
జేఎన్యూలో దేశద్రోహులు తయారయ్యారు.. నాలుగు నెలలపాటు మూసెయ్యాలి... తాము దేశభక్తలమనే అఫిడవిట్ ఇచ్చినవాళ్లకే యూనివర్సిటీలో సీటు ఇవ్వాలని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో, జేఎన్యూలో జరిగిన, జరుగుతున్న పరిణామాల వెనుక ఉన్న సంఘపరివార్ అసలు ఉద్దేశాన్ని ఆయన చాలా బాహాటంగా ప్రకటించారు.
ఏ మాత్రం దాపరికం లేకుండా హిందుత్వ శక్తులు సామాజిక రంగాలన్నిటినీ, ముఖ్యంగా సృజనాత్మక, మేధో రంగాలన్నిటినీ దురాక్రమించాలనుకుంటున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి చెప్పలేదుగాని ఆయన మాటల్లోని అంతరార్థమేమంటే.. ఇక నుంచి జాతీయత, దేశభక్తి అంటే ఏమిటో సంఘపరివార్ పెట్టే పరీక్షలో క్వాలిఫై అయిన వారికే యూనివర్సిటీల్లో సీటు ఇస్తారు. విద్యార్థులకే కాదు, అధ్యాపకులకు కూడా. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్నంత మాత్రాన ప్రొఫెసర్ ఉద్యోగాలు వస్తాయని భ్రమపడటానికి లేదు. సంఘపరివార్ దగ్గర ఉన్న జాతీయవాదం అనే సిలబ్సలో పరీక్ష రాసి పాసవ్వాలి. కాశ్మీర్ మీద నీ వైఖరి ఏమిటి అనే అతి ముఖ్యమైన ప్రశ్న అందులో ఉంటుంది. దానికి అక్షరం పొల్లుపోకుండా బీజేపీ చెప్పే పాఠాన్ని వల్లెవేయాలి. లేకపోతే ప్రొ. గిలానీ లాంటి వాళ్లు యూనివర్సిటీల్లో జొరబడకుండా అడ్డుకోలేం. ఇదీ ఆయన మాటల అసలు అర్థం. దేశభక్తి లేని వారి వల్లే జేఎన్యూ ప్రతిష్ట దెబ్బతింటోందని బీజేపీ ఎంపీ ఉదిత్రాజ్ కూడా అన్నారు.
దేశభక్తి అనే మాట పైకి వినిపిస్తున్నది కాని వాళ్లు కోరుకుంటున్నది హిందూభక్తి. హిందూ మతం పట్ల దేశ ప్రజానీకమంతా భక్తి ప్రపత్తులతో కైమోడ్చి ఉండాలి. వాళ్లు చెబుతున్న హిందుత్వ పట్ల అందరం విధేయంగా పడి ఉండాలి.
అందుకే హిందుత్వను తూలనాడితే తాట తీస్తాం అని జాతీయత, జాతీయవాదం అనే పదాల మధ్య అసలు మాట చెప్పేస్తున్నారు. జేఎన్యూను హిందుత్వ విశ్వవిద్యాలయం చేయాలనే ఎజెండా వాళ్లకు ఉన్నది. దాని కోసమే ఇదంతా. సెంట్రల్ యూనివర్సిటీలో ముజఫర్ నగర్, మెమన్ వివాదాస్పదమైతే, జేఎన్యూలో అఫ్జల్గురు, కాశ్మీర్ వివాదాలుగా మారాయి. ఒక రకంగా హైదరాబాదు యూనివర్సిటీలో సంఘపరివార్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా రోహిత్ ఆత్మహత్యపై ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందన వచ్చింది. ఆ మేరకు ఏబీవీపీ అన్ పాపులర్ అయింది. అయినా అది వెనక్కి తగ్గకుండా జేఎన్యూలో అంతకంటే తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడింది. రోహిత్ విషయంలో చేసిన వాదనలకంటే అత్యంత ప్రమాదకర వాదనలు తెచ్చింది. ఇంకోపక్క నుంచి బీజేపీ నాయకులు, మంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇక నుంచి నలుగురు గుమికూడిన ప్రతిచోటా సంఘపరివార్ కార్యకర్తలు దూరిపోయి పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చేస్తారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా తమ పవిత్ర దేశభక్తిని చాటుకోవాల్సిన దుస్థితిలో పడిపోతారు. అందుకని నిత్యం అప్రమత్తంగా ఉంటూ సంఘపరివార్ జాతీయవాదాన్ని బట్టీయం పట్టాలి. అంత మాత్రమేకాదు, దాన్ని ఆచరిస్తూ పోవాలి. లేకపోతే ఏ బలవత్తర క్షణానైనా దేశద్రోహులనే ముద్ర మోయాల్సి వస్తుంది. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని ఇల్లు ఎగిరేలా అరుస్తూ సంఘపరివార్ జాతీయవాదాన్ని వ్యతిరేకించడం అయ్యేపని కాదు. అప్పుడు సంఘపరివార్ ‘దేశభక్తి’, మీ దేశభక్తీ ఒకటే అవుతాయి.
మన దేశభక్తిని కాశ్మీర్ సున్నితపు త్రాసులో తూచేస్తుంది. భక్తికి ఎన్ని మార్గాలు, నిర్వచనాలు ఉన్నాయో మన దేశంలో దేశభక్తికి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ‘జాతీయోద్యమం’ నుంచి పుట్టుకొచ్చాయి. అందుకే ఈ దేశంలో ముస్లిం అస్తిత్వమని అన్నా, ముస్లింల హక్కుల పక్షాన నిలబడినా దేశభక్తి జ్వాలలకు దహనం కావాల్సిందే. ఇప్పుడు గురజాడ బతికి ఉంటే దేశమంటే మట్టి కాదు మనుషులు అన్నందుకు సెడిషన్ కేసు తప్పక పెట్టేవారే. వాస్తవానికి వాళ్ల అర్థంలో దేశమంటే హిందుత్వ. జాతీయత అంటే హిందూ జాతీయత. రెండో మాట మాట్లాడితే దేశద్రోహమే.
బీజేపీ పాలన అతి కొద్ది కాలంలోనే చేరవలసిన తీరమే చేరింది. అది కాశ్మీర్ ‘వివాదం’. దీనికి నేపథ్యంలో ఉరిశిక్షల సమీక్ష సాగుతున్నది. అసాధారణ కేసుల్లోనే ఉరిశిక్ష అమలు చేయాలనే వాదన వినిపిస్తోంది. చూడ్డానికి ఇది ఎంత బాగుంది! అయితే ఏమిటా అసాధారణం? రాజ్యాన్ని ధిక్కరించే చర్యలు... ‘ఉగ్రవాద చర్యలు’. ఈ దేశ పౌరులైనందుకు భారత రాజ్యం ముస్లింలకు శాశ్వత ప్రత్యేక కానుకగా ఉరిశిక్ష ఇవ్వబోతున్నది. భారత శిక్షాస్మృతి ఉరిశిక్షను ముస్లింలకు కేటాయించనుంది. ఏ చర్య రాజ్య వ్యతిరేకం? ఎవరు ఉగ్రవాది? అనేది బైటికి చర్చింకపోవచ్చుగాని ఎన్నడో నిర్ధారణ అయిపోయింది. ముస్లింలు చేసే పనులన్నీ అలాంటి జాబితా కిందికి వస్తాయి. ముస్లింలందరూ ఉగ్రవాదులవుతారు. ఈ కానుక ఎప్పుడు ఎవరి మెడను అలంకరిస్తుందో చెప్పలేం. అంతే.హైదరాబాదు యూనివర్సిటీలో మెమన్, జేఎన్యూలో అఫ్జల్గురు వివాద చర్చా సందర్భాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. కాకపోతే రాజ్య వ్యతిరేకుల, దేశద్రోహుల జాబితాలోకి ముస్లిం తర్వాత మావోయిస్టులు వస్తారు. జేఎన్యూలో జరిగిన సభలో దేశవ్యతిరేక నినాదాలు ఏఐఎ్సఎఫ్ విద్యార్థులు ఇచ్చి ఉండకపోవచ్చు.. మావోయిస్టు అనుబంధ విద్యార్థులు ఇచ్చారనే వదంతి మొదలైంది. ఇందులో ‘దేశద్రోహాన్ని’ గుర్తించే ప్రయత్నం ఉన్నది. చివరికి ఇప్పుడు ఒకటే మిగిలింది. సంఘపరివార్ చేతిలో దేశద్రోహ ముద్ర వేయించుకొని.. అబ్బే.. మేం దేశద్రోహులం కాదు. అసలు మా అంత దేశభక్తులు ఎవరున్నారు? అని వాళ్లు చెప్పే దేశభక్తి గొంతుతోనే మాట్లాడటమా? లేక మేం అసలు సిసలైన దేశద్రోహులమనే వాదన వినిపించడమా? ఎందుకంటే ఇప్పుడు దేశభక్తి అంటే సంఘపరివార్ హిందూ జాతీయవాదం తప్ప మరేమీ లేదు. అదే రామభక్తి, అదే దేశభక్త
వలస వ్యతిరేక కాలంనాటి దేశభక్తిలో ఉండిన ‘మంచి’ ఇప్పుడు శతాంశం కూడా లేదు. ఈ రోజుల్లో దేశభక్తి గురించి మాట్లాడటమంటే సంఘపరివార్ మాటలు వల్లించడమే. వాళ్ల పరీక్షలో పాసవ్వడానికి తాపత్రయపడటమే. ఎందుకంటే సంఘపరివార్ దేశభక్తి గురించి గగ్గోలు పెడుతోంది కాని ప్రజాస్వామ్యమనే మాట పొరబాటున కూడా అనదు. పార్లమెంటరీ పరిధిలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా కొరివితో తలగోక్కున్నట్ల్లవుతుంది. ఆ గోలంతా ఎందుకు? చక్కగా దేశభక్తి అనే రామాస్త్రం ఉండగా. జాతీయత ఉండగా... ఇదీ వాళ్ల వరస. వాళ్లకు ఈ స్పష్టత ఉండటం పరోక్షంగా మేలు చేస్తుంది. దేనికంటే వలస వ్యతిరేక కాలంనాటి ధిక్కారాలను దేశభక్తిలోని ‘రాజ’మార్గం నుంచి తప్పించి ప్రజాస్వామిక సంప్రదాయాలుగా గుర్తించాలి. మేము వాటి వారసులమని ప్రజాస్వామిక లౌకిక విప్లవ శక్తులు సగర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు మేమే అసలైన దేశభక్తులమని వాదించే దుస్థితి తప్పుతుంది. ప్రజాస్వామ్యం లేని దేశభక్తి అంటే ఫాసిజమే. ప్రజాస్వామ్య విలువలు, సంస్కృతి, జాతుల వికాసం గీటురాయిగాగల దేశద్రోహం వర్థిల్లాలి అని నినాదం ఇవ్వడం ఎంత బాగుంటుంది?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి