గత నాలుగు వారాలుగా ఇద్దరి పేర్లు దేశమంతటా ధ్వనించాయి; ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. దక్షిణాపథాన, దేశానికి రెండవ రాజధాని అయితే బావుంటుందని బి.ఆర్.అంబేద్కర్ అభిలషించిన హైదరాబాద్లో, ఆ మహామనిషిని ఆరాధిస్తూ, అభ్యసిస్తూ అర్థంతరంగా నిష్క్రమించిన రోహిత వేముల ఒకరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత వేములకు జరిగింది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరగనిచ్చేది లేదంటూ దేశ రాజధానిలో నినదించి, దేశద్రోహం అభియోగంపై జైలుకెళ్లిన కన్నయ్య కుమార్ మరొకరు.
ఈ ఇద్దరి సామాజిక నేపథ్యంలో తేడా ఉంది. దళిత తల్లి కడుపునే పుట్టి, వడ్డెర కుటుంబంలో పెంపుడు అమ్మమ్మ అనాదరణ అనుభవిస్తూ పెరిగినవాడు రోహిత. మారుమూల బిహార్ గ్రామంలో, భూమి హార్లు అనే అగ్రకులంలో పుట్టి వామపక్ష చైతన్యం మధ్య పెరిగినవాడు కన్నయ్య. రాజకీయంగా, తాత్వికంగా ఇద్దరి మధ్యా సారూప్యాలు చాలా ఉన్నాయి. వామపక్ష భావజాలం ఇద్దరినీ ప్రభావితం చేసింది. ఇద్దరూ అంబేద్కర్వాదులు. మనువాద సంస్కృతి ప్రమాదాన్ని, శక్తివంచన లేకుండా దానిని వ్యతిరేకించాల్సిన అగత్యాన్ని ఇద్దరూ గుర్తించారు. అందుకే ఇద్దరూ అణచివేతను ఎదుర్కొన్నారు. గాయపడకుండా ప్రేమించడం సాధ్యంకాని సమాజంలో బతకడం ఎందుకంటూ రోహిత చుక్కల్లోకి ఎగిరిపోయాడు. ధిక్కారాన్నే ఆయుధంగా మలచుకున్న కన్నయ్య తిహార్ జైలులో ఏకాంతంలో ఆలోచనలకు పదును పెట్టుకుంటున్నాడు. ఏబీవీపీకి ఆ అండ ఉంది కాబట్టే దాని ఫిర్యాదు పర్యవసానంగా హెచ్సీయూలో రోహిత వేముల బృందాన్ని సంఘ బహిష్కారం చేశారు. ఆ అండ ఉంది కాబట్టి జేఎన్యూలో కన్నయ్యపై దేశద్రోహ అభియోగం మోపి జైలుకు పంపించారు. లేకపోతే, తన పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఫిర్యాదుపై మంచీ చెడు ఆలోచించకుండా ఒక కేంద్ర మంత్రి, హెచ్సీయూలో చెలరేగుతున్న ‘సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులపై చర్య తీసుకోవాలంటూ’ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు రాస్తారా? జేఎన్యూ, హెచ్సీయూ వంటి ఉన్నత విద్యాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అనుకోకుండా సంభవిస్తున్నవేమీ కావు. ఒకసారి చూడండి. హెచ్సీయూలో గొడవ, ‘ముజఫర్నగర్ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ ప్రదర్శన దగ్గర మొదలైంది.
ఇటు హెచ్సీయూలోనూ, అటు జేఎన్యూలోనూ కూడా అఫ్జల్ గురు ఉరి ఉదంతంపై నిరసన ప్రదర్శనలు ఘర్షణను తారస్థాయికి తీసుకువెళ్లాయి. దేశ భక్తిని, జాతీయతను రంగంపైకి తెచ్చేందుకు ఈ నిరసనలను ఏబీవీపీ ఉపయోగించుకుంది. మరణశిక్షను ప్రాథమికంగా వ్యతిరేకించడం మాట అటుంచండి. అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్లకు ఆ శిక్ష అమలు పరచడంలో న్యాయ ప్రక్రియ సవ్యంగా పూర్తి కాలేదని చాలామంది న్యాయ కోవిదులు భావిస్తున్నారు. తమ అభిప్రాయాలను వారు నిష్కర్షగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తలెత్తిన నిరసనలను ఏబీవీపీ జాతి వ్యతిరేక నిరసనలుగా చిత్రస్తున్నది. దానికి కేంద్ర ప్రభుత్వం అండ లభిస్తోంది.
అఫ్జల్ గురు ఉరిని తీవ్రంగా నిరసించిన పీడీఎఫ్తో కలిసి జమ్మూకాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఈ మాట అనడం ఏమిటన్న ప్రశ్నకు ఆ వైపు నుంచి ఎవరూ సమాధానం చెప్పరు. పంజాబ్లో భింద్రన్వాలా భజనను కిమ్మనకుండా భరిస్తున్న అకాలీదళ్తో అంటకాగుతున్న బీజేపీకి ఇవేమీ పట్టవు. అధికారం అన్నిటికన్నా ముఖ్యం. బీజేపీ మత ప్రాతి పదికన రాజకీయాలు నడుపుతున్నది అధికారం కోసమే. చరిత్రలో చూసినా, వర్తమానంలో చూసినా మతం కోసమే మతం నడక ఎన్నడూ లేదు. అధికారం కోసమే మతం నడక.
ఏ ఉన్నత విద్యాలయం మెట్లు ఎక్కని స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్రమోదీ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మానవ వనరుల శాఖ ఇచ్చారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఉన్న విద్యా సంస్థలపై, పరిశోధనాలయాలపై ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా కర్ర పెత్తనం చేసి హిందుత్వ ఎజెండా అమలుపరచడం స్మృతి ఇరానీ వంటి వారికే బాగా సాధ్యపడుతుంది. నరేంద్ర మోదీని, ఆయన ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తున్నారన్న కారణంగా అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ను ఒకచూపు చూడండని మద్రాస్ ఐఐటీ లాంటి సంస్థకు మరొకరు సరాసరి లేఖ రాయగలరా? హెచ్సీయూలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ‘సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక’ కార్యకలాపాలపై చర్య ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నిస్తూ వరుసగా అయిదు ఉత్తరాలు రాసే పట్టుదల మానవ వనరుల మంత్రిత్వ శాఖకు మరొకరి నాయకత్వంలో ఉంటుందా?
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది. ప్రధాని మోదీ జపిస్తున్న అభివృద్ధి మంత్రానికీ, మత ప్రాతిపదిక రాజకీయాలకూ మధ్య వైరుధ్యం ఉందని బీజేపీ పెద్దలు భావించడం లేదు. బహుళజాతి, స్వదేశీ కార్పొరేట్లకు దేశ వనరులను దోచిపెట్టే కార్యక్రమం ప్రభుత్వ మార్పిడి తర్వాత ఆగలేదు.
ఆగుతుందన్న పిచ్చి భ్రమ ఎవరికీ లేదు కూడా. ఈ క్రమంలో తీవ్రంగా నష్టపోయేది చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు, కార్మికులు పట్టణాలలో పోగుపడుతున్న కోట్లాది అసంఘటిత రంగం కార్మికుల వంటి నోరూవాయి లేని వర్గాలు. ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల ప్రభావితం అయ్యేవారిలో ఎక్కువమంది దళితులు, క్షీణిస్తున్న చేతి వృత్తులపై ఆధారపడే వెనుకబడిన వర్గాలు వారు. ఈ వర్గాలు హక్కుల కోసం పోరాడడం అంటే కార్పొరేటీకరణను వ్యతిరేకించడమే. కాబట్టి మత ప్రాతిపదిక రాజకీయాలు ఉభయతారకంగా ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది.
వామపక్షాల బలం క్షీణించకుండా ఉంటే బీజేపీ నడకలో ఇంత తెంపరితనం కనబడేది కాదేమో! వామపక్షాల బలం గత పదేళ్ళలో గణనీయంగా తగ్గిపోయింది. 14వ లోక్సభలో 59మంది లోక్సభ సభ్యులున్న వామపక్షాల బలం 2009 ఎన్నికల్లో 24కు పడిపోయింది. 2014 ఎన్నికలకు వచ్చేసరికి 11కు క్షీణించింది. ఈ పరిణామాలకు కారణాలు వెతకడానికి ఇది సందర్భం కాదు. కానీ వామపక్షాలలో లోతైన ఆత్మవిమర్శ అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. సైద్ధాంతికంగా వామపక్షాలతో విభేదించే ప్రజాస్వామిక వాదులు కూడా దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వామపక్షాల ఉనికి ఇంకాస్త బలంగా ఉంటే బావుండునని అనుకుంటారంటే అందులో విడ్డూరం లేదు.
సరైన రాజకీయ ప్రతిఘటనలేని ఇలాంటి వాతావరణంలో మెజారిటీ మత రాజకీయాలు నడిపే శక్తులు ఎలాంటి ఎత్తులైనా వేయగలవు. స్వతంత్ర భారతంలో ప్రజాస్వామిక, సెక్యులర్ రాజకీయాల స్ఫూర్తికి ప్రాణంపోసిన జవహర్లాల్ నెహ్రూను పూచికపుల్లకింద తీసిపారేయగలవు; నిజాయితీ, నీతి నియమాలకు నిలువెత్తు దర్పణమైన పరిపాలనా దక్షుడు వల్లభ్భాయ్ పటేల్ను హిందుత్వ మార్క్ జాతీయవాదిగా చిత్రీకరించేందుకు తెగబడగలవు; అనునిత్యం మహాత్మాగాంధీ నామజపం చేస్తూనే, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించే నిరంకుశ చట్టంగా ఆయన అభివర్ణించిన దేశద్రోహ చట్టం కింద ఒక విద్యార్థిని నిర్బంధించగలవు; దళితుల గుండెల్లో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న అంబేద్కర్ను సొంతం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తూనే ఆ దళితుల ఆహారపు అలవాట్లపై హిందుత్వ అజెండాను రుద్దగలవు. తాము నిర్ణయించిన విలువలకు విరుద్ధంగా ఎవరైనా నడిస్తే వారి మెడలో దేశద్రోహి, జాతి విద్రోహి అన్న బిళ్లలు వేలాడదీయడమే. ఈ విషయంలో ‘దేశభక్తు’లయిన బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శకయినా వెనుదీయరు.
-ఆలపాటి సురేశ్ కుమార్
జర్నలిస్టు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి