలికి బట్టల మూటలు మోయడంలో అండగా నిలిచేది గాడిద అధిక బరువును గాడిద బరువు అనీ, అధిక శ్రమను గాడిద చాకిరీ అనడం జనుల వాడుక. ఉప్పు వ్యాపారస్తులు మూటలను గాడిద పై వేసి ఊరూరు తిరుగుతుంటారు. గాడిదలు సాకే స్తోమత లేని రజకుడు తన వీపు పైనే మూటలు వేసుకొని, చాకిరేవుకు తీసుకెళతారు. పసిపిల్లలు, కాటికి కాళ్ళు చాపిన వృద్ధులు మలమూత్రాలు గుడ్డల్లో పోతుంటారు. అవి కూడా రజకుడు మూట కట్టి వీపున వేసుకొని రేవుకు తీసుకెళ్లి చాకిరి చేస్తారు.
పురిటి పిల్లల్నుంచీ / కాటికి కాళ్లుజాపిన / ముసలోల్ల దాకా ఉచ్చా పీతి గుడ్డల్ని / వీపున మోసే గాడ్దెలం/ అని ఆవేదన చెందుతున్నారు. పి, దస్తగిరి 'మేసాకలోళ్లం' కవితలో
బట్టల మలినాన్ని పోగొట్టి ముత్యాల్లాగా మార్చడమే కాకుండా, యజమానుల ఇండ్లలో శుభ కార్యాల్లోను, గ్రామాల్లో జరిగే ఉత్సవాలు, జాతర్లలో రజకులకు నిర్ణీత ప్రమేయముంటుంది. దేవుని ఉరేగింపులో, బలిజంతువులను గుడికి తీసుకెళ్ళేటప్పుడు ముందు రజకుడు దివిటీ పట్టుకెళ్ళడం ఆనవాయితీ. కొన్ని ప్రాంతాలలో గ్రామదేవతలకు పూజారులుగా ఉన్నారు.
దేవరెద్దు ఉత్సవాల్లో ఎద్దు అడుగు కింద పెట్టకుండా మడుగు పరచడం, గ్రామదేవతల జాతర్లలో దుప్పట్లు పరచడం, దేవుని ఊరేగింపులో వాహనాలు మోయడం, పండుగలకు గుడిగుమ్మాల్లో తోరణాలు కట్టడం వంటి పనులు వీరివంతు.
దివిటీపట్టే టోడు / పల్లకి మోసేవాడు - 'చాకిరి వీరుడు'. మడేలు దుప్పట్లు మడువుతో గ్రామదేవతలు ఆనందించిరి - మా ఊరు మొలకెత్తింది.
ఏ పండుగొచ్చినా, పబ్బ మొచ్చినా / గుడిగుమ్మాల కాడ / శోభతో స్వాగతించే మామిడి తోర ణాలం / ఉత్సవ ఊరేగింపులలో / రాములోరిని / భుజాలపై వీధివీధికి మోసే హనుమంతులం - మేం సాకలోళ్లం - పి.దస్తగిరి.
మిరాశిదార్ల ఇళ్లలో పెళ్లి పేరంటాలకు రజకులు సేవలందించాలి. పూర్వం శుభకార్యాలు వీరిప్రమేయం లేకుండా జరిగేవి కావు. నిర్ణీత పనులు తప్పక చేయాల్సి ఉండేది. ఆడపిల్లలు సమర్త అయినప్పుడు మైల గుడ్డలు పిండడం, నలుగు రోజు పీటలకింద వస్త్రాలు పరచడం, వంటి పనులు చేయాలి. గ్రామాల్లో ఈ ఆచారాలు కొంత తగ్గుముఖం పట్టాయి. పట్టణాల్లో ఆచారాల పట్ల ఆసక్తి తగ్గింది. మారుమూల గ్రామాల్లో సంప్రదాయాల పట్ల పట్టింపులున్న కుటుంబాల్లో ఇంకా కొనసాగుతున్నాయి.
పెండ్లికి కబురు చెప్పేటోడు / ఇంటికి వెల్ల వేసేటోడు - చాకిరి వీరుడు
మా బతుకుల్లో వెలుగులేకున్నా / మీ పెళ్ళిళ్లకూ పేరంటాలకూ / చీకటిని తరిమి వెలుతురునిచ్చే దివిటీలం - 'మేం సాకలోళ్ళం'.
ఇంటి చాకలి కళ్యాణ వేదిక సిద్ధం చేశాడు. - మా ఊరు మొలకెత్తింది.
పల్లెల్లో వివిధ కులవృత్తుల వాళ్ళు, పరస్పరాధారితంగా అక్క, బావ, మామ అనుకుంటూ సుహృద్భావవాతావరణంలో ప్రశాంత జీవనం గడిపేవారని, స్థాయి భేదాలు లేవనీ, ఉత్పత్తిలో శ్రమవిభాగ వ్యవస్థ అని, రైతులు వారిని చేరదీసి అభిమానించేవారని, రైతుకు అండగా అన్ని వృత్తుల వారు సహకరించే వారని మా ఊరు మొలకెత్తింది లో హనుమారెడ్డి పేర్కొన్నారు.
కుమ్మర్లు కమ్మర్లు / చాకళ్ళు మంగళ్ళు / అందరూ సహజీవనం చేసేవారు / ఎవరైతేనెం తేడాలు తక్కువ/మక్కువలు ఎక్కువ / ఎవరిపని వారిదే / శ్రమవిభాగ వ్యవస్థ అది / శాంతం - ప్రశాంతం / వేతల్లో కోతల్లో ఏకత్వం.
అయితే కోలపూడి ప్రసాద్ అగ్ర కులస్థుల మధ్య కుల వృత్తిదారుల జీవితం దుర్భరంగా ఉంటుందని వర్ణించారు. వందపులులు మధ్య మేకలా / వేయి మంది అగ్రకులస్థుల మధ్య ఒక చాకలిగా/ కుమ్మరిగా/మంగలిగా బతకడం ఎంత దుర్భరం.
రజకులకు గుడ్డలుతికే కుటుంబాలు నిర్దేశితంగా వుంటాయి. మిరాశీదార్లు అంటారు. వారికి తప్ప ఇతరులకు ఉతకరు. రజక కుటుంబం భాగాలు పోతే మిరాశీ ఇళ్లు పంచుకుంటారు. మిరాశీదార్లు రజకుల శ్రమకు సంవత్సరానికి 'మేర' ఇస్తారు. సాధారణంగా రైతులైతే పంట పండిన తర్వాత నిర్ణీత ధాన్యం ఇస్తారు. కరువు కాటకాలతో, రైతు పంట కళ్ళచూడడమే గగనంగా మారింది. అలాంటప్పుడు నెలవారి గాని, గుడ్డకింత అని డబ్బు రూపంలో చెల్లిస్తారు. కుటుంబమంతా చాకిరీచేస్తే దక్కేది పరిమిత ప్రతిఫలమే నంటున్నారు కత్తి పద్మారావు చాకిరీ వీరుడులో.
సంవత్సరానికొకతూరి / తూమెడు గింజలు కొలిస్తే/కుటుంబానికంతా/నిస్వార్ధంగా/ చాకిరీ చేసే / అవిశ్రాంత శ్రామికుడు.
ఇంటిపనితోపాటు వృత్తిపనిలో రజక మహిళ భాగస్వామ్యముంది. రజక స్త్రీలు సాయంత్రం పూట అన్నం పెట్టించుకురావాడానికో, గుడ్డలు తెచ్చుకోడానికో, ఇవ్వడానికో మిరాశీ ఇండ్లకు వెళ్ళినపుడు, పురుషుల కన్ను పడకపోదు. కన్ను పడిందంటే వేధింపులు తప్పవు. అఘాత్యాలకు గురికావచ్చు. చెల్లెలి పైనో, భార్యా పైనో అఘాయిత్యం జరిగినా, ఎదిరించలేని నిస్సహాయతను కత్తి పద్మారావు 'చాకిరివీరుడు'లో పేర్కొన్నాడు.
సంధ్యకాంతుల్లో / గుడ్డలు మడతేసి/చీకటి పోరల్లో అఘాయిత్యానికి గురైన / చెల్లెలి ఆక్రందనను / గుండెల్లో దాచుకునే నిస్సహాయనిర్భాగ్యుడు/
తెలంగాణాలో దొరలదోపిడీ తనాన్ని, దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన సాహస వనిత ఐలమ్మ. పంట పొలాన్ని దోపిడీ చేయకుండా పోరాడి దక్కించుకుంది. వినుసూర్ దేశ్ముఖ్ ఐలమ్మపై పగ తీర్చుకోవడానికి ఆమె భర్తను, ఇద్దరు కొడుకులనీ హత్యాయత్నం కేసులో ఇరికించారు. కూతురు సోము నర్సమ్మ పై అత్యాచారం చేయించారు. అయినా ఐలమ్మ జంకలేదు. సంఘం పెట్టి ఎర్ర జెండా ఎగురవేసింది. తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచింది.
నా బువ్వ గుంజు కున్నందుకు/ బువ్వ గింజల పోరాటం జేస్తా / బువ్వ గింజల చాకలి ఐలమ్మ/ మొదటి నెత్తుటి చుక్క - దొడ్డి కొమురయ్యలు / మే మే / అంటున్నారు. 'నేను బహువచనం' కవితలో జూలూరి గౌరీ శంకర్.
తల్లికి పాలులేనపుడో, తల్లి మరణించిన సందర్భాల్లోనో రజక స్త్రీలు తమ పాలు పట్టి యజమానుల పిల్లలను పెంచిన సందర్భాలు అనేకం. పెరిగి పెద్దయ్యాక ఆ పిల్లలు వారి పై కృతజ్ఞత చూపడం సహజం చనుబాలతోనా మేను పెంచిన చాకలమ్మకు దండాలు / నన్నుపెంచిన చాకివంటేనే నాకు ప్రేమ -అంటూ ననుమాసస్వామి 'నీలి బాల్యం'లో కృతజ్ఞత అర్పించారు.
మురికి బట్టలను ముత్యాల్లాగా, తీర్చినా వీరికి దక్కే గౌరవం దక్కటం లేదని, ఒరే , ఒసే, అని పిలుస్తూ, కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. 'మేం సాకలోళ్ళం' కవితలో పి. దస్తగిరి ఉత్తమపురుషులో సాగిన కవితలో మాకూ ఆత్మాభిమానముంది. గౌరవించండి అని నివేదించుకున్నారు.
ఒరే చాకలి/అన్న మీ గద్దింపులకు / సెప్పురెడ్డీ అంటూ పలికి/మానాన్ని సంపుకున్న / మనుషులం / ఇంగొద్దూ చాలు / మేము ఆత్మాభిమానమున్నోళ్ళమే / మనసున్న మనుషులమే / మమ్మల్ని గుర్తించండి/గౌరవించండి.
రజకులకు సంఘాలున్నాయి. వర్గ చైతన్యం కల్గింది. తమ స్థితిగతులపై ప్రశ్నిస్తున్నారు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను పట్టణాల్లో పెట్టుబడి దారి వ్యవస్థను ధిక్కరిస్తున్నారు. కులవివక్షను వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక, సామాజిక రంగాలలో సమత్వాన్ని కోరుతున్నారు. రజక స్త్రీలు పోరాటాల్లో పాల్గొంటున్నారు. తమ కులాన్ని హీనంగా చేసే కుల అహంకారాన్ని తత్వాన్ని బూర్జువాతనాన్ని దెబ్బకొట్టి తీరుతామని, బట్టల మురికిని పొగొట్టే రజకులకు అది కష్టం కాదని పి. దస్తగిరి మేం సాకలోల్లంలో నినదించారు.
దేవర దున్నపోతునే కాదు / కులహంకారాన్ని ఒక్క వేటుతో / నరికే వేట కొడవళ్లం / మనసుల్ని గుచ్చే మీ మాలిన్నమైన మాటలను / రోగాళ్లమై మోసుకెళ్లి చాకలి పొయ్యిలో కాల్చే పంగల కర్రలం / కాదంటే / బండకేసి బట్టల్ని ఉతకటం / బాగా తెలిసినోళ్ళం / మీ బూర్జువాతనాన్ని ఉతకటం / మాకేం కష్టం కాదు/
వివిధ కుల వృత్తుల వారు వృత్తిని వదలి విద్య, ఉద్యోగాల వైపు దృష్టిపెడ్తున్నారు. శ్రమదోపిడీ, ఆధిపత్య భావజాలం నిండుకున్న అగ్రకులస్థులకు అది కడుపు మంట కలిగించిందని ఏ.వై.ప్రభు 'మెరిటంటే ఏందిరో' కవితలో వ్యక్తీకరించారు.
సాలోల్లు, సాకలోల్లు, ఉప్పరోల్లు, వడ్డెరోల్లు, మంగలోల్లు - మాదిగోల్లు, ఎరుకలోల్లు, లంబడోల్లు.... ఉద్యోగం చేస్తుంటే కడుపుమండిందిరో/
ఆధునిక కవిత్వంలో రజకుల స్థితిగతులను అవలోకిస్తే రెండు కోణాలు అవగతమవుతున్నాయి. అనాదిగా సంప్రదాయ వృత్తిదారులకు వృత్తే జీవనాధారం. అరకొర ఆర్థిక వెసులుబాటుతో శ్రమ దోపిడీలో మగ్గారు. పెత్తందారీ వ్యవస్థ ఆధిపత్యంలో, వృత్తి నైపుణ్యం అగౌరవింపబడింది. నేడు శ్రమ విలువను, ఆర్థిక అసమానతను పసిగట్టి చైతన్య వంతులయ్యారు. అన్యాయాన్ని నిలదీస్తున్నారు.
పారిశ్రామికీకరణ, యాంత్రీకీకరణ కుల వృత్తులను దెబ్బకొట్టాయి. రజక వృత్తి విధానంలో మార్పులొచ్చాయి. పల్లెలకు పట్టణాలకు రజక వృత్తిలో తేడా ఏర్పడింది. పల్లెల్లో సంప్రదాయ పద్ధతిలో కులవృత్తి కొనసాగుతుండగా, పట్టణాల్లో ఇళ్లలో వాషింగ్మెషిన్ వాడుతున్నారు. లేదా ఉతికించుకుంటున్నారు. ల్యాండ్రీలు, ఇస్త్రీ బండ్లు వీధివీధినా వెలిశాయి. రజకులు నిర్ణయించిన ధర చెల్లించవలసి వుంటుంది. అయితే యాంత్రీకీకరణ వృత్తిదారుల పొట్ట కొట్టిందనీ, డ్రై క్లీనింగ్ ఆదాయ వనరుగా భావించి రజకులే స్థిరపడ్తున్నారు. ఏమైనప్పటికీ పట్టణాల్లో వృత్తి పని ఆధిపత్య వ్యవస్థ కబంధ హస్తాల నుండి విముక్తి పొంది, స్వేచ్ఛ వాయువులు పీల్చుకొంటుందనవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి